6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 11

(నిన్నటి కధ తరువాయి భాగం)

[ఈ సారి కధలోని ముప్పావు దొంగ దొంగిలించే విధానం అంతా ఇంతక మునుపు నేను రాసిన కధ ‘రేచుక్క, పగటి చుక్క’ కధను పోలి ఉంటుంది. అందుకనే ఈసారి ముప్పావు దొంగదే కాక నిండు దొంగ దొగతనాన్ని కూడా రాస్తున్నాను. నిజానికి ఈ కధనే నిజం కధ. ‘రేచుక్క, పగటి చుక్క’ కధ దీట్లోంచీ, ఇంకా ఇలాంటి కొన్ని కధలలోని కొన్ని సన్నివేశాలు తీసుకుని తయారు చేసిన కధ అని గుర్తించగలరు.]

రాజు ఈ సారి దొంగని పట్టుకునే పనిని మంత్రికి అప్పగించాడు.

ఈ సారి కార్తికేయుడు ముప్పావు దొంగని ఒక ఘనమైన దొంగతనం చేయమని ఆదేశించాడు.

కుంతల నగరానికి వచ్చిన ముప్పావు దొంగ జరిగిందంతా విని, ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో

"చూడూ! దొంగ ఈ రోజు మన ఇంటికి దొంగతనానికి వస్తాడని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దాం. అలాగే పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టుకోటానికి. దొంగ నాలాగా వేషం వేసుకొని వస్తాడట” అని చెప్పాడు ముప్పావు దొంగ.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టారు వాళ్ళంతా. వాళ్ళని “దొంగ వచ్చినట్టున్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక పెద్ద రాయి పడేసి. విలువైన వస్తువులను పక్కనే ఉన్న గుబురు పొదలో పడేసాడు ముప్పావు దొంగ.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొంగా! వాణ్ణి పట్టుకొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు ముప్పావు దొంగ.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లాడుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు. ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లాడటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గర స్నానం చేసి వస్తాను” అని చెప్పి, ముప్పావు దొంగ పొదలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.


మంత్రి అయ్యుండీ అతను మరీ అంత ఘోరంగా అపహాస్యం పాలయ్యేటప్పటికి రాజుకు ఇంక ఏం చేయాలో పాలుపోలేదు. సరే అనుకుని ‘తనే దొంగని పట్టుకుంటానని’ రాజు ప్రకటించాడు.

అక్కడ మాతంగ పురంలో కార్తికేయుడు ముప్పావు దొంగ చేసిన దొంగతనానికి ఎంతో సంతోషపడ్డాడు. ఈసారి అందరికన్నా పెద్ద వాడైన నిండు దొంగని “దొంగతనం చేసి ఏదైనా తీసుకురా పో!” అని చెప్పి పంపించాడు.

నిండు దొంగ కుంతల నగరంకి వచ్చి వాకబు చేయగా రాజుగారే దొంగని పట్టుకుంటానన్నాడని తెలుసుకున్నాడు.

"ఓహ్హో! అలాగా!” అనుకుని తను చేయాల్సిన దొంగతనం ఎంటో? ఎలా చేయాలో? వేంటనే అంచనాలు వేసుకున్నాడు నిండు దొంగ.

ఆ రోజు రాత్రి నిండు దొంగ ఊరి చివర ఒక బడ్డి కొట్టు పెట్టుకుని, ఆ కొట్టుకు పక్కనే పడుకోడానికి రెండు పక్కలు వేసి, దీపం పెట్టుకుని, అక్కడ ఎదురు చూడడం మొదలుపెట్టాడు.

ఆ రోజు రాత్రి రాజు దొంగని పట్టుకోవాలన్న ఉద్దేశంతో గస్తీ తిరిగే భటులతోపాటూ తను కూడా వచ్చాడు.

ఊరి చివర ఉన్న ఆ బడ్డి కొట్టులోని దీపం చూసి రాజుగారూ, కొంత మంది భటులూ అక్కడికి వచ్చి ఆ పడుకోడానికి వేసి ఉన్న చాపలూ అన్నీ చూసారు. నిండు దొంగని “ఏయ్ అబ్బాయ్! ఇంత అర్ధ రాత్రి పూట ఎవరు వస్తారని నీ బడ్డి కొట్టు తెరిచి పెట్టుకున్నావు? ఆ చాపలు, దిండూ అవన్నీ ఎవరి కోసం పెట్టావు? నిజం చెప్పు” అని గద్దించాడు రాజు.

నిండు దొంగ భయపడుతూ భయపడుతూ “అయ్యా! క్షమించండి! కొన్నాళ్ళగా మన దేశంలో దొంగతనాలు చేస్తున్న ఆ దొంగలు రాత్రి పూట ఇక్కడికి వచ్చి, నేను తీసుకొచ్చిన భోజనం తిని, ఇక్కడే నిద్ర పోతారు. పొట్టకూటి కోసం ఈ బుద్ది తక్కువ పని చేసాను. నన్ను క్షమించండి” అంటూ బ్రతిమాలాడు.

"సరే! కానీ నువ్వు, మేము దొంగని పట్టుకోటానికి సాయం చేయాలి. ఏం, సరేనా?" అన్నాడు రాజు.

"అలాగే మహారాజా! కానీ మీ సైనికులంతా ఇక్కడ ఉన్నారంటే ఆ దొంగలు అట్నుంచీ అటే పారిపోతారు. కాబట్టి సైనికులని వెళ్ళి దూరంగా దాక్కోమనండి. ఈ దొంగ రాగానే సన్నగా ఈల వేస్తాను అప్పుడు వచ్చి పట్టుకోవచ్చు” అని చెప్పాడు నిండు దొంగ.

‘సరేలే’ అనుకుని రాజు ఆఙ్ఞ చేయగా సైనికులు వెళ్ళి దూరంగా దాక్కున్నారు.

ఐతే రాజు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మరి నిండు దొంగ నిజంగా తమని పిలుస్తాడో లేదో ఒక వేళ దొంగలతో చేతులు కలిపి తమని పిలవకపోతే?

నిండు దొంగ “మహారాజా! మీరు ఇదే వేషంలో ఇక్కడ కూర్చో నుండడం సబబు కాదు. మీరు ఇదుగో ఆ గోనె సంచీలో దాక్కోండి. కాకపోతే మీ బట్టలూ, నగలూ గుచ్చుకోకుండా ఈ మామూలు బట్టలు వేసుకోండి. అలా చేస్తే అప్పుడు దొంగ ఎవరూ ఇక్కడ లేరులే అనుకుని వస్తాడు” అని అన్నాడు.

రాజు అందుకు ఒప్పుకుని సంచీలో దూరాడు. నిండు దొంగ ఆ సంచీ మూతి బిగించి కట్టేసి రాజుగారి బట్టలూ, నగలూ తీసుకుని ఎంచక్కా తన దారిన తాను వెళ్ళిపోయాడు.

ఇంటికెళ్ళి కార్తికేయుడికి ఆ నగలు చూపగా అతను ఎంతో సంతోష పడ్డాడు.

ఇక్కడ రాజుగారు ఎంత సేపో ఎదురు చూసారు చడీచప్పుడు లేదు. కొంత సేపటికి ఆయన నిండు దొంగని పిలిచాడు. కానీ జవాబు లేదు. ఆయనకి అప్పుడు అనుమానం వచ్చి భటులను పిలవగా వాళ్ళు వచ్చి సంచీలో ఉన్న రాజుగారిని విడిపించారు.

ఏం జరిగిందో అందరికీ అర్ధం అయ్యింది. రాజుగారి పరువు నిండునా పోయింది” అని చెప్పి పయ్యెద………

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

కామెంట్‌లు లేవు: