16, ఏప్రిల్ 2009, గురువారం

రాజకీయ దారుణాలు



ఈ రాజకీయ దారుణాలని నేను చూడలేనబ్బా!



15, ఏప్రిల్ 2009, బుధవారం

ఓటు లేని ఒక ఓటరు విలాఆఆఆఆపం



దేవుడా, నాకు ఓటు లేదన్నా వీళ్ళందరూ నావెంట పడుతున్నారు, నన్ను కాపాడు!

4, మార్చి 2009, బుధవారం

నా గీతల్లో వివేకానందుడు [బొమ్మ]



వివేకానందుడి `ఫోటో’ చూసి నేను వేసిన ఈ బొమ్మ నా తొలి ప్రయత్నం. వివేకానందుడి జీవిత చరిత్ర చదివినప్పటి నుండి ఆయన బొమ్మ వేయాలని కలలు కనేదాన్ని కానీ, ధైర్యం మాత్రం చాలేది కాదు. తీరా నేను బొమ్మ వేశాక ఎవరైనా ఆ బొమ్మని చూసి "ఏంటి ఈ బొమ్మ? ఎవరి బొమ్మా నువ్వు వేసింది?" అని అడగాల్సి వస్తుందేమోనని పెద్ద అనుమానం. అప్పుడు నాకు నేను ‘అయ్యవారిని చెయ్యబోతె కోతి అయ్యింది’ అన్న సామెత చెప్పుకోవాల్సి వస్తుంది కదా!

కానీ ఇన్నాళ్ళకి నా కలలు సాకారం అయ్యాయి!

నేనూ మార్గదర్శిలో చేరాను. ఒక బొమ్మ వేశాను.

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

జల భూతం కధ

చాలా రోజుల నుండీ పెద్ద పెద్ద కధలు రాస్తున్నాను కదా! రాసీ రాసీ నాకైతే ఓపిక అయిపోయింది. అందుకని కొన్ని రోజులు కొన్ని చిన్న కధలు రాయాలనే ఉద్దేశంతో నాకు ఇష్టమైన ఈ చిన్న కధను రాస్తున్నాను. ఈ కధ ఏ పుస్తకంలోనిదో చెప్పలేను కానీ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కధ అని మాత్రం చెప్పగలను.

రామాపురం అనే ఊరిలో ఉండే రాజయ్యకి ఇద్దరు కొడుకులు. రాజయ్య చనిపోగానే రాజయ్య పెద్ద కొడుకు పొలం, ఇల్లూ, గొడ్డు గోదా అంతా ఆస్తీ తీసేసుకున్నాడు. రాజయ్య రెండో కొడుకు అయిన `చిన్నతమ్ముడు’,
"అన్నా! మరి నా వాటా ఆస్తి ఏది?" అని అడుగగా,
"ఇదుగో, ఈ నారతాడు నీ వంతు ఆస్తి. ఇంక పో” అని అటక మీద ఉన్న నారతాడుని చిన్నతమ్ముడికి ఇచ్చాడు అన్న.

చిన్నతమ్ముడు చాలా మంచి వాడు అవటం వల్ల ‘సర్లే పోనీ. అన్నకి ఆస్తి అంతా తీసుకోవాలని ఉన్నట్టుంది’ అని తనకి తను సర్ధి చెప్పుకుని ఊరుకున్నాడే కానీ పంచాయితీ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు.

చిన్నతమ్ముడికి చేతి పనులు చాలా బాగా చేయడం వచ్చు. వాడు ఊరు చివర ఉన్న అడవిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నారతాడుతో వలలూ, ఉచ్చులూ అల్లుకుని వాటితోటి ఒక కుందేలుని, ఒక ఉడతని పట్టుకున్నాడు.

మళ్ళీ అదే తాడుతో ఒక సంచీ లాంటి దానిని అల్లి వాటిని ఆ సంచీలో వేసుకుని బయలుదేరాడు.

అలా నడుచుకుంటూ వెళ్ళీ వెళ్ళీ, చివరికి చిన్నతమ్ముడు ఒక చిన్న జలాశయం పక్కన కూర్చున్నాడు. వాడు అక్కడ కూర్చుని ఉండగా ఒక ఎలుగుబంటి పక్కనే ఉన్న చెట్టుపొదలోకి వెళ్ళడం చూసాడు. మళ్ళీ వాడు మెదలకుండా కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తూ చిన్నతమ్ముడు ఆ జలాశయంలోని నీళ్ళ వైపే చూడసాగాడు.

అయితే ఆ నీటిలో రెండు జలభూతాలు ఉన్నాయి. ఒక తండ్రి జలభూతం, ఒక కొడుకు జలభూతం. అయితే వాళ్ళకి అస్సలు బుర్రమాత్రం లేదు.

కొడుకు జలభూతం చిన్నతమ్ముడిని చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి
" నాన్నా, నాన్నా! ఎవరో ఒకబ్బాయి మన జలాశయం దగ్గరికి వచ్చాడు. అతను మన నీటివైపే చూస్తున్నాడు. అతని దగ్గర తాడుతో అల్లిన వలలూ, సంచులూ ఉన్నాయి. బహుశా అతను ఆ వలలతో మన నీటినంతా పట్టుకుని సంచులలో వేసి తీసుకుని వెళదాం అనుకుంటున్నట్టున్నాడు” అని చెప్పాడు.

"అవునా? అయితే చాలా ప్రమాదమే. నువ్వొక పని చేయి. అతనితో ఏదో ఒక పందెం పెట్టుకుని అతన్ని ఓడించి ఇక్కడి నుండీ పంపించేయి” అని చెప్పాడు తండ్రి జలభూతం.

ఈ కొడుకు వెళ్ళి “ఏయ్ అబ్బాయ్! ఇక్కడి నుండీ వెళ్ళిపో” అన్నాడు.

చిన్నతమ్ముడు భయపడకుండా “నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను” అన్నాడు.

"అయితే, ఒక పని చేద్దాం. మనిద్దరం ఏదైనా పందెం పెట్టుకుందాం. నేను గెలిస్తే నువ్వు ఇక్కడి నుండీ వెళ్ళిపోవాలి” అన్నాడు కొడుకు జలభూతం.

"సరే!” అన్నాడు చిన్నతమ్ముడు.

"సరే! ఇదుగో ఇక్కడున్న ఈ చెట్టుని నువ్వు నాకంటే వేగంగా ఎక్కగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓస్! ఆపనికి నేనెందుకు? నా బుజ్జితమ్ముడు చేయగలడు” అని అంటూ ఉడుతని తీసి చెట్టుమీదికి వదిలాడు చిన్న తమ్ముడు. ఉడుత ‘బ్రతుకు జీవుడా’ అనుకుని చెట్టుమీదికి పరుగు తీసింది. ఉడుతతో సమాన వేగంతో చెట్టు ఎక్కలేక కొడుకు జలభూతం ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదుగో ఇంకో పందెం. ఈ సారి పందెం ఏంటంటే నువ్వు నాకంటే వేగంగా అడవిలోకి పరిగెత్తగలవా?" అని అన్నాడు.

"ఓసోస్! ఇంతేనా దీనికి నేను ఎందుకు? నా రెండో తమ్ముడు చాలు” అని చెప్పి కుందేలుని వదిలాడు చిన్నతమ్ముడు. అది ఒక్క పరుగున అడవిలోకి పరిగెత్తింది. దానితో సమానంగా పరిగెత్తలేక కొడుకు జలభూతం మళ్ళీ ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదిగో ఇంకొక పందెం. నా అంత గట్టిగా నువ్వు ఎవరినైనా సరే పట్టుకోగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓసోస్ ఓస్! దానికి నేను ఎందుకు? నా పెద్ద తమ్ముడు అదుగో ఇందాకే ఆ చెట్టు పొదలలోకి వెళ్ళాడు. నువ్వు తన దగ్గరికి వెళ్ళు, వదలకుండా పట్టుకుంటాడు” అని చెప్పి ఎలుగు బంటి వెళ్ళిన వైపుకి చూపించాడు చిన్నతమ్ముడు.

కొడుకు జలభూతం వెళ్ళి ఆ పొదలలో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వచ్చిన కొడుకు జలభూతంన్ని ఆ ఎలుగు బంటి గట్టిగా పట్టుకుంది. వాడు దాని దగ్గరనుండీ విడిపించుకునే టప్పటికి తల ప్రాణం తోకకి ఒచ్చింది.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “వీడు సామాన్యుడి లాగా లేడు. వీడితో గొడవ పెట్టుకోవడం కంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా పంపించేయడం మంచిది. కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఈ జలాశయం విడిచి పెట్టి వెళ్ళమని అతనిని అడుగు పో” అని అన్నాడు.

కొడుకు జలభూతం వచ్చి అదే చెప్పాడు.
"సరే! అయితే ఇదుగో నా టోపీ నిండుగా డబ్బు ఇస్తే చాలు” అని చెప్పాడు చిన్నతమ్ముడు.

సరే అని చెప్పి డబ్బు తీసుకురాడానికి కొడుకు జలభూతం వెళ్ళి వచ్చే లోపల చిన్నతమ్ముడు తన టోపీకి ఒక కన్నం పెట్టి, టోపీ పట్టేటంత గుంత తవ్వాడు. అందులో తాడుతో అల్లిన ఒక సంచీ పెట్టి, పైన టోపీ పెట్టాడు. కానీ చూడడానికి మామూలుగా టోపీని నేల మీద పెట్టినట్టుగా ఉంది అంతే.

కొడుకు జలభూతం వచ్చి కొంత డబ్బుని ఆ టోపీలో వేసాడు. అయితే డబ్బంతా క్రింద ఉన్న సంచీలోకి పోయింది. కొడుకు జలభూతం ఇంకొంత డబ్బుతీసుకు వచ్చేలోపల చిన్న తమ్ముడు గుంతలో పెట్టిన సంచీలోని డబ్బుని ఇంకొక సంచీలో నింపి దాన్ని మళ్ళీ ఇందాకటి లాగానే పెట్టాడు. కొడుకు జలభూతం మళ్ళీ డబ్బు తెచ్చి పోశాడు. మళ్ళీ నిండ లేదు. అలా చిన్న తమ్ముడు తను మోయ గలిగినన్ని సంచులు నిండాక ఇక టోపీ క్రింద గుంతలో నిండిన సంచీని పెట్టాడు. దాంతో ఆప్పుడు టోపీ నిండిపోయింది. కొడుకు జలభూతం ‘హమ్మయ్యా!’ అనుకున్నాడు.

చిన్నతమ్ముడు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లూ, పొలం పుట్రా, గొడ్డూ గొదా అన్నీ ఆ డబ్బుతో కొనుక్కుని, ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపాడు.

11, ఫిబ్రవరి 2009, బుధవారం

కృష్ణుడే పోరు తప్పదననీ

9, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 12

(నిన్నటి కధ తరువాయి భాగం)

పయ్యెద “ఓ రాజేంద్రా! ఇప్పుడు చెప్పండి నలుగురు దొంగలలో ఎవరి సామర్ధ్యం ఎక్కువ?” అని అడిగాడు.

"ఓ పయ్యెదా! రాజూ, మంత్రీ, కొత్వాల్, బట్టల వ్యాపారీ వీళ్ళకే ఎక్కువ సామర్ధ్యం ఉంది” అని చెప్పాడు విక్రమార్కుడు.

అప్పుడు పలుకని పడంతి “ఏమయ్యా నువ్వసలు కధ విన్నావా? లేక నిద్ర పోయావా? అసలు కధ అర్ధమైందా? నలుగురు దొంగలే ఎక్కువ సామర్ధ్యం ఉన్నవాళ్ళు” అని చెప్పింది.

విక్రమార్కుడు “ఔనౌను. నువ్వు చెప్పింది పచ్చి నిజం. అయినా ఇప్పుడు అందంతా ఎందుకు కానీ ఒక్కసారన్న నాతో మాట్లాడవచ్చు కదా?" అని బ్రతిమాలాడు.

అప్పుడు పయ్యెద “ఓ రాజవర్యా! మీరెందుకు ఇంకా ఆమెని బ్రతిమాలుతున్నారు? మీరు కావాలని కధలకి జవాబులు తప్పుగా చెప్పగానే, ఈ పలుకని పడంతి ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడేసింది. ఇప్పటికి ఆమె మూడు సార్లు మాట్లాడేసింది. కాబట్టి మీరు గెలిచినట్టే” అని అన్నాడు పయ్యెదలోని భేతాళుడు.

ఆప్పుడు అర్ధమైంది అక్కడున్న వాళ్ళందరికీ తము చేసిన పొరపాటు.

"పలుకని పడంతీ! నీకు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమేనా? నీకు ఇష్టం లేకపోతే నాకే అభ్యంతరం లేదు!” అని అన్నాడు విక్రమార్కుడు. `అంత తెలివైన వాడినీ, తనను ఓడించి ధర్మంగా గెలుచుకుని కూడా తనకి కూడా ఒక మనసు ఉంటుందనీ అర్ధం చేసుకునే అలాంటి మనిషిని ఎలా వదులుకోవడం? అసలు అలాంటి వాడికంటే తనకు కావలిసినది ఇంకెవరు?’ అని యోచించి పలుకని పడంతి విక్రమార్కుడితో వివాహానికి ఒప్పుకుంది. ఇద్దరికీ కూడా వేదవిధులతో వైభవోపేతంగా వివాహం జరిగింది.

ఆ తరవాత భట్టీ, విక్రమార్కుడూ, పలుకని పడంతీ, కొంత మంది పనివాళ్ళతో బయలుదేరారు.

అయితే ఊరు దాటాక విక్రమార్కుడు పలుకని పడంతినీ, భట్టినీ “ఈ పనివాళ్ళతో సహా మీరు ఊరి అడవిలోని ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. నాకు కొంచెం పనుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి నెను వస్తాను” అని చెప్పి విక్రమార్కుడు ఎక్కడికో వెళ్ళాడు.

విక్రమార్కుడు చెప్పినట్టుగానే వీళ్ళు బయలుదేరారు. అయితే విక్రమార్కుడు భేతాళుడి సాయంతో ఒక ముస్సలి వాడి వేషం వేసుకుని ఒక కట్టెలమోపుని మోసుకుంటూ పలుకని పడంతి ఎక్కిన పల్లకీ పక్కనుంచీ నడుచుంకుటూ వెళ్ళాడు.

అంత ముస్సలివాడు అలా మండుటెండలో కట్టెలు నెత్తిన పెట్టుకుని వెళ్ళడం చూసి తట్టుకోలేక పలుకని పడంతి “ఓ స్వామీ! ఎందుకంత కష్టపడీ ఆ కట్టెల మోపుని మీరు తీసుకెళ్ళడం. మా భటులకి ఇవ్వండి వాళ్ళు తెచ్చిపెడతారు” అని చెప్పింది.

"లేదు లేదు! ఇది అసలు కట్టేల మోపు కాదు. ఇవి సమిధులు [యఙ్ఞం కోసం వినియోగించే కట్టెలు] వీటిని బ్రాహ్మణులు లేదా క్షత్రియులు మాత్రమే మోసుకెళ్ళాలి. అన్యులు తాకకూడదు” అని చెప్పాడు వృధ్ధుడి రూపంలోని విక్రమార్కుడు.

పలుకని పడంతి క్షత్రియ కన్య కనుక “సరే ఐతే నాకివ్వండి.నేను క్షత్రియురాలిని” అని చెప్పింది పలుకని పడంతి. విక్రమార్కుడు ఆమె చేతికి ఆ సమిధులు ఇచ్చాడు.

ఆమె ఆ సమిధులని నెత్తిమీద పెట్టుకుని మర్రి చెట్టు కొమ్మదాకా నడిచివాచ్చింది.

విక్రమార్కుడు తను వేసిన పందెంలో గెలిచాడు.

(సమాప్తం)

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 11

(నిన్నటి కధ తరువాయి భాగం)

[ఈ సారి కధలోని ముప్పావు దొంగ దొంగిలించే విధానం అంతా ఇంతక మునుపు నేను రాసిన కధ ‘రేచుక్క, పగటి చుక్క’ కధను పోలి ఉంటుంది. అందుకనే ఈసారి ముప్పావు దొంగదే కాక నిండు దొంగ దొగతనాన్ని కూడా రాస్తున్నాను. నిజానికి ఈ కధనే నిజం కధ. ‘రేచుక్క, పగటి చుక్క’ కధ దీట్లోంచీ, ఇంకా ఇలాంటి కొన్ని కధలలోని కొన్ని సన్నివేశాలు తీసుకుని తయారు చేసిన కధ అని గుర్తించగలరు.]

రాజు ఈ సారి దొంగని పట్టుకునే పనిని మంత్రికి అప్పగించాడు.

ఈ సారి కార్తికేయుడు ముప్పావు దొంగని ఒక ఘనమైన దొంగతనం చేయమని ఆదేశించాడు.

కుంతల నగరానికి వచ్చిన ముప్పావు దొంగ జరిగిందంతా విని, ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో

"చూడూ! దొంగ ఈ రోజు మన ఇంటికి దొంగతనానికి వస్తాడని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దాం. అలాగే పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టుకోటానికి. దొంగ నాలాగా వేషం వేసుకొని వస్తాడట” అని చెప్పాడు ముప్పావు దొంగ.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టారు వాళ్ళంతా. వాళ్ళని “దొంగ వచ్చినట్టున్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక పెద్ద రాయి పడేసి. విలువైన వస్తువులను పక్కనే ఉన్న గుబురు పొదలో పడేసాడు ముప్పావు దొంగ.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొంగా! వాణ్ణి పట్టుకొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు ముప్పావు దొంగ.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లాడుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు. ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లాడటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గర స్నానం చేసి వస్తాను” అని చెప్పి, ముప్పావు దొంగ పొదలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.


మంత్రి అయ్యుండీ అతను మరీ అంత ఘోరంగా అపహాస్యం పాలయ్యేటప్పటికి రాజుకు ఇంక ఏం చేయాలో పాలుపోలేదు. సరే అనుకుని ‘తనే దొంగని పట్టుకుంటానని’ రాజు ప్రకటించాడు.

అక్కడ మాతంగ పురంలో కార్తికేయుడు ముప్పావు దొంగ చేసిన దొంగతనానికి ఎంతో సంతోషపడ్డాడు. ఈసారి అందరికన్నా పెద్ద వాడైన నిండు దొంగని “దొంగతనం చేసి ఏదైనా తీసుకురా పో!” అని చెప్పి పంపించాడు.

నిండు దొంగ కుంతల నగరంకి వచ్చి వాకబు చేయగా రాజుగారే దొంగని పట్టుకుంటానన్నాడని తెలుసుకున్నాడు.

"ఓహ్హో! అలాగా!” అనుకుని తను చేయాల్సిన దొంగతనం ఎంటో? ఎలా చేయాలో? వేంటనే అంచనాలు వేసుకున్నాడు నిండు దొంగ.

ఆ రోజు రాత్రి నిండు దొంగ ఊరి చివర ఒక బడ్డి కొట్టు పెట్టుకుని, ఆ కొట్టుకు పక్కనే పడుకోడానికి రెండు పక్కలు వేసి, దీపం పెట్టుకుని, అక్కడ ఎదురు చూడడం మొదలుపెట్టాడు.

ఆ రోజు రాత్రి రాజు దొంగని పట్టుకోవాలన్న ఉద్దేశంతో గస్తీ తిరిగే భటులతోపాటూ తను కూడా వచ్చాడు.

ఊరి చివర ఉన్న ఆ బడ్డి కొట్టులోని దీపం చూసి రాజుగారూ, కొంత మంది భటులూ అక్కడికి వచ్చి ఆ పడుకోడానికి వేసి ఉన్న చాపలూ అన్నీ చూసారు. నిండు దొంగని “ఏయ్ అబ్బాయ్! ఇంత అర్ధ రాత్రి పూట ఎవరు వస్తారని నీ బడ్డి కొట్టు తెరిచి పెట్టుకున్నావు? ఆ చాపలు, దిండూ అవన్నీ ఎవరి కోసం పెట్టావు? నిజం చెప్పు” అని గద్దించాడు రాజు.

నిండు దొంగ భయపడుతూ భయపడుతూ “అయ్యా! క్షమించండి! కొన్నాళ్ళగా మన దేశంలో దొంగతనాలు చేస్తున్న ఆ దొంగలు రాత్రి పూట ఇక్కడికి వచ్చి, నేను తీసుకొచ్చిన భోజనం తిని, ఇక్కడే నిద్ర పోతారు. పొట్టకూటి కోసం ఈ బుద్ది తక్కువ పని చేసాను. నన్ను క్షమించండి” అంటూ బ్రతిమాలాడు.

"సరే! కానీ నువ్వు, మేము దొంగని పట్టుకోటానికి సాయం చేయాలి. ఏం, సరేనా?" అన్నాడు రాజు.

"అలాగే మహారాజా! కానీ మీ సైనికులంతా ఇక్కడ ఉన్నారంటే ఆ దొంగలు అట్నుంచీ అటే పారిపోతారు. కాబట్టి సైనికులని వెళ్ళి దూరంగా దాక్కోమనండి. ఈ దొంగ రాగానే సన్నగా ఈల వేస్తాను అప్పుడు వచ్చి పట్టుకోవచ్చు” అని చెప్పాడు నిండు దొంగ.

‘సరేలే’ అనుకుని రాజు ఆఙ్ఞ చేయగా సైనికులు వెళ్ళి దూరంగా దాక్కున్నారు.

ఐతే రాజు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మరి నిండు దొంగ నిజంగా తమని పిలుస్తాడో లేదో ఒక వేళ దొంగలతో చేతులు కలిపి తమని పిలవకపోతే?

నిండు దొంగ “మహారాజా! మీరు ఇదే వేషంలో ఇక్కడ కూర్చో నుండడం సబబు కాదు. మీరు ఇదుగో ఆ గోనె సంచీలో దాక్కోండి. కాకపోతే మీ బట్టలూ, నగలూ గుచ్చుకోకుండా ఈ మామూలు బట్టలు వేసుకోండి. అలా చేస్తే అప్పుడు దొంగ ఎవరూ ఇక్కడ లేరులే అనుకుని వస్తాడు” అని అన్నాడు.

రాజు అందుకు ఒప్పుకుని సంచీలో దూరాడు. నిండు దొంగ ఆ సంచీ మూతి బిగించి కట్టేసి రాజుగారి బట్టలూ, నగలూ తీసుకుని ఎంచక్కా తన దారిన తాను వెళ్ళిపోయాడు.

ఇంటికెళ్ళి కార్తికేయుడికి ఆ నగలు చూపగా అతను ఎంతో సంతోష పడ్డాడు.

ఇక్కడ రాజుగారు ఎంత సేపో ఎదురు చూసారు చడీచప్పుడు లేదు. కొంత సేపటికి ఆయన నిండు దొంగని పిలిచాడు. కానీ జవాబు లేదు. ఆయనకి అప్పుడు అనుమానం వచ్చి భటులను పిలవగా వాళ్ళు వచ్చి సంచీలో ఉన్న రాజుగారిని విడిపించారు.

ఏం జరిగిందో అందరికీ అర్ధం అయ్యింది. రాజుగారి పరువు నిండునా పోయింది” అని చెప్పి పయ్యెద………

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

4, ఫిబ్రవరి 2009, బుధవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 10

(నిన్నటి కధ తరువాయి భాగం)

మర్నాడు కార్తికేయుడు అర్ధ దొంగని పిలిచి “ఒరేయ్! నీ తమ్ముడు చేసిన దొంగ తనం చూసావుగా? నువ్వు అంతకంటే గొప్ప దొంగతనం చేసుకు రావాలి” అని చెప్పాడు.

అర్ధ దొంగ తండ్రి దగ్గర సెలవు తీసుకుని కుంతల నగరానికి వాచ్చాడు. అక్కడ వాకబు చేయగా రాజుగారు ఇచ్చిన తీర్పు గురించీ, కొత్వాల్ గురించీ తెలుసుకున్నాడు.

కొత్వాల్ కి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. అయితే ఆ పెళ్ళి కొడుకు కాపురం చేయక మునుపే కట్నంతో దేశాంతరాలు పట్టి వెళ్ళిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న అర్ధ దొంగ దేశాంతరాల నుంచి వచ్చిన వాడిలాగా వేషం వేసుకుని కొత్వాల్ ఇంటికి వెళ్ళాడు.

"మామా! నన్ను గుర్తు పట్టలేదా? అదే నీ కూతురు వనజాక్షిని 9వ యేట పెళ్ళి చేసుకున్న నీ అల్లుడిని” అంటూ ఇంకా ఏవో తను వాకబు చేయగా తెలుసుకున్న విషయాలను కూడా చెప్పి, కొత్వాల్ ని విజయవంతంగా నమ్మించాడు. కొత్వాల్ కూడా నిజాయితీగా, దొంగని తన అల్లుడే అని నమ్మాడు.

అర్ధ దొంగ ఆ రోజంతా వాళ్ళచేత సత్కారాలు చేయించుకున్నాడు. సాయంత్రానికి కొత్వాల్ ఊళ్ళో గస్తీ తిరగడానికి బయలుదేరాడు. అర్ధ దొంగ “మామా! నాకు ఊరు చూడాలని ఉంది. ఇప్పుడెలాగో నువ్వు గస్తీ తిరగడానికి వెళ్తున్నావు కదా! నేనూ వస్తాను. దారిలో నీకు విసుగ్గా అనిపించకుండా కబుర్లు చెపుతూ ఊళ్ళో ఏ ప్రదేశంలో ఏమున్నాయో తెలుసుకుంటాను” అని అన్నాడు.

కొత్వాల్ కి కూడా ‘ఇప్పుడు ఒక్కన్నే గస్తీ తిరగడానికి వెళ్ళడం అంటే విసుగు పుడుతుంది. అదే అల్లుడిని తీసుకువెళితే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళచ్చు’ అనుకుని “సరే! రా అల్లుడూ!” అన్నాడు.

ఇద్దరూ కూడా బయలుదేరి వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఊరి మద్యలో ఉన్న గుది బండ దగ్గరికి వెళ్ళారు.

"మామా! ఏమిటిది? నేను ఎప్పుడూ దీన్ని చూడ లేదు” అని అడిగాడు అర్ధ దొంగ.

"దీన్ని గుది బండ అంటారు అల్లుడు! రాత్రి పూట ఎవరైనా దొంగలు కనుక పట్టు పడితే అప్పుడు రాజు దగ్గరకు తీసుకెళ్ళడం జరిగే పని కాదు కనుక గుది బండలో బిగిస్తారు. కాళ్ళు చేతులను సరైన పద్దతిలో అందులో దూరిస్తే చాలు దానంతట అదే తాళం పడిపోతుంది” అని చెప్పాడు కొత్వాల్. అంతా విన్న అర్ధ దొంగ కావాలనే “అవునా? భలే భలే. ఒక్కసారి ఇది ఎలా తాళం పడుతుందో చూడాలని ఉంది. చూపించవా మామా!” అంటూ చాలా గోముగా అడిగాడు.

కొత్వాల్ కూడా సరే చూపిద్దాం అనుకున్నాడు. ‘కానీ ఆ రోజే దేశాంతరాల నుంచీ వచ్చిన అల్లుడిని దొంగలను పెట్టే గుదిబండలో పెడితే బాగుండదు’ అని ఆలోచించిన కొత్వాల్ “సరే! నేను గుదిబండలో నన్ను నేను తాళం వేసుకుంటాను. నువ్వు చూద్దువు గానీ” అని చెప్పి తనను తను దాంట్లో ఇరికించుకున్నాడు. అది తాళం పడింది. అర్ధ దొంగ తెగ సంబర పడిపోయినట్టు నటించాడు.

"సరే అల్లుడు ఇప్పుడు నా జేబులోని తాళం చెవి తోటి తాళం తెరువు” అని అన్నాడు.

అయితే అర్ధ దొంగ తాళం చెవి అతని జేబులోంచి తీసినట్టే తీసి ఎక్కడో పడేశాడు. “అయ్యో! మామా తాళం చెవి పొరపాటున ఎక్కడో పడిపోయింది. కనిపించడం లేదు” అని అన్నాడు.

"సరే! అయితే ఒక పని చేయి. ఇంటి దగ్గర ఇంకొక తాళం చెవి ఉంది. మీ అత్తని అడిగి అది తీసుకురా” అని చెప్పాడు కొత్వాల్.

అర్ధ దొంగ కొత్వాల్ భార్య దగ్గరకి వెళ్ళి, "అత్తా! మామ చెప్పాడు. ఊరిలో దొంగలు మరీ ఎక్కువ అయిపోయారు అంటకదా. అందుకని డబ్బు, నగలు, విలువైన వస్తువులూ అన్నీ కూడా మూటకట్టి ఇమ్మన్నాడు” అని చెప్పాడు. అదంతా విన్న కొత్వాల్ భార్య “ఆయన ఏరీ?" అని అడిగింది. అందుకు జవాబుగా అర్ధ దొంగ “పక్క వీధిలో ఉన్న గుదిబండ దగ్గర ఉన్నాడు” అని చెప్పాడు. వెంటనే కొత్వాల్ భార్య ఆ వీధి చివరికి వచ్చి “ఏవండీ ఇవ్వమంటరా?” అని ఒక గావు కేక పెట్టింది.

అక్కడ కొత్వాల్ ఏమో ఆమె అడుగుతుంది తాళం చెవి గురించి అనుకుని “ఇవ్వు ఇవ్వు! తొందరగా!” అని అరిచాడు. ఆవిడ డబ్బూ దస్కం నగలూ నట్రా అన్నీ కూడా బస్తాలకి బస్తాలు కట్టి ఇచ్చింది. అర్ధ దొంగ అవి అన్నీ తీసుకుని కొత్వాల్ ఉన్న వైపునుండీ కాకుండా వేరే వైపునుండీ మాతంగ పురానికి వెళ్ళి పొయాడు.

ఇంటికెళ్ళాక కార్తికేయుడికి తను దొంగిలించిన వైనం అంతా చెప్పి ఆ సంపదనంతా చూపించాడు అర్ధ దొంగ. ఇప్పటి తల్లి దండ్రులు ఎలాగైతే పిల్లలు చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుంటే ఆనంద పడతారో అలాగే కార్తికేయుడు కూడా అనంద పడ్డాడు.

ఇక్కడ కుంతల నగరంలో ఏమో కొత్వాల్ ఎదురు చూసాడు, ఎదురు చూసాడు. ఎంత సేపటికీ అల్లుడు రాడాయే! అప్పుడు అతనికి ‘ఎక్కడో ఏదో తప్పు జరిగింది’ అని మాత్రం అర్ధం అయ్యింది. కానీ ఏం జరిగిందో మాత్రం అర్ధం కాలేదు. ఏం చేయడానికీ తోచక అలాగే ఉండిపొయాడు. తెల్లవారాక జనాలు కొత్వాల్ గుదిబండలో ఇరుక్కుని ఉండడం చూసారు. కొత్వాల్ భార్య విషయం తెలుసుకుని పరుగు పరుగున వచ్చి తాళం చెవి తోటి తాళం తీసింది. ఆవిడ జరిగిందంతా భర్తకి వివరించింది. విషయం అందరికీ తెలిసి పోయింది.

రాజు గారు విషయం తెలుసుకుని కొత్వాల్ ని చడామడా తిట్టాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

2, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 9

(నిన్నటి కధ తరువాయి భాగం)

అప్పుడు చీర కొంగు “ఓ రాజా! ఇప్పుడు నా ప్రాణం నా బొందిలో సరిగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు కధ చెప్పగలను. వినండి.

నలుగురు దొంగల కధ

కుంతల నగరం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని గోపాలవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి గోలాహలుండు అనే మంత్రి ఉన్నాడు.

కుంతల నగరానికి రెండామడల దూరంలో మాతంగ పురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కార్తికేయుడు అనే ఒక పెద్ద గజదొంగ ఉండేవాడు. అతనికి నలుగురు కొడుకులు. మొదటివాడి పేరు నిండు దొంగ, రెండోవాడి పేరు ముప్పావు దొంగ, మూడోవాడి పేరు అర్ధ దొంగ, నాలుగోవాడి పేరు పావు దొంగ.

ఒక రోజు కార్తికేయుడు కొడుకులను పిలిచి “చూడండి నాన్నా! మీ అందరికీ నేను చోర విద్య నేర్పాను. ఇప్పుడు మిమ్మల్ని పరిక్షించాలి అనుకుంటున్నాను. నాయనా! పావు దొంగా! మన ఊరికి రెండు ఆమడల దూరంలో కుంతల నగరం అనే ఊరు ఉంది. రేపు తెల్లవారే లోపల ఆ ఊరిలో ఏదైనా దొంగిలించి తీసుకురావాలి. చూద్దాం నీ దగ్గర ఎంత సామర్ధ్యం ఉందో!” అన్నాడు కార్తికేయుడు.

తండ్రి దగ్గర సెలవుతీసుకొని కుంతల నగరానికి వచ్చాడు పావు దొంగ.

పావు దొంగ ఒక మంగలి కొట్టుకి వెళ్ళాడు. అప్పటికే మంగలివాడు వేరే అతనికి క్షౌరం చేస్తున్నాడు. పావుదొంగ అతనితో “మంగలీ! నాకు ముందర క్షౌరం చేయి. నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది. కావాలంటే అందరూ నీకు క్షౌరం చేసినందుకు ఇచ్చే డబ్బుకు రెట్టింపు ఇస్తాను” అని చెప్పాడు.

మంగలివాడు అప్పుడు తను క్షౌరం చేస్తున్నవాడిని బ్రతిమాలి సగంలో ఓ పక్కన కూర్చొపెట్టి పావు దొంగకి క్షౌరం చేసాడు. క్షౌరం అయిపోయాక పావు దొంగ “నా దగ్గర చిల్లర లేదు. నీ దగ్గర ఉందా?" అని అడిగాడు. అతనికి తెలుసు ఉదయాన్నే, అప్పుడే అంగడి తెరిచారు కనుక చిల్లర ఉండే ఆస్కారం లేదని. అయినా అడిగాడు. లేదని క్షురకుడు చెప్పగానే “సరే అయితే నీ కొడుకునో, పనివాడినో ఎవరినో ఒకరిని నా వెంట పంపు. అంగళ్ళ వీధిలో ఎక్కడన్నా చిల్లర మార్చి పంపిస్తాను. నువ్వు వస్తే ఇందాక సగం క్షౌరం చేయించుకున్న అతను గొడవ పెడతాడు” అని అన్నాడు.

మంగలివాడు తన అయిదేళ్ళ తన కొడుకుని పిలిచి పావు దొంగ వెంట పంపాడు. పావు దొంగ ఆ పిల్లవాడ్ని తీసుకుని అంగళ్ళ వీధిలోకి వెళ్ళాడు. అక్కడున్న ఓ ఖరీదైన బట్టల దుకాణంలోకి వెళ్ళి, ఆ అంగడి యజమానిని ఖరీదైన బట్టలు చూపించమని చెప్పాడు. రత్నాలు పొదిగిన చీరలు, బంగారు తీగలతో కుట్టిన పంచలు ఇంకా ఏవేవో ఖరీదైన బట్టలు తీసుకుని

"మా ఇంట్లో వాళ్ళకి చూపించి రావాలి. ఇదుగో వీడు నా కొడుకు. వీణ్ణి నీ దగ్గరే ఉంచి వెళుతున్నాను. ఈ బట్టల్లో వాళ్ళు వద్దన్న బట్టలూ, పైకం తీసుకుని వస్తాను. అప్పుడు నా కొడుకుని తీసుకు పోతాను” అని చెప్పి బట్టలు తీసుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు.

కార్తికేయుడి దగ్గరకెళ్ళి తను చేసిన దొంగ తనం చూపించాడు. కార్తికేయుడు ఎంతగానో మెచ్చుకున్నాడు.

అయితే ఇక్కడ కుంతల నగరంలో ఆ బట్టల అంగడి యజమాని మంగలివాడి కొడుకుని “ఏరా నీ నాన్న ఏడీ? ఎంత సేపటికీ రాడు!” అన్నాడు.

ఆ పిల్లవాడు “మా నాన్న క్షౌరం చేస్తున్నాడు” అని చెప్పాడు. అసలే ‘అంత ఖరీదైన బట్టలు తీసుకెళ్ళిన వాడు ఇంతవరకూ రాలేదే’ అని కంగారుగా ఉన్న అతనికి ఆ సమాధానం వినగానే చిర్రెత్తింది.

"ఏరా పరిహాసాలాడుతున్నావా?" అంటూ కసిరాడు.

అయితే ఇతను కసిరే టప్పటికి భయపడిన ఆ పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.

ఇంతలో ‘తన కొడుకు ఏమయ్యాడా?’ అని అంగళ్ళ వీధికి వచ్చిన మంగలివాడు అతని కొడుకుని చూసి “నా కొడుకుని ఎందుకు నిర్భందించావు? వాడిని వదిలేయి” అన్నాడు.

అయితే బట్టల దుకాణం వాడు “ఏమి, నువ్వు అతను తోడుదొంగలన్నమాట!” అంటూ అతను ఎదురు కొట్లాడాడు.

వీళ్ళు కొట్లాడుకుంటుండగా అటుగా వచ్చిన రాజ భటులు వాళ్ళని రాజుదగ్గరికి తీసుకెళ్ళారు. రాజు అంతా విని విషయం వాకబు చేయగా రాజుగారికి అంతా అర్ధం అయ్యింది. రాజుగారు “వాడిని పట్టుకొంటాము. అయినా ఎవ్వడిని పడితే వాడిని అలా ఎలా నమ్మారూ? మీ బుద్ది తక్కువ తనం” అని ఇద్దరినీ తిట్టి

"ఏయ్ కొత్వాల్! పట్టపగలే ఇలా దొంగతనాలు జరుగుతుంటే నువ్వేమి చేస్తున్నావయ్యా? ఆ దొంగని ఎలా పట్టుకుంటావో నాకు తెలియదు కానీ పట్టుకొని తీరాలి. అర్ధమైందా?" అని చెప్పేసి తన పనిలో తను మునిగిపోయాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

31, జనవరి 2009, శనివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 8

(నిన్నటి కధ తరువాయి భాగం)


మతిమంతుడు ఎనుబోతుగా మారాడని తెలియక అక్కడ మనోరమ అతను వస్తాడు అనుకుని ఎదురుచూడసాగింది. ఎంతసేపటికీ అతను రాలేదు. కొంత సేపటికి ప్రసవ వేదనతో ఆమె అరిచిన అరుపులకు చుట్టు పక్కల ఇళ్ళ స్త్రీలు వచ్చి, ఆమె పరిస్థితి గమనించి వెంటనే మంత్రసానిని పిలిపించారు. మనోరమకి ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆమె కొన్ని రోజులు ఎదురుచూసింది. కానీ మతిమంతుడు రాలేదు. దాంతో ఆమె రాజుగారి దగ్గరకి వెళ్ళి, తను ఎవరో మాత్రం చెప్పుకోకుండా తన కధ మొత్తం చెప్పి తన భర్తని వెతికిపెట్టమని కోరింది.


ఆ దేశపు మంత్రి దేశం అంతా వెతికించాడు. కానీ కనిపెట్టలేక పోయారు. అందులో వారి తప్పేముంది? మనిషి రూపంలో ఉంటే కదా వాళ్ళు కనిపెట్టటానికి! వాళ్ళు మనోరమతోటి తల్లీ! నీ భర్త దొరకలేదు. కానీ నువ్వు ఇప్పుడు నీ గతి ఏమిటీ?’ అని బాధ పడకు. మా కోశాగారం నుంచీ, మా ఖజానా నుంచీ నీకు ప్రతి నెలా అన్నీ అవసరాలు తీరే విధంగా అన్నీ అందేలా చూస్తాము. ఆ సదుపాయాలతో నువ్వు సుఖంగా ఉండవచ్చు అని చెప్పాడు రాజు.


కానీ ఆమె ఒప్పుకోకుండా. ఇలా బదులు చెప్పింది ఓ మహారాజా! మీరు నాపై చూపిన దయకి కృతఙ్ఞురాలిని. కానీ నా భర్తకి నేనంటే ఎంతో ఇష్టం. అలాంటిది గర్భవతినైన నన్ను విడిచి వేరే ఊరికి ఎట్టి పరిస్తుతుల్లో పోరు. అలాంటప్పుడు ఈ ఊరిలోనే ఉంటే ఆయన తప్పకుండా మీకు దొరికేవాడు. రెండూ జరగలేదు అంటే తప్పకుండా ఆయన చనిపోయి ఉంటారు. భర్త చనిపోయాక భార్యగా నేను బ్రతికి ఉండీ లాభం ఏమిటీ? నేను ఎవరినైతే నా జీవితంగా భావించానో ఆ వ్యక్తి నాకు దూరం అయ్యారు. కనుక నేనే ఆయన వద్దకు వెళ్ళాలి. కనుక దయచేసి నాకు ఈ రోజు సాయంత్రం చితి పేర్పించండి అని అన్నది. రాజు మిగతా సభకులు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇంక రాజు చితి పేర్పించమని ఆఙ్ఞ జారీ చేసాడు. ఈ విషయం ఊరంతా పాకింది.


ఐతే ఇక్కడ ఈ నర్తకీ ప్రతి రోజూ రాత్రికి మతిమంతుడిని మనిషిగా చేస్తుంది. మళ్ళీ పొద్దునకి ఎనుబోతుగా మార్చేస్తుంది. పాపం! మతిమంతుడికి ఏమో ఆ మందు ప్రభావమో లేక పొద్దునంతా ఎనుబోతుగానూ రాత్రంతా మనిషిగానూ మారటం వల్లనో అంతా అయోమయంగా ఉండేది. అసలు తను ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులే తెలిసేవి కాదు. ఇలా ఇతని జీవితం సాగుతుండగా ఆ నర్తకికి ఎవరో ఒకావిడ భర్త చనిపోయాడని తెలుసుకుని ఆ బాధతో ఆత్మాహుతి చేసుకోబోతుందని తెలిసింది. ఊరు ఊరంతా ఆ విశేషం ఏమిటో చూడాలని వెళ్తున్నారని, ఆ నర్తకీ కూడా బయలుదేరింది. కాకపోతే సరే ఈ వింత ఏమిటో తను కూడా చూస్తాడు. తనని కూడా తీసుకెళ్దాంఅని భావించి ఆమె మతిమంతుడిని కూడా మనిషిని చేసి తీసుకెళ్ళింది.


ఐతే వాళ్ళు వెళ్ళే సరికి మనోరమ చితి చుట్టూ అప్పటికే మూడో ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఆమెని చూడగానే మతిమంతుడికి తన గతం అంతా గుర్తుకు వచ్చింది. వెంటనే జరిగింది ఏమిటో కూడ అర్ధం అయిపోయింది. ఐతే మతిమంతుడు మన సినిమాలలో హీరోలలాగా మతిలేని వాడు కాదు. అగ్నిలో దూకబోతున్న భార్యని ఆపడానికి బదులు ఆ నర్తకిని చంపడమొ లేక తన్నడమో చేయడానికి! అందువల్ల అతను నేను బ్రతికే ఉన్నాను. నువ్వు అగ్నిలో దూకద్దు అంటూ అరుస్తూ మనోరమ దగ్గరికి పరిగెత్తాడు. ఐతే మనోరమ దృష్టి చుట్టూ జరుగుతున్న వాటిమీద అస్సలు లేకపోవడంతో, ఆమెకి ఆ మాటలేవీ వినిపించ లేదు. ఆమె అగ్నిలో దూకేసింది. అది చూడగానే భరించలేక అతను కూడా అగ్నిలో దూకేసాడు. నా మూలంగా ఇద్దరు చనిపోయారే అని నర్తకీ కూడా అగ్నిలో దూకింది. అది చూసి అయ్యో మతిమంతుడు ఈ ఊరిలోనే ఉన్నా, అతన్ని వెతికి పట్టుకోలేక పోయానేఅన్న భాదతో మంత్రి కూడా అగ్నిలో దూకాడు. ఇదంతా చూసిన రాజు తట్టుకోలేక, మహాంకాళి గుడికెళ్ళి, అమ్మా! కాళికా మాతా! నా దేశంలో బ్రతకడానికి వచ్చిన ఇద్దరు పరదేశస్తులను నా మంత్రినీ ఆ నర్తకినీ బ్రతికిస్తావా లేక నన్ను కూడా ఆత్మాహుతి చేసుకోమంటావా?" అని అమ్మవారిని స్తుతించాడు. అప్పుడు అమ్మవారు అందరినీ బ్రతికించింది.

ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప?"అని రవిక అడిగింది.


ఆ ప్రశ్నకు విక్రమార్కుడు ఈ సారికూడా పలుకని పడంతిని మాట్లాడించడం కోసం కావాలనే ఓ రవికా! మంత్రి చనిపోవడమే గొప్ప అని సమాధానం చెప్పాడు.


ఆ సమాధానం విన్నవెంటనే పలుకని పడంతి ఏమిటయ్యా ఈ తప్పుడు సమాధానాలు? మంత్రి చనిపోవడం గొప్ప కాదు. ఆ నర్తకీ చనిపోవడం గొప్ప. ఎందుకంటే నర్తకీ అన్నాక డబ్బు, సుఖం తప్ప ఇంకేమీ పట్టవు. అలా అయ్యుండీ కూడా ఆమె వారి కోసం చనిపోయిందంటే అదీ గొప్ప అని సరైన సమాధానం చెప్పింది.


అప్పుడు విక్రమార్కుడు అయ్యో! ఆడవారికి తెలిసినది మనకు తెలియలేదు కదా!అని చింతించాడు[?]


అప్పుడు పలుకని పడంతి ఆహా! మగవారికి తెలియనిది మనకు తెలిసెను కదా!అని సంతసించింది.


ఈ సారి విక్రమార్కుడు పలుకని పడంతి పయ్యెదని ఓ చీర కొంగూ! పలుకని పడంతి ఏమో మాట్లాడటం లేదు. పొద్దేమో పొడవడం లేదు. నాకేమో నిద్ర రావడం లేదు. నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా!” అని అడిగాడు.


వెంటనే భేతాళుడు పమిట కొగులో ప్రవేశించి, "చాల్చాల్లే పోవయ్యా! భలే అడిగావు. ఇక్కడ ఈ చిన్నదేమో నా మీద వడ్డాణాలూ, నగలు అంటూ అవీ ఇవీ పెట్టుకుంది. దాంతో నాకు గాలాడక నేను భాద పడుతుంటే. రోలు ఒచ్చి డోలుకు చెప్పుకున్నట్టునువ్వు నన్ను కధ అడుగుతున్నావా? అసలు నీకిది న్యాయమా?” అని అన్నాడు.

వెంటనే పలుకని పడంతి చీర మార్చుకుని వచ్చింది. ఈ భేతాళుడు ప్రవేశించిన చీరని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టింది.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

29, జనవరి 2009, గురువారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 7

(నిన్నటి కధ తరువాయి భాగం)

తెరగుడ్డ కధ అంతా చెప్పి, "ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప విషయం?” అని అడిగాడు.

ఆ ప్రశ్నకి విక్రమార్కుడు “ఓ తెరగుడ్డా! తంత్రలోహనుడు చనిపోవడమే గొప్ప విషయం” అని చెప్పాడు. ఎందుకంటే విక్రమార్కుడు పలుకని పడంతిని మాట్లాడించాలి కదా! అందుకని కావాలనే జవాబు తప్పుగా చెప్పాడు. ఎందుకంటే అలా తప్పుగా చెప్పాడనుకో అప్పుడు అంత సేపు కధ విన్నది కాబట్టి పలుకని పడంతి తను మాట్లాడకూడదు అని మర్చిపోయి ‘సరైన జవాబు అది కాదు. ఇది’ అంటూ కోపంగానైనా సరే సరైన జవాబు చెపుతుందని విక్రమార్కుడి ఉద్ధేశం.

ఆయన ఉద్ధేశం నిజం చేయటానికే అన్నట్టు, పలుకని పడంతి “ఏమిటీ? ఎవరు చనిపోయినది గొప్ప అన్నారు? మీరు చెప్పింది శుధ్ద తప్పు. పూజారి చనిపోయినదే గొప్ప. ఎందుకంటే పూజారికి ఏ సంబంధం లేక పోయినా అతను అంత మంది చనిపోయి ఉండటం భరించలేక చనిపోయాడు. కనుక అతను చనిపోయిందే గొప్ప” అని అన్నది.

"ఔనౌను! నువ్వు చెప్పిందే నిజం. నాది శుధ్ద తప్పు జవాబు” అన్నాడు విక్ర మార్కుడు.

కొంచెం సేపు అయ్యాక విక్రమార్కుడు ఈ సారి పలుకని పడంతి ధరించిన రవికను ఉధ్దేశించి “ఓ రవికా! నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా? నాకేమో నిద్ర రావడం లేదు. పలుకని పడంతేమో మాట్లాడదు. పొద్దేమో గడవదు. కాబట్టి నువ్వన్నా ఏదైనా కధ చెప్తే పొద్దుపోతుంది” అన్నాడు.

వెంటనే భేతాళుడు రవికలో ప్రవేశించాడు. “ఓ రాజా! కధ, కధ అని ఓ బాధిస్తున్నారు. నేను కధ చెప్పగలిగే స్థితిలో లేను. ఈ చిన్నదేమో నన్ను బిగించి కట్టింది. అసలే నాకు ఊపిరాడడం లేదు. ఇక మీకు ఎం కధ చెప్పమంటావయ్యా?” అని అన్నాడు రవికలోని భేతాళుడు.

వెంటనే పలుకని పడంతి ఒక గదిలోకి వెళ్ళి తను ధరించిన రవికని తీసి ఇంకొక రవిక ధరించింది. ఈ మునుపటి రవికని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టి, మాట్లాడకుండా కూర్చుంది.

విక్రమార్కుడు “ఓ రవికా! పలుకని పడంతి ఎంత దయాళువో చూడు. నీ మీద కరుణతో నిన్ను విడిచి పెట్టింది. ఇప్పటికన్నా కధ చెప్పు” అన్నాడు.

మతిమంతుడూ మంత్రమనోరమ

అప్పుడు రవిక “ఓ రాజేంద్రా! ఒక చక్కని కధ చెప్తాను వినండి.

రంగనాధ పురం అనే ఒక దేశం ఉందేది. ఆ దేశాన్ని రంగనాధుడనే రాజు పాలించేవాడు. అతనికి సంబ్రమవర్మ అనే మంత్రి ఉన్నాడు.

ఈ రాజుకూ మంత్రమనోరమ అనే కూతురు పుట్టింది. మంత్రికి కూడా మతిమంతుడు అనే కొడుకు పుట్టాడు. ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.

యుక్తవయసుకి వచ్చేసరికి మనోరమకీ మతిమంతుడికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం పెరిగింది. అందువల్ల ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలి అనుకున్నారు. కానీ రంగనాధుడు `రాజుకూతురు అయ్యుండీ మనోరమ రాజు క్రింద వాడయిన మంత్రి కొడుకుని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోడని’ తెలుసుకుని మతిమంతుడూ, మనోరమా దేశాంతరాలకు వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో మనోరమ గర్భవతి అయ్యింది. ఆమెకి నెలలు నిండాయి.

మతిమంతుడు “మంత్రసానిని తీసుకు వస్తాను” అని చెప్పి వెళ్ళాడు.

అతను మంత్రసాని ఇల్లేదో తెలుసుకుని ఆమె ఇంటికెళ్ళాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో అరుగు మీద కూర్చుని ఎదురు చూడ సాగాడు.

అయితే ఆ మంత్రసాని ఇంటి ఎదురు ఇంట్లో ఒక నర్తకీ నివసిస్తుంది. ఆ నర్తకీ ఇతనిని చూసి ‘ఆహా! ఎవరితను? ఎంత అందంగున్నాడు!’ అని అనుకుంది. మరుక్షణమే మతిమంతుడి దగ్గరకెళ్ళి “ఆర్యా! తమరు ఎవరి కోసం ఇక్కడ ఎదురుచూస్తున్నారు? అసలు తమ కధ ఏమిటి?" అని అడిగింది. మతిమంతుడు తన సంగతి అంతా చెప్పాడు.

అంతా విన్న ఆ నర్తకీ “ఈ ఎండలో ఎందుకు కూర్చోవడం. నా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఈ లోపల నేను ఆ మంత్రసానిని పిలిపిస్తాను” అని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తివాచీ మీద కూర్చో పెట్టింది.

"మంత్రసానికి కబురు పెట్టాను వచ్చేస్తుంది. ఈ లోపల భోజనం చేయండి” అని చెప్పి అతని చేత బలవంతానా భోజనం చేయింపించి తాంబూలం ఇచ్చింది. కాకపోతే ఆ తాంబూలంలో మంత్రించిన మందు ఏదో కలిపి ఇచ్చింది. ఆ మందు కలిపిన తాంబూలం తినడం వల్ల మతిమంతుడు ఎనుబోతుగా మారిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి ఆమె తన గొడ్లపాకలో కట్టేసుకుంది.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

27, జనవరి 2009, మంగళవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 6

(నిన్నటి కధ తరువాయి భాగం)

తంత్రలోహనుడు చిలుకలకి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న చిలకల గుంపులోంచి ఒక చిలుక సురేంద్రుడి దగ్గరకి వచ్చి, "మహారాజా! ఆ గోరు గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఇతను అన్నాక గుర్తువచ్చింది. కొన్నాళ్ళ క్రితం మేము అందరం సప్తసముద్రాలు దా‍టి సప్తద్వీపాలకి అవతల ఉండే మధువనంలోని అద్భుతమైన ఫలాలను తిన్నాము. తిరిగి వచ్చేటప్పుడు, మీ కోసం అని అందరం కూడా మేము తీసుకురాగలిగినన్ని ఫలాలను తీసుకొస్తున్నపుడు. మల్లికా ద్వీపంలో సూర్యాస్తమయ వేళలో ఏడు అంతస్తుల భవనం మీద మేనకా, రంభల లాంటి అపూర్వ సౌందర్యరాశి తల చిక్కుతీసుకుంటుండగా జుట్టుకు చిక్కుకుని ఆమె గోరు దూరంగా పడ్డది. నేను మెరుస్తున్న ఆ గోరుని వజ్రం అనుకున్నాను. ఆమె ఉంగరం నుంచీ వజ్రం జుట్టుకు చిక్కుకుని దూరంగా పడింది కాబోలు అనుకుని, నా నోట్లోని ఫలాలను పక్కన పెట్టి ఆ గోరుని తీసుకొచ్చాను. మర్నాడు పొద్దున చూస్తే అది మామూలు గోరే. మీకు గుర్తుందో లేదో ఆ రోజు మీరు బాగా గుణీసి చివరికి ముక్కుతో నన్నొక పోటుపొడిచారు” అని జరిగిందంతా గుర్తుచేసింది.

సురేద్రుడు “అవును! నాకిప్పుడు గుర్తొచ్చింది. విన్నారు కదా స్వామీ, ఈ చిలుక చెప్పిన దంతా నిజం” అని చెప్పాడు.

"నాకు జరిగిందంతా చెప్పారు కాబట్టి మీరే అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తే మీ అంత మంచివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి దయచేసి చెప్పండి” అని తంత్రలోహనుడు బ్రతిమాలాడు.

అప్పుడు చిలుకల రాజు సురేంద్రుడు “పుణ్యాత్మా! ఇక్కడికి పది యోజనాల దూరంలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు ఆకాశంలోకి పెరిగినట్టుంటుంది. ఆ చెట్టుమీద గండబేరుండ పక్షులు నివసిస్తున్నాయి. నువ్వు ఎలాగైనా వాటి స్నేహాన్ని సంపాదించుకున్నావంటే, నీ పని జరిగవచ్చు” అని చెప్పాడు.

తంత్రలోహనుడు చిలకలకి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను గండబేరుండ పక్షులు ఉండే చెట్టు దగ్గరకి వెళ్ళాడు. ఆ సమయంలో గూటిలో పిల్లపక్షులు మాత్రమే ఉన్నాయి. తల్లి పక్షీ, తండ్రి పక్షీ బయటికి వెళ్ళాయి. అవి రెండూ తిండి వెతుక్కుని తీసుకొచ్చేలోపల కృష్ణపాము పిల్లలను తినాలన్న ఆశతో చెట్టుమీదకు పాక సాగింది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన తంత్రలోహనుడు ఆ పాముని ఒక్క ఉదుటన తన కత్తికి బలిపెట్టాడు. ఆ సంఘటనతో పిల్లపక్షులు ఎంతో ఆనందంతో అతనికి ధన్యవాదాలు చెప్పి అతనికి తమూ, తమ తల్లి దండ్రులూ ఏదైనా సహాయం చేస్తామని చెప్పాయి. కానీ అది తమ తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయం అవ్వటం వల్ల దూరంగా చెట్టు క్రింద కూర్చోమని చెప్పాయి. అతను అలాగే చేసాడు. రెండు నిమిషాలకు ఆ పిల్లల అమ్మానాన్నా వచ్చాయి. పక్షి పిల్లలు జరిగిందంతా చెప్పాయి. వెంటనే గండబేరుండాలు తంత్రలోహనుడి దగ్గరికి వెళ్ళి “మీరు మా పిల్లలను కాపాడినందుకు ధన్యవాదాలు. మేము మీకు చేయగలిగిన సహాయమేదైనా ఉందా స్వామీ?” అని అడిగాయి.

తంత్రలోహనుడు తన కధ మొత్తం చెప్పాడు. తను వాటి నుంచీ కోరుకుంటున్న సహాయం యేమిటో కూడా చెప్పాడు. వెంటనే మగపక్షి అతన్ని తనపైన ఎక్కించుకొని తన వాళ్ళకి వీడ్కోలు చెప్పి బయలుదేరింది. దారిలో నవరత్న ద్వీపం మీదుగా వెళుతున్నపుడు తంత్రలోహనుడు తనని దించమని అడిగాడు. అక్కడ ఎన్నో నవరత్నాలని మూటకట్టుకుని మళ్ళీ పక్షి మీద బయలుదేరాడు. అతన్ని మల్లికా ద్వీపంలో దించి, అతనికి ఒక ఈకని ఇచ్చి “ఈ ఈకని గనకా తగలబెట్టారంటే నేను మరుక్షణంలో మీ ఎదుటకి వస్తాను” అని చెప్పి వెళ్ళీపోయింది.

తంత్రలోహనుడు రత్నాల వ్యాపారిని అంటూ ఒక దుకాణం అద్దెకి తీసుకుని, చాలా చౌకగా రత్నాలు అమ్మాడు. ఊరిలోని అందరూ కూడా అతని దెగ్గర రత్నాలు కొనడానికి వచ్చారు. అందరిలాగానే నవకోటి నారాయణ శెట్టి అనే ఒక శెట్టి కూడా వచ్చాడు. అతను ఆ ఊరిలోని గొప్ప ధనవంతుడు. ఆ ఊరిలో అతనికి మాత్రమే ఏడు అంతస్తుల భవనం ఉంది. ఈ విషయం తెలుసుకున్న తంత్రలోహనుడికి అతను తను కలవాలనుకుంటున్న అమ్మాయి తండ్రి అయ్యుండచ్చు అని అనుకున్నాడు. నిజానికీ నారాయణ శెట్టి కూతురి గోరే చిలుకలు తెచ్చింది. ఆమె బొమ్మే గుళ్ళో ఉన్నది కూడా. ఆమె పేరు సంగీత సాహిత్య సరసోల్లాస హాసినీ. సౌందర్యంలో ఆమె దేవతలకంటే కూడా ఎంతో బాగుంటుంది.

తంత్రలోహనుడు తన పేరు భైరవ లింగశెట్టి అని తను దేశపర్యాటన చేస్తూ రత్నాలు అమ్ముకుంటూ తిరుగుతున్నానని అందరికీ చెప్పుకున్నాడు. తంత్రలోహనుడితో నారాయణశెట్టికి మంచి స్నేహం ఏర్పడింది. తంత్రలోహనుడిని తన ఇంట్లో బస చేయటానికి నారాయణ శెట్టి కోరాడు. తంత్రలోహనుడు అందుకు సరే అన్నాడు. వాళ్ళింటిలో ఉంటూ సంగీత సాహిత్య సరసోల్లాస హాసినితో తంత్రలోహనుడికి పరిచయం ఏర్పడింది. శెట్టి కూతురు ఐన ఆమెకి కూడా తంత్రలోహనుడి పైన సద అబిప్రాయం కలిగింది.

ఒక రోజు తంత్రలోహనుడు “శెట్టి గారు! ఎన్నాళ్ళని నేను మీ ఇంట్లో ఉంటాను. రేపో, మాపో నేను నా భార్యని తీసుకురావాలనుకుంటున్నాను. కనుక మీ ఇంటి ఎదురుగా ఉన్న స్ధలాన్ని నాకు ఇవ్వండి నేను ఒక ఇల్లు కట్టుకుంటాను. నేను ఈ ఊరును వదిలి వెళ్ళే టప్పుడు మీకే ఆ ఇంటిని కూడా ఇచ్చేస్తాను” అని అన్నాడు. నారాయణ శెట్టి అందుకు ఒప్పుకున్నాడు.

తంత్రలోహనుడు అక్కడ ఇల్లు కట్టించేటప్పుడు కొంతమంది నమ్మకస్తులైన పని వాళ్ళతో ఆ ఇంటినుంచీ హాసినీ గదికి ఒక సొరంగం తవ్వించాడు. ఇల్లు కట్టడం పూర్తయ్యింది. తంత్రలోహనుడు గృహప్రవేశం చేశాడు.

ఒక రోజు రాత్రి తంత్రలోహనుడు హాసినీ గదిలోకి సొరంగం ద్వారా ప్రవేసించి ఆమెని ఒక కర్రతో తట్టి నిద్రలేపాడు. సహజంగా ధైర్యం కలిగినది, అతని మీద మంచివాడు అన్న ఉద్దేశంకూడా ఉంది కనుక ఆమె భయపడకుండా అతను ఎందుకు వాచ్చాడని అడిగింది. అతను తన కధ మొత్తం చెప్పి తరవాత ఏం జరగాలో కూడా చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది.

మర్నాడు తంత్రలోహనుడు శెట్టి దగ్గరికి వెళ్ళి “శెట్టిగారూ నా భార్య రాత్రి ఊరినుండీ వచ్చిందండీ. కనుక ఈ రోజు మీరు మా ఇంట్లో విందు చేయాలి” అని చెప్పాడు. శెట్టి అందుకు ఒప్పుకున్నాడు. మద్యానం విందుకు వెళ్తూ శెట్టి కూతురుని రమ్మంటే “నాన్నా! నాకు చాలా తల నొప్పిగా ఉంది. నేను రాలేను కనుక మీరు వెళ్ళండి” అంటూ ఒకటే మూలిగింది. సర్లే అనుకుని శెట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరూ విందుకి వెళ్ళారు.

ఐతే హాసినీ సొరంగం ద్వారా ముందుగానే అక్కడికి చేరుకుని వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళకి అయోమయంగా అనిపించింది. అయితే తంత్రలోహనుడు “నా భార్య అచ్చం మీ కూతురిలాగానే ఉంది కదండీ!” అన్నాడు. కానీ శెట్టికి మాత్రం అనుమానంగానే అనిపించింది. `ఈమె నా కూతురే నేమోనని’ తెగ ఆలోచించాడు. కానీ తన అనుమానాన్ని బలపరిచేది ఏదీ దొరకక ఊరుకున్నాడు. అందరూ విందు చేస్తూ ఉండగా అతనికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అతను హాసినీ నెయ్యి వడ్డిసుండగా నెయ్యిని ఆమె చీరకొంగుపై పొరపాటున పోసినట్టుగా పోసాడు. అతని ఆలోచన ఏమిటో తంత్రలోహనుడికి అర్ధం అయ్యింది. అందరూ విందు అయ్యాక కబుర్లు చెప్పుకుంటుండగా తంత్రలోహనుడు ఎవరికీ తెలియకుండా పని వాడి చేత నెయ్యి మరక పడ్డ చీరలాంటి చీరే ఇంకోటి తెప్పించాడు.

శెట్టి ఇంటికి వెళ్ళేలోపలే హాసినీ ఇంట్లోకి వెళ్ళి మంచంమీద మూలుగుతూ పడుకుంది. “హాసినీ! ఒక సారి ఇలా రా తల్లీ!” అని శెట్టి పిలవగానే హాసినీ “నాన్నా! నేను రాగలిగే స్తితిలోలేను. నన్ను పడుకోనియ్యి నాన్నా!” అంటూ అంది గారాబంగా. “సరే. నువ్వు రా అక్కర లేదు కానీ తల్లి నీ వంటిమీద ఉన్న చీర ఇలా పంపించి నువ్వు ఇంకో చీర కట్టుకో తల్లి” అని శెట్టి చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాకపోతే నెయ్యి మరక పడ్డ చీరకు బదులు అలాగే ఉన్న ఇంకొక చీరను పంపించింది. చీర అంతా వెతికినా కూడా శెట్టికి నెయ్యి మరకలుగానీ, పోనీ ఆ నెయ్యిని కడిగేసిన నీటి తడిగానీ తగల్లేదు. దాంతో అతను ‘నేను నా కూతురిని అనవసరంగా అనుమానించాను’ అనుకున్నాడు.

కొన్నిరోజులు గడిచాయి. ఒక రోజు తెల్లవారు జామున తంత్రలోహనుడు శెట్టి ఇంటికి వచ్చి “శెట్టి గారూ! నేను ఇప్పుడు మా ఊరికి వేళ్ళాల్సిన పని పడింది. కనుక మీ దగ్గర సెలవు తీసుకుందాం అని వాచ్చాను” అన్నాడు.

శెట్టి అతని కుటుంబ సభ్యులందరూ తంత్రలోహనుడికి వీడ్కోలు ఇవ్వడానికి వెళ్ళారు. అయితే హాసినీని మాత్రం ఎవరూ నిద్రలేపలేదు. “ఇంత తెల్లవారుజామున ఆమెని నిద్రలేపకండి” అని తంత్రలోహనుడు అన్నాడు కనుక.

అయితే హాసినీ ఎప్పుడో నిద్ర లేచి తంత్రలోహనుడి ఇంటి దగ్గరికి వెళ్ళింది. శెట్టి మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే వాళ్ళని తంత్రలోహనుడూ, హాసినీ ఊరి చివరి దాకా తీసుకువెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అలా ఊరి చివరి దాకా రాకపోతే ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏమిటో అర్ధమైపోతుంది అప్పుడు హాసినీని వాళ్ళు తీస్కెళ్ళిపోతారు. అందుకని మాటల్లో పెట్టి వాళ్ళని ఊరి చివరికి తీసుకెళ్ళి “ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా దూరం వచ్చారు” అని తంత్రలోహనుడు అన్నాడు. వాళ్ళు వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే హాసినీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ వీడ్కోలు తీసుకుంది. వాళ్ళు ఆమెని ఓదార్చి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే తంత్రలోహనుడు గండబేరుండ పక్షి ఇచ్చిన ఈకని తగలబెట్టాడు. వెంటనే గండబేరుండ పక్షి వచ్చింది. ఇద్దరూ పక్షిమీద నిముషాలలో వాటి గూడు ఉన్న చెట్టు దగ్గరకి చేరుకున్నారు.

ఇక్కడ నారాయణ శెట్టి ఇంటికి వెళ్ళాక తన కూతురు ఇంట్లో లేకపోవడం గమనించుకున్నాడు. ఆమె గది తలుపుకు అవతల వైపున గడియపెట్టి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తలుపు బద్దలు కొట్టి మరీ ఆమె గదిలోకి వెళ్ళగా అక్కడ ఆమె లేదు. బదులుగా గదిలో ఒక మూల సొరంగం కనిపించింది. వాళ్ళు ఆ సొరంగం ఎక్కడికి వెళ్తుందా అని దాన్లో ప్రయాణం చేయగా వాళ్ళు తంత్రలోహనుడు ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళ ఎదురింట్లో తేలారు. వెంటనే వాళ్ళకి జరిగిందంతా అర్ధమైంది. ఇప్పుడు రచ్చచేస్తే తము మోసపోయిన విధానాన్ని తెలుసుకుని జనాలు నవ్వుతారు అనుకుని వాళ్ళు మారు మాట్లాడలేదు.

తంత్రలోహనుడు గండబేరుండ పక్షులు అతన్ని తీసుకెళ్తాను అనగనే అతనేమి వెంటనే వెళ్ళిపోలేదు. తన గుర్రాన్ని తీసుకెళ్ళి దగ్గరలోని ఊరిలో ఒకళ్ళకి డబ్బులిచ్చి తన గుర్రం బాద్యత అప్పగించి వాచ్చాడు. ఇప్పుడు హాసినీని ఆ ఊరిలోని గుర్రం తీసుకొచ్చి ఆమెని దాని మీద తీసుకెళ్ళాడు. అలా వాళ్ళు గుడి దగ్గరకి వెళ్ళారు.

తంత్రలోహనుడు “ఓ లలనామణీ! ఈ గుడిలో ఉత్తరదిశలో నీ బొమ్మ ఉంటుంది. అక్కడ నా స్నేహితుడు పిచ్చివాడిలాగా బ్రతిమాలుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఆ బొమ్మ పక్కన నించోని అతని మెడలో ఈ పూల మాలని వెయ్యి. కానీ అతను నా గురించి అడిగితే మాత్రం నేను చనిపోయానని చెప్పు. ఎందుకంటే నేను అతని మీద ప్రేమతో ఇంత శ్రమ తీసుకుని నిన్ను తీసుకొచ్చాను. అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవాలి” అని చెప్పాడు.

ఆమె సరే నని లోపలికి వెళ్ళింది. ఆమె తంత్రలోహనుడు చెప్పినట్టుగానే చేసింది. కానీ తంత్రలోహనుడు చనిపోయాడని తెలుసుకోగానే మదనమోహనుడు ఒరలోంచి బాకు తీసి ఆత్మహత్యచేసుకున్నాడు. అది చూసి ‘అయ్యో నేను వరించిన వ్యక్తి చనిపోయాడు. ఇతని కోసం నేను నా సర్వస్వాన్ని త్యాగం చేసుకుని వాచ్చాను. నా కిప్పుడు దారేది’ అని ఆలోచించి హాసినీ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకపోయేసరికి తంత్రలోహనుడు గుడిలోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ‘అయ్యో! ఇదంతా నా వల్లే కదా’ అని యోచించి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి వాళ్ళందరూ అక్కడ చనిపోయి ఉండడం చూసి మనసు విరిగి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భక్తులు అది చూసి దేవుడి దగ్గరకి వెళ్ళి “దేవుడా! నీ గుడిలో నలుగురు చనిపోయి ఉంటే కూడా కదలక మెదలకా ఉంటావా? వాళ్ళని బ్రతికించనన్నా బ్రతికించు లేదా మా ప్రాణాలను కూడా అర్పిస్తాము” అంటూ దేవుణ్ణి ప్రార్ధించారు. దానితో దేవుడు నలుగురినీ బ్రతికించాడు” అంటూ తెరగుడ్డ కధ పూర్తి చేసి....

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

25, జనవరి 2009, ఆదివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 5

(నిన్నటి కధ తరువాయి భాగం)


గుడిలోకి వెళ్ళిన తంత్రలోహనుడు వెతకగా ఉత్తరదిశలో ఉన్న అమ్మాయి బొమ్మ దగ్గర మదనమోహనుడి ప్రలాపాలను చూసాడు.


మదనమోహనుడికి ఎంత చెప్పినా కూడా, ఆ విగ్రహన్ని, ‘నిజం అమ్మాయేననినమ్ముతున్నాడే గానీ బొమ్మ అని నమ్మటం లేదు.


చివరికి తంత్రలోహనుడికి విసుగు పుట్టింది. సరే అనుకుని ఆ గుడి పూజారి దగ్గరకెళ్ళి, "అయ్యా! అక్కడున్న ఆ విగ్రహంని ఎవరు చెక్కారు? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?" అని అడిగాడు.


పూజారి నాయనా! ఇక్కడికి 10 ఆమడల దూరాన సంగమేశ్వరీ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కోదండుడనే శిల్పాచారి ఉన్నాడు. అతను సంవత్సరం కొకసారి ఈ గుడికి వచ్చి పూజలు చేసి వెళ్తుంటాడు. అతనే ఆ శిల్పాన్ని చెక్కాడు అని చెప్పాడు.


"స్వామీ! నేను తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకూ నా మిత్రుడి అవసరాలు మీరే చూడాలి అని చెప్తూ తన మెడలోని నవరత్న ఖచితమైన మాలికని తీసి అతని చేతికిచ్చాడు.


తంత్రలోహనుడు కోదండుడి దగ్గరకెళ్ళి శిల్పాచార్యా! మందాకినీ పురం పరిసరాలలోని అడవిలోని గుడిలో ఒక అందమీన అమ్మాయి శిల్పాన్ని మీరు చెక్కారట. ఆ శిల్పాన్ని ఏ అమ్మాయిని చూసి చెక్కారు?" అని అడిగాడు.


"మానవోత్తమా! ఒక నెల క్రితం సూర్యాస్తమయం అయ్యాక ఒక కుమ్మరి నా దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఒక వజ్రం ఉంది. నిజానికీ ఆ వజ్రం ఇంద్రధనస్సులోని అన్ని రంగులనూ వెదజల్లుతూ చాలా అద్భుతంగా ఉంది. నేను నా కూతురి మెడలోని గొలుసు ఆ కుమ్మరికి ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకున్నాను. కానీ తెల్లారాక చూస్తే అది వజ్రం కాదు, గోరు. ఇంకేం చేస్తాను, శిల్పశాస్త్రం ప్రకారం ఆ గోరును చూసి మనిషిని ఊహించి వేసే అపూర్వ విద్య నాకు తెలుసు. ఆ విద్యప్రకారం ఆ శిల్పం చెక్కాను అని చెప్పాడు.


తంత్రలోహనుడు కుమ్మరి వాడి చిరునామా కనుక్కుని, కుమ్మరి వాడిని కలిసాడు. అయ్యా! మీరు కోదండుడు అనే శిల్పికి ఒక గోరును వజ్రం అని చెప్పి అమ్మారట కదా! ఆ గోరు మీకు ఎక్కడిది?” అని అడిగాడు.


ఆ ప్రశ్నకు కుమ్మరి వాడు అయ్యా! అది ఎంత భాదాకర సంఘటనో మీకు తెలియదు. అడవిలోంచి ఎవరో ఒక వేటగాడు వచ్చాడు. ఆ రాత్రి వేళ, నేను ఎలాగైతే శిల్పాచార్యుణ్ణి మోసం చేసానో అదే విధంగా వాడు ఆనాడు నన్ను మోసం చేసి, నాకు ఆ గోరుని అంటగట్టాడు. నా కూతురికి చక్కని గొలుసు చేయించి అందులో వజ్రాన్ని పొదుగించుకుందాం అనుకుని. నేను వాడి దగ్గర ఆ గోరుని తీసుకుని ఎన్నో కుండలు, పిడతలు ఇంకా ఏవేవో వస్తువులు ఇచ్చాను. మర్నాడు చూస్తే అది మామూలు గోరు. ఇంక ఏం చేయాలో పాలుపోక వాడు నన్ను ఎలా మోసం చేసాడో నేనూ అదే విధంగా శిల్పాచారిని మోసం చేసాను. కాకపోతే ఆయనకి నేను ఏ ఊరి నుండి ఆయన దగ్గరకు వచ్చానో తెలుసుగానీ నా ఇల్లేదో నేను చెప్పలేదు. మీకు ఎలా తెసింది?” అని అడిగాడు.


తంత్రలోహనుడు బాబూ! ఆయన నాకు మీ ఊరి పేరు మాత్రమే చెప్పారు. నేను అతికష్టం మీద వాకబు చేసి మీ చిరునామా తెలుసుకున్నాను అని చెప్పాడు.


తరవాత వేటగాడి గురించి వాకబు చేసి తంత్రలోహనుడు అతన్ని కలిసాడు. వేటగాడా! కుమ్మరి వాడికి నీవు ఒక గోరును వజ్రం అని అభద్ధం చెప్పి అమ్మావు. ఆ గోరు నీకు ఎక్కడిది?” అని అడిగాడు.


"అయ్యా! నేను కొన్నాళ్ళ క్రితం అడవిలోకి వేటకి వెళ్ళాను. కానీ ఒక్క జంతువూ దొరకలేదు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఒక చెట్టు క్రింద విశ్రమించాను. అలా నిద్రపోయిన నాకు మెలుకువ వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది. చూస్తే నా కంటి ఎదురుగా ఒక ప్రజ్వులితమైన వజ్రం కనిపించింది. ఆ వజ్రాన్ని నా యింటికి తీసుకెళ్ళాను. కానీ తెల్లారాక చూస్తే అది ఒక మామూలు గోరు. నేను ఆ గోరుని మోసం చేసి కుమ్మరి వాడికి అమ్మాను అని తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు.


కానీ ఇప్పుడు తంత్రలోహనుడికి కావలసింది వాడు తప్పు ఒప్పుకోవటం కాదు కనుక, ఆ విషయాన్ని పక్కన పెట్టి అతనికి గోరు దొరికిన చెట్టు దగ్గరికి వెళ్ళి విశ్రమించాడు. అప్పటి దాకా ఎవరినో ఒకరిని ఆ గోరు గురించి అడిగి తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అడగడానికి ఎవరూ లేరు కదా! అందుకని దిగాలుగా కూర్చున్నాడు. ఐతే ఆ చెట్టు మీద ఒక చిలుకల గుంపు నివసిస్తుంది. ఆ గుంపుకి ఒక రాజు కూడా ఉన్నాడు. మొత్తం 1000 చిలుకలకి రాజు ఐన సురేంద్రుడు తంత్రలోహనుడిని చూసి మానవేంద్రా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు? అసలు ఇంత రాత్రి ఇక్కడ ఎందుకున్నావు? ఈ అడవిలో ఎన్నో కౄర మృగాలుంటాయి. కనుక నీవు వాటి కంట పడకముందే ఇక్కడి నుండి దగ్గరలో ఉన్న ఏదైనా పట్టణానికి వెళ్ళిపో అని చెప్పింది.


తంత్రలోహనుడు తను ఎందుకు అక్కడికి వచ్చింది, అసలు మొత్తం ఏం జరిగిందీ అంతా చెప్పాడు.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)