31, జనవరి 2009, శనివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 8

(నిన్నటి కధ తరువాయి భాగం)


మతిమంతుడు ఎనుబోతుగా మారాడని తెలియక అక్కడ మనోరమ అతను వస్తాడు అనుకుని ఎదురుచూడసాగింది. ఎంతసేపటికీ అతను రాలేదు. కొంత సేపటికి ప్రసవ వేదనతో ఆమె అరిచిన అరుపులకు చుట్టు పక్కల ఇళ్ళ స్త్రీలు వచ్చి, ఆమె పరిస్థితి గమనించి వెంటనే మంత్రసానిని పిలిపించారు. మనోరమకి ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆమె కొన్ని రోజులు ఎదురుచూసింది. కానీ మతిమంతుడు రాలేదు. దాంతో ఆమె రాజుగారి దగ్గరకి వెళ్ళి, తను ఎవరో మాత్రం చెప్పుకోకుండా తన కధ మొత్తం చెప్పి తన భర్తని వెతికిపెట్టమని కోరింది.


ఆ దేశపు మంత్రి దేశం అంతా వెతికించాడు. కానీ కనిపెట్టలేక పోయారు. అందులో వారి తప్పేముంది? మనిషి రూపంలో ఉంటే కదా వాళ్ళు కనిపెట్టటానికి! వాళ్ళు మనోరమతోటి తల్లీ! నీ భర్త దొరకలేదు. కానీ నువ్వు ఇప్పుడు నీ గతి ఏమిటీ?’ అని బాధ పడకు. మా కోశాగారం నుంచీ, మా ఖజానా నుంచీ నీకు ప్రతి నెలా అన్నీ అవసరాలు తీరే విధంగా అన్నీ అందేలా చూస్తాము. ఆ సదుపాయాలతో నువ్వు సుఖంగా ఉండవచ్చు అని చెప్పాడు రాజు.


కానీ ఆమె ఒప్పుకోకుండా. ఇలా బదులు చెప్పింది ఓ మహారాజా! మీరు నాపై చూపిన దయకి కృతఙ్ఞురాలిని. కానీ నా భర్తకి నేనంటే ఎంతో ఇష్టం. అలాంటిది గర్భవతినైన నన్ను విడిచి వేరే ఊరికి ఎట్టి పరిస్తుతుల్లో పోరు. అలాంటప్పుడు ఈ ఊరిలోనే ఉంటే ఆయన తప్పకుండా మీకు దొరికేవాడు. రెండూ జరగలేదు అంటే తప్పకుండా ఆయన చనిపోయి ఉంటారు. భర్త చనిపోయాక భార్యగా నేను బ్రతికి ఉండీ లాభం ఏమిటీ? నేను ఎవరినైతే నా జీవితంగా భావించానో ఆ వ్యక్తి నాకు దూరం అయ్యారు. కనుక నేనే ఆయన వద్దకు వెళ్ళాలి. కనుక దయచేసి నాకు ఈ రోజు సాయంత్రం చితి పేర్పించండి అని అన్నది. రాజు మిగతా సభకులు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇంక రాజు చితి పేర్పించమని ఆఙ్ఞ జారీ చేసాడు. ఈ విషయం ఊరంతా పాకింది.


ఐతే ఇక్కడ ఈ నర్తకీ ప్రతి రోజూ రాత్రికి మతిమంతుడిని మనిషిగా చేస్తుంది. మళ్ళీ పొద్దునకి ఎనుబోతుగా మార్చేస్తుంది. పాపం! మతిమంతుడికి ఏమో ఆ మందు ప్రభావమో లేక పొద్దునంతా ఎనుబోతుగానూ రాత్రంతా మనిషిగానూ మారటం వల్లనో అంతా అయోమయంగా ఉండేది. అసలు తను ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులే తెలిసేవి కాదు. ఇలా ఇతని జీవితం సాగుతుండగా ఆ నర్తకికి ఎవరో ఒకావిడ భర్త చనిపోయాడని తెలుసుకుని ఆ బాధతో ఆత్మాహుతి చేసుకోబోతుందని తెలిసింది. ఊరు ఊరంతా ఆ విశేషం ఏమిటో చూడాలని వెళ్తున్నారని, ఆ నర్తకీ కూడా బయలుదేరింది. కాకపోతే సరే ఈ వింత ఏమిటో తను కూడా చూస్తాడు. తనని కూడా తీసుకెళ్దాంఅని భావించి ఆమె మతిమంతుడిని కూడా మనిషిని చేసి తీసుకెళ్ళింది.


ఐతే వాళ్ళు వెళ్ళే సరికి మనోరమ చితి చుట్టూ అప్పటికే మూడో ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఆమెని చూడగానే మతిమంతుడికి తన గతం అంతా గుర్తుకు వచ్చింది. వెంటనే జరిగింది ఏమిటో కూడ అర్ధం అయిపోయింది. ఐతే మతిమంతుడు మన సినిమాలలో హీరోలలాగా మతిలేని వాడు కాదు. అగ్నిలో దూకబోతున్న భార్యని ఆపడానికి బదులు ఆ నర్తకిని చంపడమొ లేక తన్నడమో చేయడానికి! అందువల్ల అతను నేను బ్రతికే ఉన్నాను. నువ్వు అగ్నిలో దూకద్దు అంటూ అరుస్తూ మనోరమ దగ్గరికి పరిగెత్తాడు. ఐతే మనోరమ దృష్టి చుట్టూ జరుగుతున్న వాటిమీద అస్సలు లేకపోవడంతో, ఆమెకి ఆ మాటలేవీ వినిపించ లేదు. ఆమె అగ్నిలో దూకేసింది. అది చూడగానే భరించలేక అతను కూడా అగ్నిలో దూకేసాడు. నా మూలంగా ఇద్దరు చనిపోయారే అని నర్తకీ కూడా అగ్నిలో దూకింది. అది చూసి అయ్యో మతిమంతుడు ఈ ఊరిలోనే ఉన్నా, అతన్ని వెతికి పట్టుకోలేక పోయానేఅన్న భాదతో మంత్రి కూడా అగ్నిలో దూకాడు. ఇదంతా చూసిన రాజు తట్టుకోలేక, మహాంకాళి గుడికెళ్ళి, అమ్మా! కాళికా మాతా! నా దేశంలో బ్రతకడానికి వచ్చిన ఇద్దరు పరదేశస్తులను నా మంత్రినీ ఆ నర్తకినీ బ్రతికిస్తావా లేక నన్ను కూడా ఆత్మాహుతి చేసుకోమంటావా?" అని అమ్మవారిని స్తుతించాడు. అప్పుడు అమ్మవారు అందరినీ బ్రతికించింది.

ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప?"అని రవిక అడిగింది.


ఆ ప్రశ్నకు విక్రమార్కుడు ఈ సారికూడా పలుకని పడంతిని మాట్లాడించడం కోసం కావాలనే ఓ రవికా! మంత్రి చనిపోవడమే గొప్ప అని సమాధానం చెప్పాడు.


ఆ సమాధానం విన్నవెంటనే పలుకని పడంతి ఏమిటయ్యా ఈ తప్పుడు సమాధానాలు? మంత్రి చనిపోవడం గొప్ప కాదు. ఆ నర్తకీ చనిపోవడం గొప్ప. ఎందుకంటే నర్తకీ అన్నాక డబ్బు, సుఖం తప్ప ఇంకేమీ పట్టవు. అలా అయ్యుండీ కూడా ఆమె వారి కోసం చనిపోయిందంటే అదీ గొప్ప అని సరైన సమాధానం చెప్పింది.


అప్పుడు విక్రమార్కుడు అయ్యో! ఆడవారికి తెలిసినది మనకు తెలియలేదు కదా!అని చింతించాడు[?]


అప్పుడు పలుకని పడంతి ఆహా! మగవారికి తెలియనిది మనకు తెలిసెను కదా!అని సంతసించింది.


ఈ సారి విక్రమార్కుడు పలుకని పడంతి పయ్యెదని ఓ చీర కొంగూ! పలుకని పడంతి ఏమో మాట్లాడటం లేదు. పొద్దేమో పొడవడం లేదు. నాకేమో నిద్ర రావడం లేదు. నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా!” అని అడిగాడు.


వెంటనే భేతాళుడు పమిట కొగులో ప్రవేశించి, "చాల్చాల్లే పోవయ్యా! భలే అడిగావు. ఇక్కడ ఈ చిన్నదేమో నా మీద వడ్డాణాలూ, నగలు అంటూ అవీ ఇవీ పెట్టుకుంది. దాంతో నాకు గాలాడక నేను భాద పడుతుంటే. రోలు ఒచ్చి డోలుకు చెప్పుకున్నట్టునువ్వు నన్ను కధ అడుగుతున్నావా? అసలు నీకిది న్యాయమా?” అని అన్నాడు.

వెంటనే పలుకని పడంతి చీర మార్చుకుని వచ్చింది. ఈ భేతాళుడు ప్రవేశించిన చీరని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టింది.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

కామెంట్‌లు లేవు: