31, జనవరి 2009, శనివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 8

(నిన్నటి కధ తరువాయి భాగం)


మతిమంతుడు ఎనుబోతుగా మారాడని తెలియక అక్కడ మనోరమ అతను వస్తాడు అనుకుని ఎదురుచూడసాగింది. ఎంతసేపటికీ అతను రాలేదు. కొంత సేపటికి ప్రసవ వేదనతో ఆమె అరిచిన అరుపులకు చుట్టు పక్కల ఇళ్ళ స్త్రీలు వచ్చి, ఆమె పరిస్థితి గమనించి వెంటనే మంత్రసానిని పిలిపించారు. మనోరమకి ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆమె కొన్ని రోజులు ఎదురుచూసింది. కానీ మతిమంతుడు రాలేదు. దాంతో ఆమె రాజుగారి దగ్గరకి వెళ్ళి, తను ఎవరో మాత్రం చెప్పుకోకుండా తన కధ మొత్తం చెప్పి తన భర్తని వెతికిపెట్టమని కోరింది.


ఆ దేశపు మంత్రి దేశం అంతా వెతికించాడు. కానీ కనిపెట్టలేక పోయారు. అందులో వారి తప్పేముంది? మనిషి రూపంలో ఉంటే కదా వాళ్ళు కనిపెట్టటానికి! వాళ్ళు మనోరమతోటి తల్లీ! నీ భర్త దొరకలేదు. కానీ నువ్వు ఇప్పుడు నీ గతి ఏమిటీ?’ అని బాధ పడకు. మా కోశాగారం నుంచీ, మా ఖజానా నుంచీ నీకు ప్రతి నెలా అన్నీ అవసరాలు తీరే విధంగా అన్నీ అందేలా చూస్తాము. ఆ సదుపాయాలతో నువ్వు సుఖంగా ఉండవచ్చు అని చెప్పాడు రాజు.


కానీ ఆమె ఒప్పుకోకుండా. ఇలా బదులు చెప్పింది ఓ మహారాజా! మీరు నాపై చూపిన దయకి కృతఙ్ఞురాలిని. కానీ నా భర్తకి నేనంటే ఎంతో ఇష్టం. అలాంటిది గర్భవతినైన నన్ను విడిచి వేరే ఊరికి ఎట్టి పరిస్తుతుల్లో పోరు. అలాంటప్పుడు ఈ ఊరిలోనే ఉంటే ఆయన తప్పకుండా మీకు దొరికేవాడు. రెండూ జరగలేదు అంటే తప్పకుండా ఆయన చనిపోయి ఉంటారు. భర్త చనిపోయాక భార్యగా నేను బ్రతికి ఉండీ లాభం ఏమిటీ? నేను ఎవరినైతే నా జీవితంగా భావించానో ఆ వ్యక్తి నాకు దూరం అయ్యారు. కనుక నేనే ఆయన వద్దకు వెళ్ళాలి. కనుక దయచేసి నాకు ఈ రోజు సాయంత్రం చితి పేర్పించండి అని అన్నది. రాజు మిగతా సభకులు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇంక రాజు చితి పేర్పించమని ఆఙ్ఞ జారీ చేసాడు. ఈ విషయం ఊరంతా పాకింది.


ఐతే ఇక్కడ ఈ నర్తకీ ప్రతి రోజూ రాత్రికి మతిమంతుడిని మనిషిగా చేస్తుంది. మళ్ళీ పొద్దునకి ఎనుబోతుగా మార్చేస్తుంది. పాపం! మతిమంతుడికి ఏమో ఆ మందు ప్రభావమో లేక పొద్దునంతా ఎనుబోతుగానూ రాత్రంతా మనిషిగానూ మారటం వల్లనో అంతా అయోమయంగా ఉండేది. అసలు తను ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులే తెలిసేవి కాదు. ఇలా ఇతని జీవితం సాగుతుండగా ఆ నర్తకికి ఎవరో ఒకావిడ భర్త చనిపోయాడని తెలుసుకుని ఆ బాధతో ఆత్మాహుతి చేసుకోబోతుందని తెలిసింది. ఊరు ఊరంతా ఆ విశేషం ఏమిటో చూడాలని వెళ్తున్నారని, ఆ నర్తకీ కూడా బయలుదేరింది. కాకపోతే సరే ఈ వింత ఏమిటో తను కూడా చూస్తాడు. తనని కూడా తీసుకెళ్దాంఅని భావించి ఆమె మతిమంతుడిని కూడా మనిషిని చేసి తీసుకెళ్ళింది.


ఐతే వాళ్ళు వెళ్ళే సరికి మనోరమ చితి చుట్టూ అప్పటికే మూడో ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఆమెని చూడగానే మతిమంతుడికి తన గతం అంతా గుర్తుకు వచ్చింది. వెంటనే జరిగింది ఏమిటో కూడ అర్ధం అయిపోయింది. ఐతే మతిమంతుడు మన సినిమాలలో హీరోలలాగా మతిలేని వాడు కాదు. అగ్నిలో దూకబోతున్న భార్యని ఆపడానికి బదులు ఆ నర్తకిని చంపడమొ లేక తన్నడమో చేయడానికి! అందువల్ల అతను నేను బ్రతికే ఉన్నాను. నువ్వు అగ్నిలో దూకద్దు అంటూ అరుస్తూ మనోరమ దగ్గరికి పరిగెత్తాడు. ఐతే మనోరమ దృష్టి చుట్టూ జరుగుతున్న వాటిమీద అస్సలు లేకపోవడంతో, ఆమెకి ఆ మాటలేవీ వినిపించ లేదు. ఆమె అగ్నిలో దూకేసింది. అది చూడగానే భరించలేక అతను కూడా అగ్నిలో దూకేసాడు. నా మూలంగా ఇద్దరు చనిపోయారే అని నర్తకీ కూడా అగ్నిలో దూకింది. అది చూసి అయ్యో మతిమంతుడు ఈ ఊరిలోనే ఉన్నా, అతన్ని వెతికి పట్టుకోలేక పోయానేఅన్న భాదతో మంత్రి కూడా అగ్నిలో దూకాడు. ఇదంతా చూసిన రాజు తట్టుకోలేక, మహాంకాళి గుడికెళ్ళి, అమ్మా! కాళికా మాతా! నా దేశంలో బ్రతకడానికి వచ్చిన ఇద్దరు పరదేశస్తులను నా మంత్రినీ ఆ నర్తకినీ బ్రతికిస్తావా లేక నన్ను కూడా ఆత్మాహుతి చేసుకోమంటావా?" అని అమ్మవారిని స్తుతించాడు. అప్పుడు అమ్మవారు అందరినీ బ్రతికించింది.

ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప?"అని రవిక అడిగింది.


ఆ ప్రశ్నకు విక్రమార్కుడు ఈ సారికూడా పలుకని పడంతిని మాట్లాడించడం కోసం కావాలనే ఓ రవికా! మంత్రి చనిపోవడమే గొప్ప అని సమాధానం చెప్పాడు.


ఆ సమాధానం విన్నవెంటనే పలుకని పడంతి ఏమిటయ్యా ఈ తప్పుడు సమాధానాలు? మంత్రి చనిపోవడం గొప్ప కాదు. ఆ నర్తకీ చనిపోవడం గొప్ప. ఎందుకంటే నర్తకీ అన్నాక డబ్బు, సుఖం తప్ప ఇంకేమీ పట్టవు. అలా అయ్యుండీ కూడా ఆమె వారి కోసం చనిపోయిందంటే అదీ గొప్ప అని సరైన సమాధానం చెప్పింది.


అప్పుడు విక్రమార్కుడు అయ్యో! ఆడవారికి తెలిసినది మనకు తెలియలేదు కదా!అని చింతించాడు[?]


అప్పుడు పలుకని పడంతి ఆహా! మగవారికి తెలియనిది మనకు తెలిసెను కదా!అని సంతసించింది.


ఈ సారి విక్రమార్కుడు పలుకని పడంతి పయ్యెదని ఓ చీర కొంగూ! పలుకని పడంతి ఏమో మాట్లాడటం లేదు. పొద్దేమో పొడవడం లేదు. నాకేమో నిద్ర రావడం లేదు. నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా!” అని అడిగాడు.


వెంటనే భేతాళుడు పమిట కొగులో ప్రవేశించి, "చాల్చాల్లే పోవయ్యా! భలే అడిగావు. ఇక్కడ ఈ చిన్నదేమో నా మీద వడ్డాణాలూ, నగలు అంటూ అవీ ఇవీ పెట్టుకుంది. దాంతో నాకు గాలాడక నేను భాద పడుతుంటే. రోలు ఒచ్చి డోలుకు చెప్పుకున్నట్టునువ్వు నన్ను కధ అడుగుతున్నావా? అసలు నీకిది న్యాయమా?” అని అన్నాడు.

వెంటనే పలుకని పడంతి చీర మార్చుకుని వచ్చింది. ఈ భేతాళుడు ప్రవేశించిన చీరని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టింది.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

29, జనవరి 2009, గురువారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 7

(నిన్నటి కధ తరువాయి భాగం)

తెరగుడ్డ కధ అంతా చెప్పి, "ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప విషయం?” అని అడిగాడు.

ఆ ప్రశ్నకి విక్రమార్కుడు “ఓ తెరగుడ్డా! తంత్రలోహనుడు చనిపోవడమే గొప్ప విషయం” అని చెప్పాడు. ఎందుకంటే విక్రమార్కుడు పలుకని పడంతిని మాట్లాడించాలి కదా! అందుకని కావాలనే జవాబు తప్పుగా చెప్పాడు. ఎందుకంటే అలా తప్పుగా చెప్పాడనుకో అప్పుడు అంత సేపు కధ విన్నది కాబట్టి పలుకని పడంతి తను మాట్లాడకూడదు అని మర్చిపోయి ‘సరైన జవాబు అది కాదు. ఇది’ అంటూ కోపంగానైనా సరే సరైన జవాబు చెపుతుందని విక్రమార్కుడి ఉద్ధేశం.

ఆయన ఉద్ధేశం నిజం చేయటానికే అన్నట్టు, పలుకని పడంతి “ఏమిటీ? ఎవరు చనిపోయినది గొప్ప అన్నారు? మీరు చెప్పింది శుధ్ద తప్పు. పూజారి చనిపోయినదే గొప్ప. ఎందుకంటే పూజారికి ఏ సంబంధం లేక పోయినా అతను అంత మంది చనిపోయి ఉండటం భరించలేక చనిపోయాడు. కనుక అతను చనిపోయిందే గొప్ప” అని అన్నది.

"ఔనౌను! నువ్వు చెప్పిందే నిజం. నాది శుధ్ద తప్పు జవాబు” అన్నాడు విక్ర మార్కుడు.

కొంచెం సేపు అయ్యాక విక్రమార్కుడు ఈ సారి పలుకని పడంతి ధరించిన రవికను ఉధ్దేశించి “ఓ రవికా! నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా? నాకేమో నిద్ర రావడం లేదు. పలుకని పడంతేమో మాట్లాడదు. పొద్దేమో గడవదు. కాబట్టి నువ్వన్నా ఏదైనా కధ చెప్తే పొద్దుపోతుంది” అన్నాడు.

వెంటనే భేతాళుడు రవికలో ప్రవేశించాడు. “ఓ రాజా! కధ, కధ అని ఓ బాధిస్తున్నారు. నేను కధ చెప్పగలిగే స్థితిలో లేను. ఈ చిన్నదేమో నన్ను బిగించి కట్టింది. అసలే నాకు ఊపిరాడడం లేదు. ఇక మీకు ఎం కధ చెప్పమంటావయ్యా?” అని అన్నాడు రవికలోని భేతాళుడు.

వెంటనే పలుకని పడంతి ఒక గదిలోకి వెళ్ళి తను ధరించిన రవికని తీసి ఇంకొక రవిక ధరించింది. ఈ మునుపటి రవికని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టి, మాట్లాడకుండా కూర్చుంది.

విక్రమార్కుడు “ఓ రవికా! పలుకని పడంతి ఎంత దయాళువో చూడు. నీ మీద కరుణతో నిన్ను విడిచి పెట్టింది. ఇప్పటికన్నా కధ చెప్పు” అన్నాడు.

మతిమంతుడూ మంత్రమనోరమ

అప్పుడు రవిక “ఓ రాజేంద్రా! ఒక చక్కని కధ చెప్తాను వినండి.

రంగనాధ పురం అనే ఒక దేశం ఉందేది. ఆ దేశాన్ని రంగనాధుడనే రాజు పాలించేవాడు. అతనికి సంబ్రమవర్మ అనే మంత్రి ఉన్నాడు.

ఈ రాజుకూ మంత్రమనోరమ అనే కూతురు పుట్టింది. మంత్రికి కూడా మతిమంతుడు అనే కొడుకు పుట్టాడు. ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.

యుక్తవయసుకి వచ్చేసరికి మనోరమకీ మతిమంతుడికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం పెరిగింది. అందువల్ల ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలి అనుకున్నారు. కానీ రంగనాధుడు `రాజుకూతురు అయ్యుండీ మనోరమ రాజు క్రింద వాడయిన మంత్రి కొడుకుని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోడని’ తెలుసుకుని మతిమంతుడూ, మనోరమా దేశాంతరాలకు వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో మనోరమ గర్భవతి అయ్యింది. ఆమెకి నెలలు నిండాయి.

మతిమంతుడు “మంత్రసానిని తీసుకు వస్తాను” అని చెప్పి వెళ్ళాడు.

అతను మంత్రసాని ఇల్లేదో తెలుసుకుని ఆమె ఇంటికెళ్ళాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో అరుగు మీద కూర్చుని ఎదురు చూడ సాగాడు.

అయితే ఆ మంత్రసాని ఇంటి ఎదురు ఇంట్లో ఒక నర్తకీ నివసిస్తుంది. ఆ నర్తకీ ఇతనిని చూసి ‘ఆహా! ఎవరితను? ఎంత అందంగున్నాడు!’ అని అనుకుంది. మరుక్షణమే మతిమంతుడి దగ్గరకెళ్ళి “ఆర్యా! తమరు ఎవరి కోసం ఇక్కడ ఎదురుచూస్తున్నారు? అసలు తమ కధ ఏమిటి?" అని అడిగింది. మతిమంతుడు తన సంగతి అంతా చెప్పాడు.

అంతా విన్న ఆ నర్తకీ “ఈ ఎండలో ఎందుకు కూర్చోవడం. నా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఈ లోపల నేను ఆ మంత్రసానిని పిలిపిస్తాను” అని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తివాచీ మీద కూర్చో పెట్టింది.

"మంత్రసానికి కబురు పెట్టాను వచ్చేస్తుంది. ఈ లోపల భోజనం చేయండి” అని చెప్పి అతని చేత బలవంతానా భోజనం చేయింపించి తాంబూలం ఇచ్చింది. కాకపోతే ఆ తాంబూలంలో మంత్రించిన మందు ఏదో కలిపి ఇచ్చింది. ఆ మందు కలిపిన తాంబూలం తినడం వల్ల మతిమంతుడు ఎనుబోతుగా మారిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి ఆమె తన గొడ్లపాకలో కట్టేసుకుంది.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

27, జనవరి 2009, మంగళవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 6

(నిన్నటి కధ తరువాయి భాగం)

తంత్రలోహనుడు చిలుకలకి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న చిలకల గుంపులోంచి ఒక చిలుక సురేంద్రుడి దగ్గరకి వచ్చి, "మహారాజా! ఆ గోరు గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఇతను అన్నాక గుర్తువచ్చింది. కొన్నాళ్ళ క్రితం మేము అందరం సప్తసముద్రాలు దా‍టి సప్తద్వీపాలకి అవతల ఉండే మధువనంలోని అద్భుతమైన ఫలాలను తిన్నాము. తిరిగి వచ్చేటప్పుడు, మీ కోసం అని అందరం కూడా మేము తీసుకురాగలిగినన్ని ఫలాలను తీసుకొస్తున్నపుడు. మల్లికా ద్వీపంలో సూర్యాస్తమయ వేళలో ఏడు అంతస్తుల భవనం మీద మేనకా, రంభల లాంటి అపూర్వ సౌందర్యరాశి తల చిక్కుతీసుకుంటుండగా జుట్టుకు చిక్కుకుని ఆమె గోరు దూరంగా పడ్డది. నేను మెరుస్తున్న ఆ గోరుని వజ్రం అనుకున్నాను. ఆమె ఉంగరం నుంచీ వజ్రం జుట్టుకు చిక్కుకుని దూరంగా పడింది కాబోలు అనుకుని, నా నోట్లోని ఫలాలను పక్కన పెట్టి ఆ గోరుని తీసుకొచ్చాను. మర్నాడు పొద్దున చూస్తే అది మామూలు గోరే. మీకు గుర్తుందో లేదో ఆ రోజు మీరు బాగా గుణీసి చివరికి ముక్కుతో నన్నొక పోటుపొడిచారు” అని జరిగిందంతా గుర్తుచేసింది.

సురేద్రుడు “అవును! నాకిప్పుడు గుర్తొచ్చింది. విన్నారు కదా స్వామీ, ఈ చిలుక చెప్పిన దంతా నిజం” అని చెప్పాడు.

"నాకు జరిగిందంతా చెప్పారు కాబట్టి మీరే అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తే మీ అంత మంచివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి దయచేసి చెప్పండి” అని తంత్రలోహనుడు బ్రతిమాలాడు.

అప్పుడు చిలుకల రాజు సురేంద్రుడు “పుణ్యాత్మా! ఇక్కడికి పది యోజనాల దూరంలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు ఆకాశంలోకి పెరిగినట్టుంటుంది. ఆ చెట్టుమీద గండబేరుండ పక్షులు నివసిస్తున్నాయి. నువ్వు ఎలాగైనా వాటి స్నేహాన్ని సంపాదించుకున్నావంటే, నీ పని జరిగవచ్చు” అని చెప్పాడు.

తంత్రలోహనుడు చిలకలకి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను గండబేరుండ పక్షులు ఉండే చెట్టు దగ్గరకి వెళ్ళాడు. ఆ సమయంలో గూటిలో పిల్లపక్షులు మాత్రమే ఉన్నాయి. తల్లి పక్షీ, తండ్రి పక్షీ బయటికి వెళ్ళాయి. అవి రెండూ తిండి వెతుక్కుని తీసుకొచ్చేలోపల కృష్ణపాము పిల్లలను తినాలన్న ఆశతో చెట్టుమీదకు పాక సాగింది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన తంత్రలోహనుడు ఆ పాముని ఒక్క ఉదుటన తన కత్తికి బలిపెట్టాడు. ఆ సంఘటనతో పిల్లపక్షులు ఎంతో ఆనందంతో అతనికి ధన్యవాదాలు చెప్పి అతనికి తమూ, తమ తల్లి దండ్రులూ ఏదైనా సహాయం చేస్తామని చెప్పాయి. కానీ అది తమ తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయం అవ్వటం వల్ల దూరంగా చెట్టు క్రింద కూర్చోమని చెప్పాయి. అతను అలాగే చేసాడు. రెండు నిమిషాలకు ఆ పిల్లల అమ్మానాన్నా వచ్చాయి. పక్షి పిల్లలు జరిగిందంతా చెప్పాయి. వెంటనే గండబేరుండాలు తంత్రలోహనుడి దగ్గరికి వెళ్ళి “మీరు మా పిల్లలను కాపాడినందుకు ధన్యవాదాలు. మేము మీకు చేయగలిగిన సహాయమేదైనా ఉందా స్వామీ?” అని అడిగాయి.

తంత్రలోహనుడు తన కధ మొత్తం చెప్పాడు. తను వాటి నుంచీ కోరుకుంటున్న సహాయం యేమిటో కూడా చెప్పాడు. వెంటనే మగపక్షి అతన్ని తనపైన ఎక్కించుకొని తన వాళ్ళకి వీడ్కోలు చెప్పి బయలుదేరింది. దారిలో నవరత్న ద్వీపం మీదుగా వెళుతున్నపుడు తంత్రలోహనుడు తనని దించమని అడిగాడు. అక్కడ ఎన్నో నవరత్నాలని మూటకట్టుకుని మళ్ళీ పక్షి మీద బయలుదేరాడు. అతన్ని మల్లికా ద్వీపంలో దించి, అతనికి ఒక ఈకని ఇచ్చి “ఈ ఈకని గనకా తగలబెట్టారంటే నేను మరుక్షణంలో మీ ఎదుటకి వస్తాను” అని చెప్పి వెళ్ళీపోయింది.

తంత్రలోహనుడు రత్నాల వ్యాపారిని అంటూ ఒక దుకాణం అద్దెకి తీసుకుని, చాలా చౌకగా రత్నాలు అమ్మాడు. ఊరిలోని అందరూ కూడా అతని దెగ్గర రత్నాలు కొనడానికి వచ్చారు. అందరిలాగానే నవకోటి నారాయణ శెట్టి అనే ఒక శెట్టి కూడా వచ్చాడు. అతను ఆ ఊరిలోని గొప్ప ధనవంతుడు. ఆ ఊరిలో అతనికి మాత్రమే ఏడు అంతస్తుల భవనం ఉంది. ఈ విషయం తెలుసుకున్న తంత్రలోహనుడికి అతను తను కలవాలనుకుంటున్న అమ్మాయి తండ్రి అయ్యుండచ్చు అని అనుకున్నాడు. నిజానికీ నారాయణ శెట్టి కూతురి గోరే చిలుకలు తెచ్చింది. ఆమె బొమ్మే గుళ్ళో ఉన్నది కూడా. ఆమె పేరు సంగీత సాహిత్య సరసోల్లాస హాసినీ. సౌందర్యంలో ఆమె దేవతలకంటే కూడా ఎంతో బాగుంటుంది.

తంత్రలోహనుడు తన పేరు భైరవ లింగశెట్టి అని తను దేశపర్యాటన చేస్తూ రత్నాలు అమ్ముకుంటూ తిరుగుతున్నానని అందరికీ చెప్పుకున్నాడు. తంత్రలోహనుడితో నారాయణశెట్టికి మంచి స్నేహం ఏర్పడింది. తంత్రలోహనుడిని తన ఇంట్లో బస చేయటానికి నారాయణ శెట్టి కోరాడు. తంత్రలోహనుడు అందుకు సరే అన్నాడు. వాళ్ళింటిలో ఉంటూ సంగీత సాహిత్య సరసోల్లాస హాసినితో తంత్రలోహనుడికి పరిచయం ఏర్పడింది. శెట్టి కూతురు ఐన ఆమెకి కూడా తంత్రలోహనుడి పైన సద అబిప్రాయం కలిగింది.

ఒక రోజు తంత్రలోహనుడు “శెట్టి గారు! ఎన్నాళ్ళని నేను మీ ఇంట్లో ఉంటాను. రేపో, మాపో నేను నా భార్యని తీసుకురావాలనుకుంటున్నాను. కనుక మీ ఇంటి ఎదురుగా ఉన్న స్ధలాన్ని నాకు ఇవ్వండి నేను ఒక ఇల్లు కట్టుకుంటాను. నేను ఈ ఊరును వదిలి వెళ్ళే టప్పుడు మీకే ఆ ఇంటిని కూడా ఇచ్చేస్తాను” అని అన్నాడు. నారాయణ శెట్టి అందుకు ఒప్పుకున్నాడు.

తంత్రలోహనుడు అక్కడ ఇల్లు కట్టించేటప్పుడు కొంతమంది నమ్మకస్తులైన పని వాళ్ళతో ఆ ఇంటినుంచీ హాసినీ గదికి ఒక సొరంగం తవ్వించాడు. ఇల్లు కట్టడం పూర్తయ్యింది. తంత్రలోహనుడు గృహప్రవేశం చేశాడు.

ఒక రోజు రాత్రి తంత్రలోహనుడు హాసినీ గదిలోకి సొరంగం ద్వారా ప్రవేసించి ఆమెని ఒక కర్రతో తట్టి నిద్రలేపాడు. సహజంగా ధైర్యం కలిగినది, అతని మీద మంచివాడు అన్న ఉద్దేశంకూడా ఉంది కనుక ఆమె భయపడకుండా అతను ఎందుకు వాచ్చాడని అడిగింది. అతను తన కధ మొత్తం చెప్పి తరవాత ఏం జరగాలో కూడా చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది.

మర్నాడు తంత్రలోహనుడు శెట్టి దగ్గరికి వెళ్ళి “శెట్టిగారూ నా భార్య రాత్రి ఊరినుండీ వచ్చిందండీ. కనుక ఈ రోజు మీరు మా ఇంట్లో విందు చేయాలి” అని చెప్పాడు. శెట్టి అందుకు ఒప్పుకున్నాడు. మద్యానం విందుకు వెళ్తూ శెట్టి కూతురుని రమ్మంటే “నాన్నా! నాకు చాలా తల నొప్పిగా ఉంది. నేను రాలేను కనుక మీరు వెళ్ళండి” అంటూ ఒకటే మూలిగింది. సర్లే అనుకుని శెట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరూ విందుకి వెళ్ళారు.

ఐతే హాసినీ సొరంగం ద్వారా ముందుగానే అక్కడికి చేరుకుని వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళకి అయోమయంగా అనిపించింది. అయితే తంత్రలోహనుడు “నా భార్య అచ్చం మీ కూతురిలాగానే ఉంది కదండీ!” అన్నాడు. కానీ శెట్టికి మాత్రం అనుమానంగానే అనిపించింది. `ఈమె నా కూతురే నేమోనని’ తెగ ఆలోచించాడు. కానీ తన అనుమానాన్ని బలపరిచేది ఏదీ దొరకక ఊరుకున్నాడు. అందరూ విందు చేస్తూ ఉండగా అతనికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అతను హాసినీ నెయ్యి వడ్డిసుండగా నెయ్యిని ఆమె చీరకొంగుపై పొరపాటున పోసినట్టుగా పోసాడు. అతని ఆలోచన ఏమిటో తంత్రలోహనుడికి అర్ధం అయ్యింది. అందరూ విందు అయ్యాక కబుర్లు చెప్పుకుంటుండగా తంత్రలోహనుడు ఎవరికీ తెలియకుండా పని వాడి చేత నెయ్యి మరక పడ్డ చీరలాంటి చీరే ఇంకోటి తెప్పించాడు.

శెట్టి ఇంటికి వెళ్ళేలోపలే హాసినీ ఇంట్లోకి వెళ్ళి మంచంమీద మూలుగుతూ పడుకుంది. “హాసినీ! ఒక సారి ఇలా రా తల్లీ!” అని శెట్టి పిలవగానే హాసినీ “నాన్నా! నేను రాగలిగే స్తితిలోలేను. నన్ను పడుకోనియ్యి నాన్నా!” అంటూ అంది గారాబంగా. “సరే. నువ్వు రా అక్కర లేదు కానీ తల్లి నీ వంటిమీద ఉన్న చీర ఇలా పంపించి నువ్వు ఇంకో చీర కట్టుకో తల్లి” అని శెట్టి చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాకపోతే నెయ్యి మరక పడ్డ చీరకు బదులు అలాగే ఉన్న ఇంకొక చీరను పంపించింది. చీర అంతా వెతికినా కూడా శెట్టికి నెయ్యి మరకలుగానీ, పోనీ ఆ నెయ్యిని కడిగేసిన నీటి తడిగానీ తగల్లేదు. దాంతో అతను ‘నేను నా కూతురిని అనవసరంగా అనుమానించాను’ అనుకున్నాడు.

కొన్నిరోజులు గడిచాయి. ఒక రోజు తెల్లవారు జామున తంత్రలోహనుడు శెట్టి ఇంటికి వచ్చి “శెట్టి గారూ! నేను ఇప్పుడు మా ఊరికి వేళ్ళాల్సిన పని పడింది. కనుక మీ దగ్గర సెలవు తీసుకుందాం అని వాచ్చాను” అన్నాడు.

శెట్టి అతని కుటుంబ సభ్యులందరూ తంత్రలోహనుడికి వీడ్కోలు ఇవ్వడానికి వెళ్ళారు. అయితే హాసినీని మాత్రం ఎవరూ నిద్రలేపలేదు. “ఇంత తెల్లవారుజామున ఆమెని నిద్రలేపకండి” అని తంత్రలోహనుడు అన్నాడు కనుక.

అయితే హాసినీ ఎప్పుడో నిద్ర లేచి తంత్రలోహనుడి ఇంటి దగ్గరికి వెళ్ళింది. శెట్టి మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే వాళ్ళని తంత్రలోహనుడూ, హాసినీ ఊరి చివరి దాకా తీసుకువెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అలా ఊరి చివరి దాకా రాకపోతే ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏమిటో అర్ధమైపోతుంది అప్పుడు హాసినీని వాళ్ళు తీస్కెళ్ళిపోతారు. అందుకని మాటల్లో పెట్టి వాళ్ళని ఊరి చివరికి తీసుకెళ్ళి “ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా దూరం వచ్చారు” అని తంత్రలోహనుడు అన్నాడు. వాళ్ళు వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే హాసినీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ వీడ్కోలు తీసుకుంది. వాళ్ళు ఆమెని ఓదార్చి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే తంత్రలోహనుడు గండబేరుండ పక్షి ఇచ్చిన ఈకని తగలబెట్టాడు. వెంటనే గండబేరుండ పక్షి వచ్చింది. ఇద్దరూ పక్షిమీద నిముషాలలో వాటి గూడు ఉన్న చెట్టు దగ్గరకి చేరుకున్నారు.

ఇక్కడ నారాయణ శెట్టి ఇంటికి వెళ్ళాక తన కూతురు ఇంట్లో లేకపోవడం గమనించుకున్నాడు. ఆమె గది తలుపుకు అవతల వైపున గడియపెట్టి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తలుపు బద్దలు కొట్టి మరీ ఆమె గదిలోకి వెళ్ళగా అక్కడ ఆమె లేదు. బదులుగా గదిలో ఒక మూల సొరంగం కనిపించింది. వాళ్ళు ఆ సొరంగం ఎక్కడికి వెళ్తుందా అని దాన్లో ప్రయాణం చేయగా వాళ్ళు తంత్రలోహనుడు ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళ ఎదురింట్లో తేలారు. వెంటనే వాళ్ళకి జరిగిందంతా అర్ధమైంది. ఇప్పుడు రచ్చచేస్తే తము మోసపోయిన విధానాన్ని తెలుసుకుని జనాలు నవ్వుతారు అనుకుని వాళ్ళు మారు మాట్లాడలేదు.

తంత్రలోహనుడు గండబేరుండ పక్షులు అతన్ని తీసుకెళ్తాను అనగనే అతనేమి వెంటనే వెళ్ళిపోలేదు. తన గుర్రాన్ని తీసుకెళ్ళి దగ్గరలోని ఊరిలో ఒకళ్ళకి డబ్బులిచ్చి తన గుర్రం బాద్యత అప్పగించి వాచ్చాడు. ఇప్పుడు హాసినీని ఆ ఊరిలోని గుర్రం తీసుకొచ్చి ఆమెని దాని మీద తీసుకెళ్ళాడు. అలా వాళ్ళు గుడి దగ్గరకి వెళ్ళారు.

తంత్రలోహనుడు “ఓ లలనామణీ! ఈ గుడిలో ఉత్తరదిశలో నీ బొమ్మ ఉంటుంది. అక్కడ నా స్నేహితుడు పిచ్చివాడిలాగా బ్రతిమాలుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఆ బొమ్మ పక్కన నించోని అతని మెడలో ఈ పూల మాలని వెయ్యి. కానీ అతను నా గురించి అడిగితే మాత్రం నేను చనిపోయానని చెప్పు. ఎందుకంటే నేను అతని మీద ప్రేమతో ఇంత శ్రమ తీసుకుని నిన్ను తీసుకొచ్చాను. అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవాలి” అని చెప్పాడు.

ఆమె సరే నని లోపలికి వెళ్ళింది. ఆమె తంత్రలోహనుడు చెప్పినట్టుగానే చేసింది. కానీ తంత్రలోహనుడు చనిపోయాడని తెలుసుకోగానే మదనమోహనుడు ఒరలోంచి బాకు తీసి ఆత్మహత్యచేసుకున్నాడు. అది చూసి ‘అయ్యో నేను వరించిన వ్యక్తి చనిపోయాడు. ఇతని కోసం నేను నా సర్వస్వాన్ని త్యాగం చేసుకుని వాచ్చాను. నా కిప్పుడు దారేది’ అని ఆలోచించి హాసినీ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకపోయేసరికి తంత్రలోహనుడు గుడిలోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ‘అయ్యో! ఇదంతా నా వల్లే కదా’ అని యోచించి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి వాళ్ళందరూ అక్కడ చనిపోయి ఉండడం చూసి మనసు విరిగి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భక్తులు అది చూసి దేవుడి దగ్గరకి వెళ్ళి “దేవుడా! నీ గుడిలో నలుగురు చనిపోయి ఉంటే కూడా కదలక మెదలకా ఉంటావా? వాళ్ళని బ్రతికించనన్నా బ్రతికించు లేదా మా ప్రాణాలను కూడా అర్పిస్తాము” అంటూ దేవుణ్ణి ప్రార్ధించారు. దానితో దేవుడు నలుగురినీ బ్రతికించాడు” అంటూ తెరగుడ్డ కధ పూర్తి చేసి....

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

25, జనవరి 2009, ఆదివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 5

(నిన్నటి కధ తరువాయి భాగం)


గుడిలోకి వెళ్ళిన తంత్రలోహనుడు వెతకగా ఉత్తరదిశలో ఉన్న అమ్మాయి బొమ్మ దగ్గర మదనమోహనుడి ప్రలాపాలను చూసాడు.


మదనమోహనుడికి ఎంత చెప్పినా కూడా, ఆ విగ్రహన్ని, ‘నిజం అమ్మాయేననినమ్ముతున్నాడే గానీ బొమ్మ అని నమ్మటం లేదు.


చివరికి తంత్రలోహనుడికి విసుగు పుట్టింది. సరే అనుకుని ఆ గుడి పూజారి దగ్గరకెళ్ళి, "అయ్యా! అక్కడున్న ఆ విగ్రహంని ఎవరు చెక్కారు? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?" అని అడిగాడు.


పూజారి నాయనా! ఇక్కడికి 10 ఆమడల దూరాన సంగమేశ్వరీ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కోదండుడనే శిల్పాచారి ఉన్నాడు. అతను సంవత్సరం కొకసారి ఈ గుడికి వచ్చి పూజలు చేసి వెళ్తుంటాడు. అతనే ఆ శిల్పాన్ని చెక్కాడు అని చెప్పాడు.


"స్వామీ! నేను తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకూ నా మిత్రుడి అవసరాలు మీరే చూడాలి అని చెప్తూ తన మెడలోని నవరత్న ఖచితమైన మాలికని తీసి అతని చేతికిచ్చాడు.


తంత్రలోహనుడు కోదండుడి దగ్గరకెళ్ళి శిల్పాచార్యా! మందాకినీ పురం పరిసరాలలోని అడవిలోని గుడిలో ఒక అందమీన అమ్మాయి శిల్పాన్ని మీరు చెక్కారట. ఆ శిల్పాన్ని ఏ అమ్మాయిని చూసి చెక్కారు?" అని అడిగాడు.


"మానవోత్తమా! ఒక నెల క్రితం సూర్యాస్తమయం అయ్యాక ఒక కుమ్మరి నా దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఒక వజ్రం ఉంది. నిజానికీ ఆ వజ్రం ఇంద్రధనస్సులోని అన్ని రంగులనూ వెదజల్లుతూ చాలా అద్భుతంగా ఉంది. నేను నా కూతురి మెడలోని గొలుసు ఆ కుమ్మరికి ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకున్నాను. కానీ తెల్లారాక చూస్తే అది వజ్రం కాదు, గోరు. ఇంకేం చేస్తాను, శిల్పశాస్త్రం ప్రకారం ఆ గోరును చూసి మనిషిని ఊహించి వేసే అపూర్వ విద్య నాకు తెలుసు. ఆ విద్యప్రకారం ఆ శిల్పం చెక్కాను అని చెప్పాడు.


తంత్రలోహనుడు కుమ్మరి వాడి చిరునామా కనుక్కుని, కుమ్మరి వాడిని కలిసాడు. అయ్యా! మీరు కోదండుడు అనే శిల్పికి ఒక గోరును వజ్రం అని చెప్పి అమ్మారట కదా! ఆ గోరు మీకు ఎక్కడిది?” అని అడిగాడు.


ఆ ప్రశ్నకు కుమ్మరి వాడు అయ్యా! అది ఎంత భాదాకర సంఘటనో మీకు తెలియదు. అడవిలోంచి ఎవరో ఒక వేటగాడు వచ్చాడు. ఆ రాత్రి వేళ, నేను ఎలాగైతే శిల్పాచార్యుణ్ణి మోసం చేసానో అదే విధంగా వాడు ఆనాడు నన్ను మోసం చేసి, నాకు ఆ గోరుని అంటగట్టాడు. నా కూతురికి చక్కని గొలుసు చేయించి అందులో వజ్రాన్ని పొదుగించుకుందాం అనుకుని. నేను వాడి దగ్గర ఆ గోరుని తీసుకుని ఎన్నో కుండలు, పిడతలు ఇంకా ఏవేవో వస్తువులు ఇచ్చాను. మర్నాడు చూస్తే అది మామూలు గోరు. ఇంక ఏం చేయాలో పాలుపోక వాడు నన్ను ఎలా మోసం చేసాడో నేనూ అదే విధంగా శిల్పాచారిని మోసం చేసాను. కాకపోతే ఆయనకి నేను ఏ ఊరి నుండి ఆయన దగ్గరకు వచ్చానో తెలుసుగానీ నా ఇల్లేదో నేను చెప్పలేదు. మీకు ఎలా తెసింది?” అని అడిగాడు.


తంత్రలోహనుడు బాబూ! ఆయన నాకు మీ ఊరి పేరు మాత్రమే చెప్పారు. నేను అతికష్టం మీద వాకబు చేసి మీ చిరునామా తెలుసుకున్నాను అని చెప్పాడు.


తరవాత వేటగాడి గురించి వాకబు చేసి తంత్రలోహనుడు అతన్ని కలిసాడు. వేటగాడా! కుమ్మరి వాడికి నీవు ఒక గోరును వజ్రం అని అభద్ధం చెప్పి అమ్మావు. ఆ గోరు నీకు ఎక్కడిది?” అని అడిగాడు.


"అయ్యా! నేను కొన్నాళ్ళ క్రితం అడవిలోకి వేటకి వెళ్ళాను. కానీ ఒక్క జంతువూ దొరకలేదు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఒక చెట్టు క్రింద విశ్రమించాను. అలా నిద్రపోయిన నాకు మెలుకువ వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది. చూస్తే నా కంటి ఎదురుగా ఒక ప్రజ్వులితమైన వజ్రం కనిపించింది. ఆ వజ్రాన్ని నా యింటికి తీసుకెళ్ళాను. కానీ తెల్లారాక చూస్తే అది ఒక మామూలు గోరు. నేను ఆ గోరుని మోసం చేసి కుమ్మరి వాడికి అమ్మాను అని తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు.


కానీ ఇప్పుడు తంత్రలోహనుడికి కావలసింది వాడు తప్పు ఒప్పుకోవటం కాదు కనుక, ఆ విషయాన్ని పక్కన పెట్టి అతనికి గోరు దొరికిన చెట్టు దగ్గరికి వెళ్ళి విశ్రమించాడు. అప్పటి దాకా ఎవరినో ఒకరిని ఆ గోరు గురించి అడిగి తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అడగడానికి ఎవరూ లేరు కదా! అందుకని దిగాలుగా కూర్చున్నాడు. ఐతే ఆ చెట్టు మీద ఒక చిలుకల గుంపు నివసిస్తుంది. ఆ గుంపుకి ఒక రాజు కూడా ఉన్నాడు. మొత్తం 1000 చిలుకలకి రాజు ఐన సురేంద్రుడు తంత్రలోహనుడిని చూసి మానవేంద్రా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు? అసలు ఇంత రాత్రి ఇక్కడ ఎందుకున్నావు? ఈ అడవిలో ఎన్నో కౄర మృగాలుంటాయి. కనుక నీవు వాటి కంట పడకముందే ఇక్కడి నుండి దగ్గరలో ఉన్న ఏదైనా పట్టణానికి వెళ్ళిపో అని చెప్పింది.


తంత్రలోహనుడు తను ఎందుకు అక్కడికి వచ్చింది, అసలు మొత్తం ఏం జరిగిందీ అంతా చెప్పాడు.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

23, జనవరి 2009, శుక్రవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 4

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు `కధలు మాత్రమే ఈ పలుకని పడంతిని మాట్లాడించగలవు’ అనుకున్నాడు. వెంటనే పలుకని పడంతికీ తనకీ మధ్యలో అడ్డంగా ఉన్న తెరగుడ్డని, "ఓ తెరగుడ్డా! పలుకని పడంతి ఒక్కమాటైనా మాట్లాడటం లేదు. నాకా నిద్ర రావడం లేదు. రాత్రా పొద్దుపోవటం లేదు. దీపాలా బాగా వెలుగుతున్నాయి. కనీసం నువ్వన్నా పొద్దుపోవటానికి ఏదైనా కధ చెప్పవా!” అన్నాడు.

విక్రమార్కుడు ఇలా అనగానే, బెతాళుడు తెరగుడ్డలో ప్రవేశించి, "ఓ రాజశ్రేష్ఠా! మీరు నన్ను కధ చెప్పమంటున్నారు. మీకు ఏ కధ చెప్పను. నేను పడ్డపాట్ల కధ చెప్పనా? నేను విన్న కధ చెప్పనా? ఏ కధ చెప్పను?" అని అడిగాడు.

విక్రమార్కుడు “తెరగుడ్డా! ఈ రెండు కధలూ, ఒక దాని తరవాత ఒకటి చెప్పు” అన్నాడు.

అప్పుడు తెరగుడ్డ “సరే, వినండి స్వామి! నేను మొదట విత్తనంగా ఉన్నాను. నన్ను రైతులు పొలంలో నాటగా మొలకగా మొలకెత్తాను. చక్కగా ఆకులతో పెరిగి కాయలు కాసాయి. అందరూ నన్ను పత్తి అన్నారు. నాకు కాసిన కాయలు పండి ఎండి పగిలాక, వాటినుంచి దూది తీసారు. ఆ దూదిని రైతు ఆడవారికి అమ్మాడు. వాళ్ళు నన్నెత్తుకుపోయి కొట్టి నూలుపేడారు. ఆ నూలును ఒక సాలెవాడు తీసుకొనిపోయి, సాగతీసి గంజివేసి తడిలో పెట్టి గుడ్డచేసాడు. ఆ గుడ్డని ఒక వ్యాపారి అంగడిలో ఉంచాడు. ఆ గుడ్డని వీళ్ళు తీసుకువచ్చి కుట్టేవాడికిచ్చారు. వాడు నన్ను చింపి ఈ రూపంలో కుట్టాడు. వీళ్ళేమో నాకు గాలి ఆడకుండా ఇలా కట్టేశారు. ఇన్ని బాధలు పడుతూ నేను కధ ఎలా చెప్తాను” అని ఊరుకుంది.

తెరగుడ్డలోపల బెతాళుడు ప్రవేశించి మాట్లాడుతున్నాడు అని తెలియదు కనుక పలుకని పడంతి ఎంతో ఆశ్చర్యపోయింది. ఆమెకు కొంచెం కుతూహలంగా కూడా అనిపించింది. ‘అసలు ఈ తెరగుడ్డ ఎం కధ చెపుతుందో విందాం’ అనుకుని, పనివాళ్ళకి తెరగుడ్డను తీసేయమని సైగ చేసింది. వాళ్ళు తెరగుడ్డ తీసేసి విక్రమార్కుడికీ పలుకని పడంతికీ మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయారు.

విక్రమార్కుడు “ఊ! ఇప్పుడు చెప్పు!” అన్నాడు. తెరగుడ్డ కధ ఇలా మొదలు పెట్టింది.

తెరగుడ్డ చెప్పిన కధ……..

మదనమోహన తంత్రలోహన సంగీత సాహిత్య సరసోల్లాస హాసిని కధ

"రాజేంద్రా! సావధానంగా విను. మందార పురం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని మన్మధ జీవకరుండనే రాజు ఏలేవాడు. అతనికి మంగళకరుడు అనే ప్రతిభాశాలి అయిన మంత్రి ఉండేవాడు. రాజుకూ, మంత్రికీ చెరొక్క కొడుకూ పుట్టారు. రాజు కొడుకుకు మదనమోహనుడనీ, మంత్రి కొడుకుకు తంత్రలోహనుడనీ పేర్లు పెట్టారు. మదనమోహనుడూ, తంత్రలోహనుడూ ఎప్పుడూ ఒకరినొకరు వదలకుండా కన్ను, రెప్పలలాగా కలిసే ఉండేవారు.

ఒకసారి వాళ్ళు అడవిలోకి వేటకి వెళ్ళారు. జంతువులను వేటాడుతూ అడవిలోపలికి ఎక్కడికో వెళ్ళారు. దాహంతో వెతకగా వెతకగా వాళ్ళకొక నీటి మడుగు కనిపించింది. ఆ మడుగు పక్కన ఒక పెద్ద మర్రిచెట్టు, ఒక గుడి ఉన్నాయి. ఇద్దరూ మడుగులో నీళ్ళు తాగి చెట్టునీడన విశ్రాంతి తీసుకుంటుండగా మదనమోహనుడికి నిద్రవచ్చి నిద్రపోయాడు. తంత్రలోహనుడు ‘సరే గుడి చూసొద్దాం అనుకుని’ గుడిలోకి వెళ్ళాడు. గుడిలోని శిల్పాలను చూస్తూ ఉండగా గుడిలో ఉత్తరం దిక్కున ఒక అందమైన అమ్మాయిది నిలువెత్తు విగ్రహం ఉంది. ఆ అమ్మాయి చేతిలో పూలదండ పట్టుకుని ఉంది. తంత్రలోహనుడు ఒక క్షణం నిజం బొమ్మ ఏమో అనుకున్నాడు కానీ కదలకుండా ఉండడంతో బొమ్మ అని అర్ధం చేసుకున్నాడు.

మదనమోహనుడుగానీ ఈ బొమ్మని చూసాడంటే ‘అమ్మో చాలా అపాయకరం అనుకుని’ దేవుడి దర్శనం చేసుకుని మదనమోహనుడి దగ్గరికి వెళ్ళాడు.

"గుడి చూద్దాం రా మిత్రమా” అన్నాడు మదనమోహనుడు.

"నేను ఇప్పుడే వెళ్ళి వచ్చాను. నువ్వు వెళ్ళు కానీ ఉత్తరం వైపుకి మాత్రం వెళ్ళకు” అని చెప్పాడు తంత్రలోహనుడు. సరేనని చెప్పి గుడిలోకి వెళ్ళాడు మదనమోహనుడు. గుడి అంతా చూసాడు చివరగా ఇంక వెళ్దాం అనుకుంటుండగా అతనికి కుతూహలంగా అనిపించింది ‘అసలు ఎందుకు తంత్రలోహనుడు ఉత్తరం వైపు వెళ్ళద్దన్నాడా!’ అని. వెంటనే ఉత్తరం పైపుకి వెళ్ళాడు. అక్కడ ఉన్న అమ్మాయి విగ్రహం చూడగానే అతను ‘అబ్బా! ఎంతటి సౌందర్యం’ అనుకుంటూ, ఆ విగ్రహం నిజంగా అమ్మాయి అనుకుని అక్కడే కూర్చుని “ఆ పూలదండ నా మెళ్ళో వెయ్యి. ఓ సుందరీ! ఆ పూలదండ నా మెళ్ళో వేసి, నన్ను వరించు” అంటూ బ్రతిమాలుతున్నాడు.

ఎంతసేపు అయినా కూడా మదనమోహనుడు రాకపోయేశరికి తంత్రలోహనుడు గుడిలోకి వెళ్ళాడు. [ఇది మదనకామరాజు సినిమాలోని సాదా సీదా కధ కాదు.]

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

21, జనవరి 2009, బుధవారం

పలుకని పడంతి (విక్రమాదిత్యడి కధ) - 3

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు దీపాలనాగిని నిశితంగా పరిశీలించాడు. దీపాలనాగి అంత గొప్ప అందాలరాశి కాదు. అప్పుడు విక్రమార్కుడికి అనుమానం వచ్చింది. ‘పలుకని పడంతి కోసం రాజులూ, మహారాజులూ కూడా వరించాలని ప్రయత్నించి, అవమానపడ్డారని’ అవ్వ చెప్పింది. ఆమె చెప్పింది నిజం ఐతే ఈమె అపురూప సౌదర్యరాశి అయ్యుండాలి. కానీ అలాగ కనిపించటం లేదు ఈ వచ్చిన అమ్మాయి. దానికి తోడు ఈమె దీపాల పట్ల చూపిస్తున్న శ్రద్ధని గమనిస్తుంటే (అంటే అమృతమోహినితోపాటు ఆ గదిలోకి వచ్చినప్పుడు దీపాలనాగి చేతిలో ఒక పళ్ళెం పట్టుకుని అందులో దీపాలు పెట్టుకుని. వయ్యారంగా వచ్చింది.) ఈమె ఏ దీపలనాగో ఇంకెవరో ఇంకెవరో లాగా ఉందే? కానీ ఎలా తెలుసుకోవడం?’ అని విక్రమార్కుడు ఆలోచించాడు.

విక్రమార్కుడికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే బెతాళుడికి తను ఏం చేయాల్సి ఉంటుందో అర్ధం అయిపొయింది. కానీ విక్రమార్కుడు భట్టికి తన ఆలోచనని ఇలా వివరించాడు. “తమ్ముడూ! బెతాళుడు ఇప్పుడు గాలి ఊదుతాడు. దాంతో దీపాలు కొండెక్కుతాయి. దీపాలు రెపరెపలాడగానే వత్తి సరిచేయడానికి ఆమె వేలిని నూనెలో పెట్టి వత్తిని సరిచేస్తుంది. అలా సరి చేసాక ఆమె వేలికి అంటిన నూనెని వేరే గుడ్డతో తుడుచుంకుందంటే ఆమె పలుకని పడంతి అని అర్ధం. లేక జుట్టుకి తుడుచుకుందంటే ఆమె దీపాలనాగి అని అర్ధం. ఎందుకంటే యజమానురాలైతే ఇంత డబ్బుండీ మరీ అంత తలకు మాసిన అలవాట్లు ఉండవు జుట్టుకి నూనెని పూసుకోవడానికి. కనుక ఈ పని ద్వారా మనకి అర్ధం అవుతుంది ఈ వచ్చిన ఆమె ఎవరో” అన్నాడు.

బెతాళుడు అలాగే దీపాలను గాలి ఊది కొండెక్కించాడు. వెంటనే దీపాలనాగి వేలితో దీపపువత్తిని పైకి అని, ఆ నూనెని తలకి రాసుకుంది. అంతే, విక్రమార్కుడు వెంటనే “ఒహో! మీరందరూ కలిసి నన్ను మోసపుచ్చాలను కుంటున్నారా? ఓసీ దీపాలనాగీ! నీ యజమానురాలు గనకా వస్తే ఆమె కాళ్ళు అరిగిపోతాయా, లేక అందం కరిగి పోతుందా? నువ్వు వెళ్ళి ఆమెని రమ్మను” అన్నాడు.

అమృతమోహిని తమ పధకం పారనందుకు బాధగా, దీపాలనాగిని లోపలికి తీసుకెళ్ళి ఈ సారి ఇలాకాదు అనుకుని, వంటల రంగమ్మను అచ్చం తన కూతురిలా అలంకరించి తీసుకెళ్ళింది.

ఈ లోపల విక్రమార్కుడికీ, భట్టికీ అతిధి సత్కారాలు చేయాలి కదా! అందుకని ఇద్దరికీ చక్కని విందు వడ్డించారు. వంటల రంగమ్మరాగానే విక్రమార్కుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఈమె మరీ అంత అందంగా ఏమీ కనిపించడం లేదు ఖచ్చితంగా ఈమె పలుకని పడంతి కాదు. సరే! పరిక్షించి చూద్దాం అనుకుని “ఓ పలుకని పడంతి! నీ కోసం ఎంతో కష్టమైనా ఇన్ని ప్రాకారాలూ దాటుకుని వచ్చాను. నా కోసం నీ అమృత తుల్యమైన చెయ్యితో వడ్డించవా!" అన్నాడు.

వంటల రంగమ్మ విందు వడ్డించుతుండగా, నెయ్యి గిన్నెని విక్రమార్కుడు పొరపాటున దొర్లించినట్టు దొర్లించాడు. వంటల రంగమ్మ క్రింద పడ్డ నెయ్యినే మళ్ళీ గిన్నెలోకి తీసింది. వెంటనే విక్రమార్కుడికి అర్ధం అయ్యింది ‘ఈమె ఎవరో వంటల రంగమ్మ. పలుకని పడంతి అయ్యి ఉండుంటే ఖచ్చితంగా కొత్త నెయ్యి తెప్పిస్తుంది గానీ, ఇలా క్రింద పడ్డది తీయదు’ అని. వెంటనే
"ఓ వంటల రంగమ్మా! నీవు వెళ్ళి నీ యజమానురాలిని పిలుచుకురా! నేను వచ్చింది ఆమెని వివాహ మాడటానికి కానీ నిన్నుకాదు” అన్నాడు.

ఇంక ఏమీ చేయలేక వంటల రంగమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అమృతమోహిని లోపలికెళ్ళి, పలుకని పడంతితో “ఇక తప్పేట్టు లేదు తల్లీ! ఇత నెవరో అసాద్యుడు లాగా ఉన్నాడు. నువ్వు రాక తప్పేట్టు లేదు. కానీ ఏదేమైనా నువ్వు మాత్రం ఎట్టి పరిస్తుతుల్లో మాట్లాడకు” అని చెప్పింది. పలుకని పడంతి సరే అంది.

అమృతమోహిని విక్రమార్కుడి దగ్గరకొచ్చి “రాజాధిరాజా! వినండి. నేను నా కూతురిని తీసుకొస్తున్నాను కానీ ఆమెకీ మీకూ మధ్య ఒక అడ్డు తెర కట్టి ఉంటుంది. మీరు తెల్లవారేలోపల ఆమెని మూడు సార్లు మాట్లాడించాల్సి ఉంటుంది” అని చెప్పింది.

విక్రమార్కుడికి, పలుకని పడంతికీ కూర్చోడానికి మంచాలు వేసి మద్యలో ఒక తెరగుడ్డ కట్టారు. పలుకని పడంతి విక్రమార్కుడి ముందునుంచే వెళ్ళి తెరగుడ్డకి అవతలి వైపున కూర్చుంది. ఆమె అందాన్ని చూసాక విక్రమార్కుడికి అనిపించింది ‘ఖచ్చితంగా ఈమే పలుకని పడంతి. ఈ సారి ఎలాంటి మోసాలూ చేయలేదు’ అని.

విక్రమార్కుడు “ఓ లావణ్యవతి! నీ కోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. నీ మధురామృత పలుకులను వినాలని కోరుకుంటున్నాను” అన్నాడు. కానీ పలుకని పడంతి మౌనముద్ర వేసుకుని మాట్లాడకుండా కూర్చుంది.

ఈమెని మాట్లాడించాలంటే ఇలా కాదు. ‘దానికి ఒక్కటే దారి, రహదారి’ అనుకున్నాడు, అనుకుంటా విక్రమార్కుడు ఒక చక్కని పధకం రచించాడు (బుర్రలోనే లేండి). మరి విక్రమార్కుడు తనకు చెప్పబోయే పనిని కూడా, చెప్పించుకోకుండానే అర్ధం చేసుకోగల బెతాళుడు సంసిధ్ధుడైపోయాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

20, జనవరి 2009, మంగళవారం

పలుకని పడంతి (విక్రమాదిత్యడి కధ) - 2

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు పందెం కాశాక వాకబు చేయగా పలుకని పడంతి భవనం దగ్గర మొదటి ప్రాకారంలో పనిచేసే కరణాలలో ఒకడు చాలా చెడ్డవాడు అని తెలుసుకున్నాడు.

ఆ రోజు రాత్రి విక్రమార్కుడు, భట్టి కలిసి పలుకని పడంతి భవనం దగ్గరకెళ్ళారు. మొదటి ప్రాకారంలోకి ప్రవేశించడానికి 1000 హొన్నులిచ్చి విక్రమార్కుడు, భట్టి లోపలికి ప్రవేశించారు. వెంటనే ఇద్దరు కరణాలు విక్రమార్కుడికి భోజనం వడ్డించారు. మరి విక్రమార్కుడు మాత్రమే పలుకని పడంతిని ఓడించడానికి వచ్చింది. భట్టి తోడు వచ్చాడు అంతే. ఎటువంటి మాటసాయం కూడా భట్టి చేయడు కనుక వాళ్ళు భట్టికి భోజనం పెట్టలేదు.

విక్రమార్కుడు ఆ భోజనంలోని ఉడికిన అన్నాన్ని తను తిన్నాడు. ఉడకని అన్నాన్ని ఒక కండువాలో వేసుకున్నాడు. అలాగే ఒలిచిన పండు తిన్నాడు. ఒలవని పండు కండువాలో వేసుకున్నాడు. ప్రతి ఒక్కటీ కూడా అలాగే కండువాలో వేసుకున్నాడు.

విక్రమార్కుడు భోజనం అయిపోగానే కరణం వాడితో స్నేహం చేసుకున్నాడు. ముగ్గురూ కలిసే రెండో ప్రాకారంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే విక్రమార్కుడు కరణం వాడిని మర బొమ్మల చేతికి అప్పగించాడు. రెండు నిముషాలలో మూడు బొమ్మలూ కలిసి వాడికి గుండు గీసినయ్. వాడు విక్రమార్కుడితో గొడవ పడ్డాడు. చెవిదగ్గర జోరీగలాగా వాడు నసపెట్టేటప్పటికి ఇక ఇలా కాదులే అనుకుని, విక్రమార్కుడు మూడో ప్రాకారంలోని మల్లయొధులకి కరణం వాడిని అప్పగించాడు. అలా మల్లయోధులు వీళ్ళ జోలికి రాలేదు కనుక భట్టి, విక్రమార్కుడు ఇద్దరూ నాలుగో ప్రాకారంలోకి ప్రవేశించాడు. అక్కడ నల్లకోతి ఉంది. విక్రమార్కుడు మొదటి ప్రాకారంలో మూటకట్టిన అన్నాన్ని దాని ముందు ఉంచాడు. కానీ ఆ కోతి అన్నాన్ని గమనించనట్టుగా కదలక మెదలక ఉంది. జాగ్రత్తగా దానిని గమనించాక వాళ్ళకు అర్ధమైంది ఆ కోతి నిజం కోతి కాదు, బొమ్మ అని. వెంటనే చప్పుడు చేయకుండా ఆ కోతి దగ్గరకెళ్ళి దాన్ని విరగ్గొట్టేశాడు విక్రమార్కుడు. తరవాత అయిదవ ప్రాకారంలో కూడా ఇలాగే పులి ముందల ఉదకని కూరని పెట్టాడు. ఆ పులి కూడా కూరని ముట్టుకోలేదు. వెంటనే పులి రూపంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా విరగ్గోట్టేశాడు. తరవాత ఆరవ ప్రాకారంలోని ఏనుగును కూడా అంతే. దానికి ఒలవని పండు పెట్టారు. ఆ ఏనుగు పండును తినలేదు. అది యంత్రం అని అర్ధం చేసుకొని విరగ్గొట్టేశాడు. ఇక ఏడవ ప్రాకారంలో ఒక బావి అడ్డంగా ఉంది. ఆ బావిని దాటి ఎటూ వెళ్ళడానికి లేదు. విక్రమార్కుడు చుట్టూ చూసాడు. ఒక పెద్ద రాయి కనబడింది. బాగా ఆలోచించి చివరికి ఆ పెద్దరాయిని తీసుకొని బావిలో వేశాడు. అంతే, బావిమీద రెండు పలకలు వచ్చి మూసుకున్నాయి. విక్రమార్కుడు, భట్టి ఆ పలకల మీద నడుచుకుంటూ అవతల పక్కకి వెళ్ళి పోయారు. తరవాతటి ఎనిమిదవ ప్రాకారంలో బురద మడుగు ఉంది. ఆ మడుగుని చూస్తూ భట్టి,
"అన్నా! నువ్వు పలుకని పడంతిని వరించాలి అనుకుంటున్నావు, కనుక నువ్వు బురదలో నడుచుకుంటూ రావాలి. నేను మాత్రం బెతాళుడి మీద అవతలకి వెళ్ళిపోతున్నాను” అని చెప్పి, విక్రమార్కుడి అనుమతితో బెతాళుడి మీద ఎక్కి మడుగుకు అవతలి వైపుకి వెళ్ళాడు.

తరవాత విక్రమార్కుడు బురదలో నడుచుకుంటూ అవతల వైపుకి వెళ్ళాడు. అక్కడ నత్తగుల్లలో నీళ్ళున్నాయి. విక్రమార్కుడు బాగా ఆలోచించి, కొంచెం గట్టిగా ఉన్న తాటి ఆకుతో కాళ్ళకి అంటుకున్న బురదనంతా గీకేశాడు. తరవాత ఒక రుమాలుని నత్తగుల్లలోని నీళ్ళతో కొంచెం తడిపి ఇంకా నత్తగుల్లలో సగం నీళ్ళు మిగిలేలాగా చూసుకున్నాడు. ఆ తడిపిన రుమాలుతో కాళ్ళని శుబ్రంగా తుడిచాడు. ఇప్పుడు విక్రమార్కుడి కాళ్ళు శుబ్రంగా, అచ్చం కడుక్కున్న కాళ్ళలాగా మెరిసిపోతున్నాయి.

తరవాతటి తొమ్మిదవ ప్రాకారంలో స్పటిక మండపం ఉంది. విక్రమార్కుడు తనతోపాటూ చెచ్చుకున్న కొవ్వొత్తులని కరిగించి, ఆ మండపంలో తను వెళ్ళాల్సిన దారి మొత్తం ఆ మైనాన్ని పోస్తూ దాని మీద నడవసాగాడు. అప్పుడు కొవ్వొత్తి పడ్డచోటు వరకూ గరుకుగా ఉండటం వల్ల క్రింద పడరు కదా! విక్రమార్కుడి వెనకే భట్టి కూడా మైనం మీద నడుస్తూ అన్నగారిని అనుసరించాడు.

తరవాతటి ప్రాకారంలో చిమ్మచీకట్లు కమ్మిన 1000 స్తంబాల మండపం ఉంది. విక్రమార్కుడు భట్టితో,
"తమ్ముడూ! బెతాళుడు భ్రమర రూపంలోకి మారి నిన్ను తన వీపు మీద ఎక్కించుకుని సరైన దారిలో వెళతాడు. నేను ఆ భ్రమర శబ్ధాన్ని బట్టీ మీ వెనకే వస్తాను” అని చెప్పాడు.

వెంటనే బేతాళుడు భ్రమర రూపంలోకి మారాడు. భట్టి బెతాళుడి మీద బయలుదేరాడు. శబ్ధాన్ని బట్టీ విక్రమాదిత్యుడు వాళ్ళని అనుసరించాడు. అలా వాళ్ళు ఆ మండపంలోంచి బయటికి వచ్చారు.

తరవాత పలుకని పడంతి భవనం వచ్చింది. మొదటి గదిలోకి వెళ్ళిన విక్రమార్కుడు. మంచాన్ని ఒక క్షణం జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ మంచం రెండు వైపులా ఒకేలాగా ఉంది. ఎక్కడా ఎటువైపు పైన, ఎటుపైపు క్రింద అన్నది కనిపెట్టడానికి అవకాశం లేదు. విక్రమార్కుడు ఒక నిమ్మకాయ తీసుకుని మంచానికి సరిగ్గా మద్యలో ఆ నిమ్మకాయని పెట్టాడు. నిమ్మకాయ ఒక వైపుకు దొర్లేసింది. మామూలుగా ఎక్కడైనా సరే మంచానికి కాళ్ళకట్టన కొంచెం క్రిందకూ, తలవైపున కొంచెం ఎత్తుగానూ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయ దొర్లిన వైపు ఖచ్చితంగా కాళ్ళకట్టనే అనుకుని, అటు వైపు కాళ్ళు, దానికి వ్యతిరేకదిశలో తల పెట్టి పడుకున్నాడు విక్రమార్కుడు.

వెంటనే 10 మర బొమ్మలు ప్రత్యక్షం అయ్యి సపర్యలు చేస్తూ మరిపించె ప్రయత్నం చేసాయి. కానీ వాటిని పట్టించుకోకుండా విక్రమార్కుడు ముందలికి వెళ్ళిపోయాడు.

ఇవన్నీ ముందలే తెలుసుకుంటూ ఉన్న పలుకని పడంతి, అమృతమోహిని చివరికి విక్రమార్కుడు ఈ మంచం విషయంలో కూడా నెగ్గాడు అనగానే “అయ్యో! మనము ఇన్నాళ్ళు ఆడిన ఆటలన్నీ ఇంక ఈ రోజు కట్టిపెట్టాల్సి వస్తుందో ఏం పాడో” అని తెగ బాధ పడ్డారు.

ఎంత బాధ పడ్డాకూడా అమృతమోహిని నవ్వుతూ విక్రమార్కుడిని ఆహ్వానించింది “విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి వస్తుంది” అని చెప్పి పలుకని పడంతి దెగ్గరకెళ్ళి “అమ్మాయీ! నువ్వు ఒక పని చేయి! దీపాలు వెలిగించే పని మనింట్లో చేసే దీపాలనాగికి అచ్చు నీలాగా అలంకరించు. వీలైనంత అందంగా అలంకరించు, దీపాలనాగినే వాళ్ళ ముందుకు పంపించి ఈమే పలుకని పడంతి అని చెప్తాను” అని చెప్పింది.

దీపాలనాగిని పలుకని పడంతి లాగే అలంకరించి అమృతమోహిని “ఈమే నా కూతురు పలుకని పడంతి” అని పరిచయం చేసింది.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)