2, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 9

(నిన్నటి కధ తరువాయి భాగం)

అప్పుడు చీర కొంగు “ఓ రాజా! ఇప్పుడు నా ప్రాణం నా బొందిలో సరిగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు కధ చెప్పగలను. వినండి.

నలుగురు దొంగల కధ

కుంతల నగరం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని గోపాలవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి గోలాహలుండు అనే మంత్రి ఉన్నాడు.

కుంతల నగరానికి రెండామడల దూరంలో మాతంగ పురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కార్తికేయుడు అనే ఒక పెద్ద గజదొంగ ఉండేవాడు. అతనికి నలుగురు కొడుకులు. మొదటివాడి పేరు నిండు దొంగ, రెండోవాడి పేరు ముప్పావు దొంగ, మూడోవాడి పేరు అర్ధ దొంగ, నాలుగోవాడి పేరు పావు దొంగ.

ఒక రోజు కార్తికేయుడు కొడుకులను పిలిచి “చూడండి నాన్నా! మీ అందరికీ నేను చోర విద్య నేర్పాను. ఇప్పుడు మిమ్మల్ని పరిక్షించాలి అనుకుంటున్నాను. నాయనా! పావు దొంగా! మన ఊరికి రెండు ఆమడల దూరంలో కుంతల నగరం అనే ఊరు ఉంది. రేపు తెల్లవారే లోపల ఆ ఊరిలో ఏదైనా దొంగిలించి తీసుకురావాలి. చూద్దాం నీ దగ్గర ఎంత సామర్ధ్యం ఉందో!” అన్నాడు కార్తికేయుడు.

తండ్రి దగ్గర సెలవుతీసుకొని కుంతల నగరానికి వచ్చాడు పావు దొంగ.

పావు దొంగ ఒక మంగలి కొట్టుకి వెళ్ళాడు. అప్పటికే మంగలివాడు వేరే అతనికి క్షౌరం చేస్తున్నాడు. పావుదొంగ అతనితో “మంగలీ! నాకు ముందర క్షౌరం చేయి. నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది. కావాలంటే అందరూ నీకు క్షౌరం చేసినందుకు ఇచ్చే డబ్బుకు రెట్టింపు ఇస్తాను” అని చెప్పాడు.

మంగలివాడు అప్పుడు తను క్షౌరం చేస్తున్నవాడిని బ్రతిమాలి సగంలో ఓ పక్కన కూర్చొపెట్టి పావు దొంగకి క్షౌరం చేసాడు. క్షౌరం అయిపోయాక పావు దొంగ “నా దగ్గర చిల్లర లేదు. నీ దగ్గర ఉందా?" అని అడిగాడు. అతనికి తెలుసు ఉదయాన్నే, అప్పుడే అంగడి తెరిచారు కనుక చిల్లర ఉండే ఆస్కారం లేదని. అయినా అడిగాడు. లేదని క్షురకుడు చెప్పగానే “సరే అయితే నీ కొడుకునో, పనివాడినో ఎవరినో ఒకరిని నా వెంట పంపు. అంగళ్ళ వీధిలో ఎక్కడన్నా చిల్లర మార్చి పంపిస్తాను. నువ్వు వస్తే ఇందాక సగం క్షౌరం చేయించుకున్న అతను గొడవ పెడతాడు” అని అన్నాడు.

మంగలివాడు తన అయిదేళ్ళ తన కొడుకుని పిలిచి పావు దొంగ వెంట పంపాడు. పావు దొంగ ఆ పిల్లవాడ్ని తీసుకుని అంగళ్ళ వీధిలోకి వెళ్ళాడు. అక్కడున్న ఓ ఖరీదైన బట్టల దుకాణంలోకి వెళ్ళి, ఆ అంగడి యజమానిని ఖరీదైన బట్టలు చూపించమని చెప్పాడు. రత్నాలు పొదిగిన చీరలు, బంగారు తీగలతో కుట్టిన పంచలు ఇంకా ఏవేవో ఖరీదైన బట్టలు తీసుకుని

"మా ఇంట్లో వాళ్ళకి చూపించి రావాలి. ఇదుగో వీడు నా కొడుకు. వీణ్ణి నీ దగ్గరే ఉంచి వెళుతున్నాను. ఈ బట్టల్లో వాళ్ళు వద్దన్న బట్టలూ, పైకం తీసుకుని వస్తాను. అప్పుడు నా కొడుకుని తీసుకు పోతాను” అని చెప్పి బట్టలు తీసుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు.

కార్తికేయుడి దగ్గరకెళ్ళి తను చేసిన దొంగ తనం చూపించాడు. కార్తికేయుడు ఎంతగానో మెచ్చుకున్నాడు.

అయితే ఇక్కడ కుంతల నగరంలో ఆ బట్టల అంగడి యజమాని మంగలివాడి కొడుకుని “ఏరా నీ నాన్న ఏడీ? ఎంత సేపటికీ రాడు!” అన్నాడు.

ఆ పిల్లవాడు “మా నాన్న క్షౌరం చేస్తున్నాడు” అని చెప్పాడు. అసలే ‘అంత ఖరీదైన బట్టలు తీసుకెళ్ళిన వాడు ఇంతవరకూ రాలేదే’ అని కంగారుగా ఉన్న అతనికి ఆ సమాధానం వినగానే చిర్రెత్తింది.

"ఏరా పరిహాసాలాడుతున్నావా?" అంటూ కసిరాడు.

అయితే ఇతను కసిరే టప్పటికి భయపడిన ఆ పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.

ఇంతలో ‘తన కొడుకు ఏమయ్యాడా?’ అని అంగళ్ళ వీధికి వచ్చిన మంగలివాడు అతని కొడుకుని చూసి “నా కొడుకుని ఎందుకు నిర్భందించావు? వాడిని వదిలేయి” అన్నాడు.

అయితే బట్టల దుకాణం వాడు “ఏమి, నువ్వు అతను తోడుదొంగలన్నమాట!” అంటూ అతను ఎదురు కొట్లాడాడు.

వీళ్ళు కొట్లాడుకుంటుండగా అటుగా వచ్చిన రాజ భటులు వాళ్ళని రాజుదగ్గరికి తీసుకెళ్ళారు. రాజు అంతా విని విషయం వాకబు చేయగా రాజుగారికి అంతా అర్ధం అయ్యింది. రాజుగారు “వాడిని పట్టుకొంటాము. అయినా ఎవ్వడిని పడితే వాడిని అలా ఎలా నమ్మారూ? మీ బుద్ది తక్కువ తనం” అని ఇద్దరినీ తిట్టి

"ఏయ్ కొత్వాల్! పట్టపగలే ఇలా దొంగతనాలు జరుగుతుంటే నువ్వేమి చేస్తున్నావయ్యా? ఆ దొంగని ఎలా పట్టుకుంటావో నాకు తెలియదు కానీ పట్టుకొని తీరాలి. అర్ధమైందా?" అని చెప్పేసి తన పనిలో తను మునిగిపోయాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

4 కామెంట్‌లు:

శశాంక చెప్పారు...

పోస్ట్ నంబర్ మార్చినట్టు లేరు (9 కదా), ఒకసారి చూడండి :)

Aha!Oho! చెప్పారు...

శశాంక్ అన్నా:

గతంలో ఉన్న నన్ను, వర్తమానంలోకి తీసుకువచ్చినందుకు కృతఙ్ఞతలు.

మధురవాణి చెప్పారు...

బావుంది గీతా కథ.. ముందు భాగాలన్నీ కూడా బాగున్నాయి.
నీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాను నేను రోజూ :)

నేస్తం చెప్పారు...

super chaalaa baagaa raastunnavamma