27, సెప్టెంబర్ 2010, సోమవారం

పగలే వెన్నెలా - పరవశమాయెగా!

ఇది నా సొంత కథ. ఎక్కడా విని చదివి వ్రాసింది కాదు.

అనగా అనగా.....

పంపానది తీరంలోని అడవిలో చకోర పక్షులు నివసించేవి. అవి చంద్రుడి వెన్నెలను తప్పించి ఇంక దేనిని ఆహారంగా తీసుకునేవి కాదు. ఒక మధ్యాహ్నపూట, ఒక చకోర పక్షి, ఒక దిరిసెన చెట్టు మీద కూర్చుని కునికి పాట్లు పడుతుంది. ఆ చకోర పక్షి తనలో తను ‘ఈ రోజు అమావాస్య! చంద్రుడు రాడు. ఈ రొజుకు మాకు పస్తు’ అనుకుంది. అంతలో ఆ ప్రదేశమంతా వెన్నెల వెలుగు వ్యాపించింది.

ఆ చకోర పక్షి చాలా ఆశ్చర్యపోయింది. ‘ఈ రోజు అమావాస్య. అది గాక, ఈ మధ్యాహ్న పూట వెన్నెల ఎలా వచ్చిందబ్బా!’ అనుకుంటూ చుట్టూ చూసింది. ఆ పక్షికి వెన్నెల చల్లదనం , వెన్నెల వెలుగుకు కారణం ఏమిటో అర్ధం కాలేదు.సరే అనుకుని వాళ్ళ రాజు వద్దకు వెళ్ళింది.

చకోర రాజు దాని మాటలు విని ఆశ్చర్యపోయాడు. "ఈ వింత ఏమిటో తెలుసుకోవాలి పదండి," అంటూ చకోర పక్షులన్నిటిని వెంట బెట్టుకుని ఆ దిరిసెన చెట్టు వద్దకు వెళ్ళాడు. చకోర పక్షులు అక్కడికి వచ్చే కొద్ది వెన్నెల చల్లదనం పెరగసాగింది. ఆ చెట్టు వద్దకు వెళ్ళేటప్పటికి పక్షులన్ని ఇక ఆశ్చర్యం పట్టలేక పొయాయి. చకోర రాజు "ఈ వెన్నెల చల్లదనానికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ చుట్టుపక్కల వెతకండి. కారణమేమిటో కచ్చితంగా తెలుస్తుంది!" అని చెప్పాడు. చకోర పక్షులన్ని వెతకసాగాయి.

ఆ పక్షులన్ని పంపానది తీరంలో ఉన్న ఋష్యమూక పర్వతంవైపు వెళ్ళే కొద్దీ ఆ వెన్నెల చల్లదనం ఇంకా పెరగసాగింది. అక్కడకు చేరుకున్న పక్షులన్ని అసలు కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయాయి. సుగ్రీవుడి స్నేహం కోసం వచ్చిన రాముని దేహకాంతిని ఆ పక్షులన్నీ వెన్నెల అని భావించాయి. అది తెలుసుకుని చకోర పక్షులన్నీ... అడగకుండానే ఆ రోజుకు తమ ఆకలిని తీర్చినందుకు, ఆ నీలమేఘశ్యాముని భక్తి భావంతో పూజించి పరవశించాయి.