15, డిసెంబర్ 2008, సోమవారం

రేచుక్క పగటి చుక్క - 4

(నిన్నటి కధ తరువాయి భాగం)

ఆ రోజు రాత్రి కొత్వాల్, మరికొంత మంది సైనికులూ, ‘పగటి చుక్క కానీ, ఏదైనా దొంగతనం చేయటానికి వస్తే పట్టుకుందాం’ అని గస్తీ తెరుగుతున్నారు. అర్ధరాత్రి దాటాక పగటి చుక్క మారువేషం వేసుకుని, కొత్వాల్ ఉన్న చోటికి వచ్చాడు.

కొత్వాల్, ఊరిమధ్యలో ఉన్న గుదిబండ దగ్గర నించుని కాపలా కాస్తున్నాడు. పగటి చుక్కని చూడగానే, మొదట కొత్వాల్ చాలా అప్రమత్తం అయ్యాడు. కానీ పగటి చుక్క తన కాళ్ళనూ, చేతులనూ తనే ఆ గుదిబండలోకి దూర్చి తాళం వేయాలి అని ప్రయత్నించడం చూసి, ‘ఇతను పిచ్చివాడో, లేక అజ్ఞానో అయిఉండాలి’ అనుకుని, పగటి చుక్క ప్రయత్నాన్ని మామూలుగా చూస్తూ ఉండిపోయాడు.

పగటి చుక్క గుదిబండలోకి కాళ్ళూ చేతులు దూర్చాలని ప్రయత్నించాడు. కానీ అడ్డదిడ్డంగా ప్రయత్నంచేసాడు కాబట్టి, అతని ప్రయత్నం ఫలించలేదు. పగటి చుక్క ప్రయత్నాన్ని గమనించే కొద్దీ, కొత్వాల్లో క్రమంగా ఉత్సుకత పెరిగింది. చివరికి చిరాకు కూడా కలిగింది. దాంతో

"అలా కాదు! ఇలాగ” అంటూ తనని తాను అందులో బంధించుకుని చూపించాడు.

వెంటనే పగటి చుక్క కొత్వాల్ ని కర్రతో లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. అంతే కొత్వాల్ స్పృహకోల్పోయాడు. పగటి చుక్క కొత్వాల్ ఇంటికెళ్ళి

"కొత్వాల్ ని దొంగ కొట్టి, గుదిబండలో పెట్టి తాళం వేశాడు. కొత్వాల్ స్పృహకోల్పోయాడు. ఆయన్ని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళండి” అని చెప్పాడు.

వెంటనే ఇంటిల్లిపాదీ హడావుడీగా, లబోదిబో మంటూ కొత్వాల్ దగ్గరకు వెళ్ళారు. పగటి చుక్క దర్జాగా, కొత్వాల్ ఇంటిలోని విలువైన సామాగ్రి మొత్తం దోచుకుని, అక్కడ ఇలా సమాచారం రాసాడు.

"మహారాజా! నా పేరు పగటి చుక్క. నేను ఒక దొంగను. మీరు నన్ను ఏ రకంగాను పట్టుకోలేరు.”

ఇదంతా తెలుసుకున్న రాజుకు పిచ్చెక్కేంత పని అయ్యింది.

"మంత్రివర్యా! వాడిని మీరే ఎలాగో, ఓలాగ పట్టుకోవాలి” అని చెప్పాడు రాజు.

ఇదంతా విన్న పగటి చుక్క. ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో

"చూడూ! పగటి చుక్క ఈ రోజు మన ఇంటికి దొంగతనానికి వస్తాడని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దాం. అలాగే పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టుకోటానికి. పగటి చుక్క నాలాగా వేషం వేసుకొని వస్తాడట” అని చెప్పాడు పగటి చుక్క.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టారు వాళ్ళంతా. వాళ్ళని “దొంగ వచ్చినట్టున్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక పెద్ద రాయి పడేసి. విలువైన వస్తువులను పక్కనే ఉన్న గుబురు పొదలో పడేసాడు పగటి చుక్క.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొంగా! వాణ్ణి పట్టుకొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు పగటి చుక్క.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లాడుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు. ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లాడటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గర స్నానం చేసి వస్తాను” అని చెప్పి, పగటి చుక్క పొదలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.

మర్నాడు జరిగిందంతా తెలుసుకున్న రాజుకు ఎం చేయాలో తోచలేదు. ఇంతలో అతిలోక సుందరి అయిన యువరాణి ఇలా అంది......

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

2 కామెంట్‌లు:

అశోక్ చౌదరి చెప్పారు...

Quite Interesting

ఉమాశంకర్ చెప్పారు...

కమెంటు రాయకపోయినా ప్రతిభాగం ఆసక్తిగా చదువుతున్నాను , కొనసాగించండి.