14, డిసెంబర్ 2008, ఆదివారం

రేచుక్క పగటి చుక్క - 3

(నిన్నటి కధ తరువాయి భాగం)

బుర్రకు పదును పెట్టిన రాజుకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. “సరే! ఒక పని చేయండి. దేశంలోని చెరువులు, నదులు అన్నిటి దగ్గర భటులను కాపలా ఉంచండి. నదులో తండ్రి బూడిద కలిపి, పిండం కాకులకు వేయడానికి పగటి చుక్క రాక తప్పదు. అప్పుడు పట్టుకోండి” అని చెప్పాడు రాజు.

చకచకా పగటి చుక్క తనేం చేయాలో లెక్కలు కట్టాడు. దాని ప్రకారం, ఈ సారి పగటి చుక్క పిచ్చివాడిలాగా, అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని, జుట్టు అంతా చింపిరిగా దువ్వుకొని, శ్మశానం ప్రక్కనున్న నది దగ్గరికి వెళ్ళాడు. ఒక సారి గట్టిగా అరిచి, ఒక సారి ఏడ్చి, ఒక్కసారిగా నవ్వి, అచ్చం పిచ్చివాడిలాగా ప్రవర్తించసాగాడు.

మొదట భటులు చాలా అప్రమత్తం అయ్యారు, కానీ రెండు నిముషాలకే అతను పిచ్చివాడులే అనుకుని అంతగా పట్టించుకోలేదు. పగటి చుక్క తండ్రి బూడిద మొత్తం తీసి ఒంటికి పూసుకుని, తలమీద పొసుకుని, నీళ్ళలోకి దిగి ఏవో పిచ్చిపాటలు పాడుతూ తెగ ఈతలు కొట్టాడు. అలా పిచ్చి వాడిలా నటిస్తూనే కట్టెల పొయ్యి మీద అన్నం వండాడు. వండిన అన్నాన్ని అన్ని వైపులకి విసిరేసి, పక్షుల కూతలు, జంతువుల అరుపులను అనుకరిస్తూ అరిచాడు. దాంతో కాకులు వచ్చి అతను చల్లిన అన్నం ముద్దలను తిన్నాయి. తరవాత పగటి చుక్క అన్నం వండిన కుండను పగలకొట్టి మళ్ళీ నీళ్ళల్లో స్నానం చేసి, పిచ్చివాడిలా ప్రవర్తిస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ రోజంతా చూసిన తరవాత భటులు, జరిగిన దంతా రాజుకు చెప్పారు. జరిగినది విన్న రాజుకు చిర్రెత్తుకొచ్చింది. “ఛ! ఆపాటి కనిపెట్టలేక పోయారా, వాడు పిచ్చివాడు కాదు, పగటి చుక్క అని? కానీ ఆ పగటి చుక్కని ఎలాగైనా పట్టుకోవాలి. సరే, దేశం అంతా దండోరా వేయించండి “ఎవరైనా శ్రాధ్దం పెట్టడానికి బ్రాహ్మణులని రమ్మని అడిగితే వెంటనే వాళ్ళగురించి మాకు తెలియచేయండి” అని. ఖచ్చితంగా శ్రాధ్దం పెట్టి, భోజనాలు చేసి వెళ్ళటానికి ఎవరైనా బ్రాహ్మణులను అతను ఆహ్వానిస్తాడు” అన్నాడు రాజు.

కానీ వీళ్ళ ఎత్తులన్నీ చిత్తుచేస్తూ, పై ఎత్తు వేసాడు పగటి చుక్క. ఊరి బైట సత్రం దగ్గర మాటువేసి ఉండసాగాడు. ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు పరదేశం నుండి ఆ దేశానికి వచ్చారు. వెంటనే పగటి చుక్క వాళ్ళని తన తండ్రికి శ్రాధ్దం పెట్టటానికి రమ్మని పిలిచాడు.

వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి. తన ఇంటికి తీసుకెళ్ళి తండ్రికి శ్రాధ్దం పెట్టించాడు పగటి చుక్క. బ్రాహ్మణుల భోజనాలు అయిపోయాక వాళ్ళకి చాలా ధనం ఇచ్చి, వాళ్ళ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టి సత్రం దగ్గర దింపి వెళ్ళిపోయాడు పగటి చుక్క.

చాలా ధనం వచ్చేటాప్పటికి వాళ్ళు చాలా ఆనంద పడుతూ ఊరిలోకి వచ్చారు. వాళ్ళ ఆనందం చూసిన భటులకు ఇక్కడేదో తేడాగా ఉంది, అని వాళ్ళ మనసుకు తోచింది. వెంటనే వాళ్ళు బ్రాహ్మణులను “బ్రాహ్మణోత్తమా! మీ సంతొషానికి కారణం ఏంటీ?” అని అడిగారు.

బ్రాహ్మణులు జరిగింది చెప్పారు. వాళ్ళు రాజు దగ్గరకు బ్రాహ్మణులను తీసుకెళ్ళారు. రాజు జరిగింది విని,

"సరే. విప్రోత్తములారా! ఆ దొంగ రూపు రేఖలు చెప్పగలరా?” అని అడిగాడు రాజు.

వెంటనే వాళ్ళు “క్షమించాలి మహారాజా! అతను తన మొహాన్ని ఒక వస్త్రంతో కప్పేసుకున్నాడు. కాబట్టి మేము చూడలేదు” అని చెప్పారు.

రాజు తల పంకించి, "ఈ దొంగ చాలా తెలివైన వాడిలాగా ఉన్నాడు. ఇతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలి. ఇది మనకొక సవాల్. కొత్వాల్! నీకీ పని అప్పగిస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి, అర్ధమైందా” అని రాజు చెప్పాడు. కొత్వాల్ కూడా అది తనకొక సవాల్ అనుకున్నాడు.

పగటి చుక్క కూడా అదే అనుకున్నాడు. ‘నన్ను పట్టుకుంటారా, చూస్తాను. మీ పరువు నిండునా పోయేట్టు చేస్తా’ అనుకున్నాడు.

ఆ రోజు రాత్రి...........

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

"మంగమ్మ శపధం" మరియు "చిక్కడు దొరకడు" సినిమాలకు మూలమా ఈ కధ ?

Aha!Oho! చెప్పారు...

ప్రదీప్ అన్నా,
అవునూ ఇది వాటికన్నా పురాతనమైన కధ

యోగి చెప్పారు...

ఇప్పుడే మీ ప్రొఫైల్ చూశాను. అమ్మో మీరు చాలా పెద్దవారండీ :)
ముచ్చటగా ఉంది మీరిలా రాయడం చూస్తుంటే. రాస్తూండండి.
యోగి