8, జనవరి 2009, గురువారం

చిలుక పరకాయప్రవేశం - 2

(నిన్నటి కధ తరువాయి బాగం)

భట్టి అక్కడ ఉజ్జయినిలో అలా మదన పడుతున్న సమయంలో, ఇక్కడ విక్రమార్కుడు అడవిలోని చిలుకలన్నింటికి రాజయిపోయి సుఖమయ జీవితం సాగిస్తున్నాడు. 1000 చిలుకలకి రాజుగా ఉంటున్న చిక్రమార్కుడు చిలకలన్నీ కలసికట్టుగా జీవించాలి, కలిసికట్టుగానే ఆహారం సంపాదించుకోవాలి లాంటి శాసనాలు చేయించాడు.

ఒకసారి ఒక వేటగాడు ఆ అడవిలోని 1000 చిలుకలు కలిసి తిరగడం, అన్నీ కలిసి ఒక పెద్ద చెట్టుమీద నివసించడం గమనించాడు. వెంటనే వాడు చిలుకలు ఆహారం సంపాదించడానికి వెళ్ళినప్పుడు, ఆ చెట్టుక్రింద వల పన్నాడు. చిలుకలు తిరిగి వచ్చినప్పుడు విక్రమార్కుడు వల గమనించి హెచ్చరించేలోపే చిలకలన్నీ వెళ్ళి చెట్టుక్రింద వాలినై. అవన్నీ వలలో చిక్కుకుపోగా, విక్రమార్కుడు మాత్రం వలలో చిక్కుకోలేదు. కానీ రాజుగా మిగిలిన చిలుకలన్నీ వలలో చిక్కుకున్నప్పుడు తను వెళ్ళరాదు అని ఆలోచించి, విక్రమార్కుడు కూడా వలపై వాలాడు.

దూరంనుంచి వేటగాడు ఆ చెట్టువైపు రావడం గమనించాయి చిలుకలన్నీ. వెంటనే అన్నీ చిలుకలూ కలిసి విక్రమాదిత్యుణ్ణె, తప్పించుకునే మార్గం చెప్పమని బ్రతిమాలినై. విక్రమార్కుడు బుర్రకు పదును పెట్టి, చివరికి ఇలా చెప్పాడు,
"మీరంతా కూడా చనిపోయినట్టు నటించండి. వేటగాడు ఒక్కొక్క చిలుకనీ వలనుండి తప్పించి నేలమీద పడేస్తాడు. అందరూ కూడా చిలుకలు కింద పడ్డప్పుడు వచ్చే శబ్ధాన్ని లెక్కించుకోండి. మొత్తం 1000 సార్లు క్రింద పడ్డ శబ్ధం వచ్చినప్పుడు, అందరూ కూడా ఒక్కసారిగా ఎగరాలి.”

విక్రమార్కుడి ప్రతిపాదనకి చిలుకలన్నీ సమ్మతించినై. అవన్నీ కూడా చనిపోయిన వాటిలాగా నటించినై. అది చూసి వేటగాడు ‘ఆహా! ఈ చిలుకలు ఎందువల్లనో గానీ చనిపోయినై, వీటిని ప్రత్యేకంగా చంపాల్సిన పని తప్పించినై’ అనుకుంటూ, చిలుకలని వలనుంచి తప్పించి నేలమీద పడవేయసాగాడు. అలా 999 చిలుకలని పడేసాడు. చిలుకలు కూడా చక్కగా లెక్కపెడుతున్నాయి. చివరి చిలుక విక్రమార్కుడు మాత్రం మిగిలి ఉన్నాడు. కానీ ఇంతలో వేటగాడి బాకు ఒరలోంచి క్రింద పడింది. చిలుకలు వెయ్యొ చిలుక క్రింద పడింది అనుకుని, ఒక్కసారిగా ఎగిరినై. అది చూసి వేటగాడు “దొంగ చిలుకలు!” అనుకుంటూ విక్రమార్కుణ్ణికూడా వలనుంచి తీసి చంపబోయాడు. కానీ విక్రమార్కుడు “ఆగు! ఓ బొయవాడా! నన్ను చంపితింటే నీవు ఈ పూటకి మాత్రమే కడుపు నింపుకోగలవు. అదే నేను నీకిచ్చే సలహా విన్నావంటే కొన్నాళ్ళపాటు సుఖంగా ఉంటావు” అని మనిషి బాషలో అన్నాడు.

ఒక చిలుక మనిషి బాషలో మాట్లాడడం చూసి బోయవాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. “ఏంటి నువ్వు ఇచ్చే సలహా?" అని అడిగాడు వాడు.

"నువ్వు నన్ను పట్నానికి తీసుకెళ్ళి 1000 హొన్నులకి నన్ను అమ్ముతానని చెప్పు. అందరూ అంత ఎక్కువ ఖరీదు ఎందుకు అని అడుగుతారు నేను వారికి సరైన సమాధానం చెపుతాను. అలా వచ్చే డబ్బుతో నువ్వు కొన్నాళ్ళు పాటు సుఖంగా ఉండచ్చు.” అన్నాడు విక్రమార్కుడు.

బోయవాడికి ఈ ఆలోచన బాగా నచ్చింది. ఆ చిలుకను ఒక పంజరంలో పెట్టి తీసుకొని, వాడు పట్నంకి బయలుదేరి వెళ్ళాడు.

పట్నంలో ఎంతో మంది ‘చిలుక ఎంతకి అమ్ముతావు’ అని అడిగి వాడు చెప్పిన ఖరీదు విని, ‘వీడికి అత్యాశ ఎక్కువ అనుకుంటా’ అనుకుని వెళ్ళిపోయారు. విక్రమార్కుడు వాళ్ళెవరికి ఏమి చెప్పలేదు.

ఆ ఊళ్ళో ఒక శెట్టి ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు మణివేగు. మణివేగుని కొరకు ఒక దుకాణం పెట్టించి, అతనికి వ్యాపారంలోని మెళకువలు నేర్పాలని ఆ శెట్టి అనుకున్నాడు. ఆ విషయమై చర్చించడానికి పెద్దమనుషులతో ఒక సమావేశం ఏర్పాటు చేసాడు ఆ శెట్టి. ఆ సమావేశానికి వెళ్ళడానికి మణివేగు బయలుదేరాడు. దారిలో ఈ బోయవాణ్ణి చూసి,

"ఓయీ! బోయా! నీ వద్ద ఉన్న చిలుకను నాకు అమ్ముతావా? అమ్మేట్టయితే వెల ఎంత?" అని అడిగాడు.

బోయవాడు 1000 హొన్నులని చెప్పాడు.

"నీకు మతిగాని బ్రమించినదా! ఎవరైనా చిలుకని ఇంత ఎక్కువ వెల చెప్తారా? నీ ఆశ కూలా.” అంటూ ఒక ప్రేవేటు తీసుకున్నాడు మణివేగు.

కానీ ఇంతలో విక్రమార్కుడు “శెట్టిగారూ! ఇటు రండి! ఒక సారి నేను చెప్పేది వినండి” అంటూ పిలిచాడు. మామూలుగా చిలుకలు ఎవరైనా నేర్పిన మాటలని తిరిగి మాట్లాడతైగానీ సొంతంగా మాట్లాడవు. కానీ విక్రమార్కుడు ఆ చిలుకలో ఉన్నాడు కాబట్టి సొంతంగా మాట్లాడ గలిగాడు అని మణివేగునికి తెలియదుగా, అందుకని చాలా ఆశ్చర్యపోతూ చిలుక దగ్గరికి వెళ్ళాడు.

"శెట్టిగారూ! ఈ రోజు మీ నాన్నగారు మీ కోసం ఒక అంగడి తెరిపించాలని అనుకుంటున్నారు. ఆ విషయం చర్చించడం కోసం పెద్ద మనుషులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ శుభదినం మీరు వెనకా ముందు చూడక ఈ వేటగాడికి 1000 హొన్నులు ఇవ్వండి. నెల తెరగక మునుపే నేను మీ అంగడిలో ఉండి మీకు 10 వేల హొన్నులు సంపాదించి పెడతాను” అని చెప్పాడు విక్రమార్కుడు. ఈ మణివేగుని గురించి ఎవరో మాట్లాడుకోవడం విని, మణివేగుణ్ణి చూడగానే ఆయన్ని గుర్తించి ఇందంతా చెప్పాడు విక్రమాదిత్యుడు.

మణివేగునికి ‘ఈ చిలుక మృధుమధుర మాటలే పది వేలు’ అని తలచి, వెం‍టనే కొనుక్కున్నాడు.

కధలో తరవాత తిరుగుబోవు మలుపుల గురించి తరవాత టపాలలో వివరిస్తాను. అప్పటి వరకు ఇప్పుడు చెప్పిన కధతో సరిపెట్టుకోండీ! ప్లీజ్!

6 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

Wav.. I am eagerly waiting for the remaining parts of the story.

durgeswara చెప్పారు...

maayurE!

marala mammaulanu maa vikramaarkulavaari vaddaku chErchucumTiri.

అజ్ఞాత చెప్పారు...

Nice story.. very interesting..

Unknown చెప్పారు...

చక్కని తెలుగు కధలు రాస్తూ మధ్యలో హారీపోటరు థీమేమిటండీ?
నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలు రాస్తే తరగతిలో చదవడం సులభమైనా, కంప్యూటరులో చదవడం చాలా కష్టంగా ఉంది.

Aha!Oho! చెప్పారు...

వ్యాఖ్య రాసినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఫాంట్ సైజ్ పెంచి రంగు మార్చాను. బాగుందనే అనుకొంటున్నాను. లేకపోతే మీరు ఫాంట్ రంగును సూచించగలరు.
ప్రదీప్ అన్న: మీరు కొత్తగా నన్ను అండీ అంటున్నారు ఏమిటి? తెలుగుకథలు రాస్తూ హారిపోటర్ ధీమ్ ఎందుకంటే, మన తెలుగు సాహిత్యంతో పోలిస్తే హారిపోటర్ తొక్క అని గుర్తుచేయటానికి.

Unknown చెప్పారు...

హారీపోటరు తొక్క అన్నది నా ఉద్దేశం కాదు,
ఒకటి చెప్పు, గుడికి వెళ్ళి పాప్ పాటలు పాడితే ఎలా ఉంటుంది? భారతీయ సాహిత్యపు కధలు రాస్తూ హారీపోటరు థీమ్ పెట్టేసరికి అలా ఉన్నట్టనిపించింది.
పుస్తకం లోపల ఉన్న విషయం ఎలాంటిదైనా దాని ముఖచిత్రం బట్టే కదా మొదటి ఇంప్రెషన్ కలిగేది. అందుకే థీమ్ గురించి వ్యాఖ్యానించాను