12, డిసెంబర్ 2008, శుక్రవారం

రేచుక్క పగటి చుక్క - 2

(నిన్నటి తరువాయి భాగం)

పగటి చుక్కను పట్టుకోడానికి ఒక మార్గం దొరికింది కదా అన్న ఆనందంతో రాజు ఇలా చెప్పాడు “సరే అయితే! ఒక పని చేయండి. ఈ తలలేని శవాన్ని, మన దేశం మొత్తం ఊరేగించండి. అలా దేశం మొత్తం తిప్పినప్పుడు ఎవరైనా ఈ మొండెంని చూసి ఏడ్చారంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ దొంగ కుటుంబం వారే అవుతారు.”

రాజు రేచుక్క శవాన్ని ఎం చేస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పగటి చుక్క కూడా మామూలు జనంతో పాటు రాజ దర్బారుకు వచ్చాడు. ఈ తీర్పువిని, ఇంటికి వెళ్ళగానే, రాజ దర్బారులో జరిగినది మొత్తం తల్లికి చెప్పి “అమ్మా! నాన్నగారి శవం మన ఇంటిదగ్గరకి వచ్చినప్పుడు నువ్వు ఎట్టి పరిస్తుతుల్లోనూ ఏడవకూడదు” అని చెప్పాడు.

"అది ఎలారా నాయనా? ఆయన నా భర్త. ఆయనతో ఇన్నాళ్ళు కాపురం చేసినదాన్ని. ఆయన శవాన్ని చూసి కూడా ఏడవకుండా ఉండడం నాకు సాధ్యం కాదురా” అన్నది నిశి.

ఆ మాటతో బాగా ఆలోచించి, పగటి చుక్క ఒక పధకం పన్నాడు. ఆ ప్రకారం చేయమని తల్లికి చెప్పాడు. ఆ వెంటనే తల్లి కొడుకులు ఇద్దరూ ఆ వీధిలోంచి వేరే వీధికి వెళ్ళారు. ఎక్కడ ఎవరూ వీళ్ళను గుర్తుపట్టరో ఆ వీధికి. ఊరేగింపు ఆ వీధిలోకి వస్తుండగా, పగటి చుక్క ఆ వీధిలోని ఒక మునగ చెట్టు ఎక్కి క్రిందికి దూకాడు. భర్త శవాన్ని చూడగానే నిశి ఒకటే ఏడ్చింది. భటులు వచ్చి “అమ్మా! మీరు ఏడవటనికి కారణం ఏమిటి?” అని అడిగారు.

"బాబూ! ఇదిగో వీడు నా కొడుకు పగటి చుక్క. ఈ చెట్టుపై నుండి వీడు క్రింద పడ్డాడు. అందుకని నేను ఏడుస్తున్నాను” అని చెప్పింది నిశి.

ఆ ఊరేగింపు ముందుకు సాగిపోయింది. అలా శ్మశానాన్ని చేరుకుంది. అక్కడ పఠిష్టమైన కాపలా పెట్టి, సేనాపతి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు.

"ఎవ్వరూ ఏడవలేదా?" అని అడిగాడు రాజు.

"లేదు ప్రభు! అందరూ మామూలుగానే చూసారు. ఇతని శవం చూసిన కారణంగా ఎవరూ ఏడవలేదు” అని చెప్పాడు సేనాపతి.

"మీరు సరిగ్గా గమనించారా! అది అసాధ్యం!” అన్నాడు రాజు.

"లేదు మహారాజా! ఎవ్వరూ ఏడవలేదు. ఒక 40 ఏళ్ళ యువతి మాత్రం ఆమె కొడుకు మునగ చెట్టు మీద నుండి క్రింద పడ్డాడని ఏడ్చింది తప్ప, ఈ శవాన్ని చూసి ఎవరూ ఏడవలేదు" అన్నాడు సేనాపతి.

అసలు ఏమి జరిగిందో విన్న రాజు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “బుద్దిలేని అడ్డగాడిదల్లారా! ఆ 40 ఏళ్ళ యువతి, దొంగ భార్య అయ్యుంటుంది. పగటి చుక్క, దొంగ కొడుకు అయ్యింటాడు. ఎందుకంటే ఈ దొంగకి 40 నుంచి 45 ఏళ్ళ వయసు ఉండచ్చు. అలా అన్నప్పుడు వాడికి 40 ఏళ్ళ భార్య, 20 ఏళ్ళ కొడుకు ఉండే అవకాశం ఉంది కదా. ఆ ఇద్దరూ కలిసి ఇంత నాటకం ఆడితే నమ్మేసి వస్తారా, బుద్ది లేదూ! ముందు ఆ వీధికి వెళ్ళి పగటి చుక్క గురించి కనుక్కోండి”అని చెప్పాడు రాజు. కాని రెండు నిముషాలకే భటులు వైఫల్యంతో తిరిగి వచ్చారు.

రాజు బాగా ఆలోచించి “సరే ఒక పని చేయండి! ఈ రోజు రాత్రికే ఈ శవాన్ని శ్మశానంలో చితి పేర్చి కాల్చండి. తనతో పాటూ తీసుకెళ్ళిన తలనుకూడా చితిలో భస్మం చేయడానికి పగటి చుక్క వస్తాడు. అది మన సాంప్రదాయం. దాన్ని ఎవరూ మీరరు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, అతన్ని మీరు పట్టు కోవచ్చు” అన్నాడు రాజు.

ఇదంతా దర్బారులో విన్న పగటి చుక్క ఒక చక్కని పధకం పన్నాడు. ఆ రాత్రికి పగటి చుక్క మొహం తప్పించి శరీరం మొత్తం కనిపించకుండా ఉండే నల్లని దుస్తులు వేసుకున్నాడు. మొహానికి నల్లని రంగు పూసుకున్నాడు. కాగడాలు వెలిగించి ఒక చేతిలో, ఒక రెండు కాగడాలు. ఒక చేతిలో, మరో రెండు కాగడాలు. వీపు దగ్గర, మరో రెండు కాగడాలు కట్టు కున్నాడు. ఒక నల్లని గుర్రం ఎక్కి, విచిత్రమైన అరుపులు అరుస్తూ శ్మశానంలోకి వచ్చాడు.

పగటి చుక్క అలా రావడం చూడగానే భటులు, అతన్ని కొరివి దయ్యం అనుకొని అక్కడి నుండి పారిపోయారు. పగటి చుక్క మూడుసార్లు తండ్రి చితి చుట్టూ గుర్రం మీద కుర్చునే ప్రదక్షణలు చేసి, రేచుక్క తల చితిలో పడేసి అక్కడి నుండి ఆఘమేఘాల మీద వెళ్లిపోయాడు.

మర్నాడు జరిగినదంతా విన్న రాజుకు ఒళ్ళు మండిపోయింది. “తెలివి తక్కువ దద్దమ్మల్లారా! ఆ వచ్చినది కొరివి దయ్యమూ కాదూ, గాడిద గుడ్డూ కాదూ. వచ్చినది పగటి చుక్క! అలా కాకపోతే వచ్చినవాడు, దొంగ చితి చుట్టూ ఎందుకు 3 సార్లు ప్రదక్షణలు చేస్తాడు? మీరు అనవసరంగా భయపడి అతని పని సులభం చేసారు. కాని వాడు ఎక్కడికి తప్పించుకుంటాడు! ఈ సారి, దొంగ బూడిద తీసుకెళ్ళటానికి తప్పకుండా పగటి చుక్క వస్తాడు. సేనాపతీ! జాగ్రత్తగా కాపలా కాయండి. రాత్రికి గుడారాలు వేసుకునైనా సరే, అక్కడే ఉండు” అన్చెప్పాడు రాజు.

పగటి చుక్క ఇందుకు కూడా ఒక చక్కని పధకం రచించాడు. పధకం ప్రకారం, ఆ రోజు రాత్రి పగటి చుక్క, సేనాపతి భార్యలాగా వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. భటులు సేనాపతి భార్యే వచ్చింది అనుకుని, పగటి చుక్కని గుడారం లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళగానే పగటి చుక్క నిద్రపోతున్న సేనాపతి నోట్లో ఒక పెద్ద గుడ్డముక్కని దూర్చేసి, అతనికి ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే, అతని కాళ్ళు చేతులు కట్టేసాడు.

ఆ గుడారంలో ఉన్న తండ్రి బూడిద, అస్థికలు తీసుకుని, భటులకు ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుతుండగా సేనాపతిని గుడారం బైట నుంచి ఎంత పిలిచినా పలకక పోయేటప్పటికి భటులు లోపలికి వెళ్ళి, సేనాపతి పరిస్థితి చూసిన భటులు, అతని కట్లు విప్పి రాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు.

రాజుకు అరికాలు మంట నెత్తికెక్కింది. “సన్నాసుల్లారా! చవటల్లార! వచ్చిన వాడు కాళ్ళూ, చేతులూ కట్టేస్తుంటే ఏంచేసావు. కట్టు బాబూ, కట్టు అంటూ కట్టించుకున్నావా” అని ఛడామడా తిట్టాడు రాజు. మళ్ళీ బుర్రకి పదును పెట్టిన రాజుకు ఇంకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది........

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

5 కామెంట్‌లు:

శ్రుతి చెప్పారు...

ఛాలా చక్కగా చెప్పారు కథను. నిజంగా చిన్నతనం మళ్ళీ గుర్తు వచ్చింది

aradhana చెప్పారు...

ending superb sir....

Aha!Oho! చెప్పారు...

శృతి అక్క......
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
aradhana అన్న......
నేను మీ కంటే చాలా చిన్నదాన్ని. అంతే కాదు నేను అమ్మాయిని, అబ్బాయిని కాదు. ఒకసారి నా ప్రొఫైల్ ను చూడండి.మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

Rajendra Devarapalli చెప్పారు...

బాగుందిరా కానివ్వు క్రమం తప్పకుండా చదువుతున్నాను
:)

Aha!Oho! చెప్పారు...

రాజేద్ర కుమార్ uncle,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!