25, జనవరి 2009, ఆదివారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 5

(నిన్నటి కధ తరువాయి భాగం)


గుడిలోకి వెళ్ళిన తంత్రలోహనుడు వెతకగా ఉత్తరదిశలో ఉన్న అమ్మాయి బొమ్మ దగ్గర మదనమోహనుడి ప్రలాపాలను చూసాడు.


మదనమోహనుడికి ఎంత చెప్పినా కూడా, ఆ విగ్రహన్ని, ‘నిజం అమ్మాయేననినమ్ముతున్నాడే గానీ బొమ్మ అని నమ్మటం లేదు.


చివరికి తంత్రలోహనుడికి విసుగు పుట్టింది. సరే అనుకుని ఆ గుడి పూజారి దగ్గరకెళ్ళి, "అయ్యా! అక్కడున్న ఆ విగ్రహంని ఎవరు చెక్కారు? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?" అని అడిగాడు.


పూజారి నాయనా! ఇక్కడికి 10 ఆమడల దూరాన సంగమేశ్వరీ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కోదండుడనే శిల్పాచారి ఉన్నాడు. అతను సంవత్సరం కొకసారి ఈ గుడికి వచ్చి పూజలు చేసి వెళ్తుంటాడు. అతనే ఆ శిల్పాన్ని చెక్కాడు అని చెప్పాడు.


"స్వామీ! నేను తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకూ నా మిత్రుడి అవసరాలు మీరే చూడాలి అని చెప్తూ తన మెడలోని నవరత్న ఖచితమైన మాలికని తీసి అతని చేతికిచ్చాడు.


తంత్రలోహనుడు కోదండుడి దగ్గరకెళ్ళి శిల్పాచార్యా! మందాకినీ పురం పరిసరాలలోని అడవిలోని గుడిలో ఒక అందమీన అమ్మాయి శిల్పాన్ని మీరు చెక్కారట. ఆ శిల్పాన్ని ఏ అమ్మాయిని చూసి చెక్కారు?" అని అడిగాడు.


"మానవోత్తమా! ఒక నెల క్రితం సూర్యాస్తమయం అయ్యాక ఒక కుమ్మరి నా దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఒక వజ్రం ఉంది. నిజానికీ ఆ వజ్రం ఇంద్రధనస్సులోని అన్ని రంగులనూ వెదజల్లుతూ చాలా అద్భుతంగా ఉంది. నేను నా కూతురి మెడలోని గొలుసు ఆ కుమ్మరికి ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకున్నాను. కానీ తెల్లారాక చూస్తే అది వజ్రం కాదు, గోరు. ఇంకేం చేస్తాను, శిల్పశాస్త్రం ప్రకారం ఆ గోరును చూసి మనిషిని ఊహించి వేసే అపూర్వ విద్య నాకు తెలుసు. ఆ విద్యప్రకారం ఆ శిల్పం చెక్కాను అని చెప్పాడు.


తంత్రలోహనుడు కుమ్మరి వాడి చిరునామా కనుక్కుని, కుమ్మరి వాడిని కలిసాడు. అయ్యా! మీరు కోదండుడు అనే శిల్పికి ఒక గోరును వజ్రం అని చెప్పి అమ్మారట కదా! ఆ గోరు మీకు ఎక్కడిది?” అని అడిగాడు.


ఆ ప్రశ్నకు కుమ్మరి వాడు అయ్యా! అది ఎంత భాదాకర సంఘటనో మీకు తెలియదు. అడవిలోంచి ఎవరో ఒక వేటగాడు వచ్చాడు. ఆ రాత్రి వేళ, నేను ఎలాగైతే శిల్పాచార్యుణ్ణి మోసం చేసానో అదే విధంగా వాడు ఆనాడు నన్ను మోసం చేసి, నాకు ఆ గోరుని అంటగట్టాడు. నా కూతురికి చక్కని గొలుసు చేయించి అందులో వజ్రాన్ని పొదుగించుకుందాం అనుకుని. నేను వాడి దగ్గర ఆ గోరుని తీసుకుని ఎన్నో కుండలు, పిడతలు ఇంకా ఏవేవో వస్తువులు ఇచ్చాను. మర్నాడు చూస్తే అది మామూలు గోరు. ఇంక ఏం చేయాలో పాలుపోక వాడు నన్ను ఎలా మోసం చేసాడో నేనూ అదే విధంగా శిల్పాచారిని మోసం చేసాను. కాకపోతే ఆయనకి నేను ఏ ఊరి నుండి ఆయన దగ్గరకు వచ్చానో తెలుసుగానీ నా ఇల్లేదో నేను చెప్పలేదు. మీకు ఎలా తెసింది?” అని అడిగాడు.


తంత్రలోహనుడు బాబూ! ఆయన నాకు మీ ఊరి పేరు మాత్రమే చెప్పారు. నేను అతికష్టం మీద వాకబు చేసి మీ చిరునామా తెలుసుకున్నాను అని చెప్పాడు.


తరవాత వేటగాడి గురించి వాకబు చేసి తంత్రలోహనుడు అతన్ని కలిసాడు. వేటగాడా! కుమ్మరి వాడికి నీవు ఒక గోరును వజ్రం అని అభద్ధం చెప్పి అమ్మావు. ఆ గోరు నీకు ఎక్కడిది?” అని అడిగాడు.


"అయ్యా! నేను కొన్నాళ్ళ క్రితం అడవిలోకి వేటకి వెళ్ళాను. కానీ ఒక్క జంతువూ దొరకలేదు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఒక చెట్టు క్రింద విశ్రమించాను. అలా నిద్రపోయిన నాకు మెలుకువ వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది. చూస్తే నా కంటి ఎదురుగా ఒక ప్రజ్వులితమైన వజ్రం కనిపించింది. ఆ వజ్రాన్ని నా యింటికి తీసుకెళ్ళాను. కానీ తెల్లారాక చూస్తే అది ఒక మామూలు గోరు. నేను ఆ గోరుని మోసం చేసి కుమ్మరి వాడికి అమ్మాను అని తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు.


కానీ ఇప్పుడు తంత్రలోహనుడికి కావలసింది వాడు తప్పు ఒప్పుకోవటం కాదు కనుక, ఆ విషయాన్ని పక్కన పెట్టి అతనికి గోరు దొరికిన చెట్టు దగ్గరికి వెళ్ళి విశ్రమించాడు. అప్పటి దాకా ఎవరినో ఒకరిని ఆ గోరు గురించి అడిగి తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అడగడానికి ఎవరూ లేరు కదా! అందుకని దిగాలుగా కూర్చున్నాడు. ఐతే ఆ చెట్టు మీద ఒక చిలుకల గుంపు నివసిస్తుంది. ఆ గుంపుకి ఒక రాజు కూడా ఉన్నాడు. మొత్తం 1000 చిలుకలకి రాజు ఐన సురేంద్రుడు తంత్రలోహనుడిని చూసి మానవేంద్రా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు? అసలు ఇంత రాత్రి ఇక్కడ ఎందుకున్నావు? ఈ అడవిలో ఎన్నో కౄర మృగాలుంటాయి. కనుక నీవు వాటి కంట పడకముందే ఇక్కడి నుండి దగ్గరలో ఉన్న ఏదైనా పట్టణానికి వెళ్ళిపో అని చెప్పింది.


తంత్రలోహనుడు తను ఎందుకు అక్కడికి వచ్చింది, అసలు మొత్తం ఏం జరిగిందీ అంతా చెప్పాడు.


(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)